యాప్నగరం

స్టైరీన్ విష వాయువుతోనూ సహజీవనం చేయాలా.. జగన్ సర్కార్‌పై పవన్ ఫైర్

విశాఖ గ్యాస్ లీక్ దుర్ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు పరిహారం ఇచ్చారుగానీ, సమస్యకు ఇంత వరకు వైసీపీ ప్రభుత్వం పరిష్కారం చూపలేకపోయిందని పవన్‌ కళ్యాణ్‌ విమర్శించారు.

Samayam Telugu 17 May 2020, 10:05 pm
విశాఖపట్నం ఎల్జీ పాలిమర్స్ స్టైరీన్ గ్యాస్ లీక్ దుర్ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలు, ప్రాణాపాయం నుంచి బయటపడ్డ వారికి పరిహారం ఇచ్చారుగానీ, ఆ ఫ్యాక్టరీ చుట్టుపక్కల నివసిస్తున్న 15 వేల మంది ప్రజల జీవన్మరణ సమస్యకు వైసీపీ ప్రభుత్వం ఇంత వరకు పరిష్కారం చూపలేకపోయిందని జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌ విమర్శించారు. విశాఖపట్నం ప్రజలు స్టైరీన్‌ విష వాయువుతో కూడా సహజీవనం చేయాలా? అని ఏపీ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఎల్‌జీ పాలిమర్స్‌ గ్యాస్‌ లీక్‌ ఘటనలో బాధితులకు పరిహారం ఇచ్చారు సరే.. పరిష్కారం ఎప్పుడు? నిలదీశారు. దైన్యంగా మిగిలిన బాధితులను తక్షణం ఆదుకోవాలని డిమాండ్‌ చేశారు.
Samayam Telugu పవన్ కళ్యాణ్


కరోనాతో కలిసి జీవించే పరిస్థితి తప్పదని చెబుతున్న ప్రభుత్వం.. స్టైరీన్‌ మృత్యువాయువుతో సైతం సహజీనం చేయాల్సిందేనని తన చర్యల ద్వారా చెప్పకనే చెబుతోందని పవన్‌ ఎద్దేవా చేశారు. పారిశ్రామిక వృద్ధి ముఖ్యమేనని.. కానీ, అదే సమయంలో ప్రజల ప్రాణాలు అంతకంటే ముఖ్యమని పవన్‌ అన్నారు. పారిశ్రామికాభివృద్ధి పర్యావరణ హితంగా, ప్రజల జీవన విధానం మెరుగుపడే విధంగా ఉండాలన్నారు. ప్రమాదానికి కారణమైన యాజమాన్యంపై నమోదు చేసిన క్రిమినల్ కేసులను చూసి నిపుణులు సైతం నివ్వెరపోతున్నారుని దుయ్యబట్టారు. ఆ కేసు దర్యాప్తులో ఇంత వరకు ఎటువంటి పురోగతీ కనిపించడం లేదన్నారు.

స్టైరీస్‌ గ్యాస్‌ పీల్చిన వారు భవిష్యత్‌లో ఎదుర్కోబోయే ఆరోగ్య సమస్యలు అన్నీ ఇన్నీ కావని, గ్యాస్ బాధితులకు శాశ్వత ప్రాతిపదికన ఆరోగ్య కార్డులు జారీ చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. పర్యావరణ హితంగా ఉండే పరిశ్రమలకు మాత్రమే ప్రభుత్వం అనుమతులు ఇవ్వాలని పవన్‌ డిమాండ్ చేశారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.