యాప్నగరం

వ్యక్తి ఆరాధన ఎంత మంచిదో, అంతే ప్రమాదకరం.. ఇకపై దేహి అంటే కుదరదు: పవన్ కళ్యాణ్

మంగళగిరిలోని జనసేన పార్టీ కార్యాలయంలో ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్‌పై రౌండ్‌ టేబుల్‌ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో జనసేనాని పవన్ కళ్యాణ్ పాల్గొని మాట్లాడారు.

Authored byసత్యానందం గుండెమాడుగుల | Samayam Telugu 25 Jan 2023, 9:07 pm
ఎవరైనా వివక్షకు గురైనప్పుడే దాని గురించి తెలుస్తుందని జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. వివక్షకు గురయ్యే కులాలను మనం అర్థం చేసుకోవాలన్నారు. మంగళగిరిలోని జనసేన పార్టీ కార్యాలయంలో ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్‌పై జరిగిన రౌండ్‌ టేబుల్‌ సమావేశంలో పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ.. వ్యక్తి ఆరాధన ఎంత మంచిదో.. అంతే ప్రమాదకరమన్నారు. ప్రతి మనిషి ఏదో ఒక సమయంలో వివక్షకు గురవుతారని.. వివక్షకు గురైనప్పుడే దాని గురించి తెలుస్తుందని పేర్కొన్నారు.
Samayam Telugu సమావేశంలో మాట్లాడుతున్న పవన్ కళ్యాణ్


సమాజాన్ని కొన్ని కోణాల్లోనే కాదు.. సమగ్రంగా చూడాలని పవన్ కళ్యాణ్ అన్నారు. జనాభాకు తగ్గట్టు బడ్జెట్‌లో కేటాయింపులు జరగాలని అభిప్రాయపడ్డారు. మన కష్టం, శ్రమకు తగ్గ ఫలితం ఉండాలన్నారు. ఎస్సీ, ఎస్టీలు దాదాపు 22 శాతం జనాభా ఉన్నా.. నిధులు ఇవ్వాలని ఇంకా కోరాలా అని ప్రశ్నించారు. ఇకపై దేహి అంటే కుదరదని.. పోరాటాలు చేసి తీసుకోవాలన్నారు. ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్‌ సంపూర్ణంగా అమలు జరగాల్సి ఉందన్నారు.


ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్‌ నిధులను ఎట్టిపరిస్థితుల్లోనూ దారి మళ్లించకూడదని పవన్ కళ్యాణ్ అన్నారు. ముఖ్యంగా బయటి శత్రువుల కన్నా మనతోటి ఉండే శత్రువులనే ముందుగా కనిపెట్టాలని.. మన హక్కులను కాలరాసే ఎవరినైనా ఎదుర్కోవాల్సిందేనని స్పష్టం చేశారు. సామాజిక పునర్నిర్మాణం చేయాలన్నదే తన తపన అని అన్నారు. నమ్మిన సిద్ధాంతానికి నిలబడి ఉండేవాడే నాయకుడన్నారు.

రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీలకు చెందిన 27 పథకాలు తీసేశారని చెబుతుంటే చాలా బాధేసిందని పవన్ కళ్యాణ్ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మూడేళ్లలో రూ. 20 వేల కోట్లు రాకుండా చేశారంటే ఏమనాలని ప్రశ్నించారు. ఎన్ని గొప్ప చట్టాలు, సంస్కరణలు తెచ్చినా ఆచరణలో పెట్టాలి కదా అని నిలదీశారు. ఆచరణలో పెట్టకపోతే చట్టాలు తెచ్చినా ప్రయోజనం ఉండదన్నారు. ఏపీ ప్రభుత్వం పబ్లిసిటీ కోసం రూ. 15 వేల కోట్లు ఖర్చు చేసిందని దుయ్యబట్టారు. ఎస్సీ, ఎస్టీ నిధులు వారికి రాకుండా దారి మళ్లించి మోసం చేస్తారా అని పవన్‌ కల్యాణ్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.
రచయిత గురించి
సత్యానందం గుండెమాడుగుల
సత్యానందం గుండెమడుగుల సమయం తెలుగులో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించిన తాజా, రాజకీయ వార్తలు, ప్రత్యేక కథనాలు అందిస్తుంటారు. సత్యానందంకు పాత్రికేయ రంగంలో 8 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థలో సెంట్రల్ డెస్క్‌లో పని చేశారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.