యాప్నగరం

తలపై తుపాకీ పెట్టి బెదిరించినా జనసేనను విలీనం చెయ్యను: పవన్

విజయవాడ లోక్‌సభ పరిధిలోని జనసైనికులతో పవన్ కళ్యాణ్ సమావేశం. ఎన్నికల్లో ఓడిపోయామన్న బాధ లేదన్న పవన్.. పోరాటంలో ఓ అడుగు ముందుకు వేశామని అనకుంటున్నాను అన్న జనసేనాని.

Samayam Telugu 16 Aug 2019, 4:40 pm
తన సినిమా, రాజకీయ ప్రయాణంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. సగటు మనిషిలా బతుకుదామనుకున్నానని.. కానీ అనుకోకుండా సినిమాలు, రాజకీయాల్లోకి వచ్చానని చెప్పారు. విజయవాడలోని జనసేన పార్టీ కార్యాలయంలో విజయవాడ లోక్‌సభ పరిధిలోని జనసైనికులత సమావేశమయ్యారు. భవిష్యత్ కార్యాచరణపై చర్చించారు. ఈ సందర్భంగా మాట్లాడిన పవన్ కళ్యాణ్ ఆసక్తికర విషయాలు చెప్పారు.
Samayam Telugu pawan


మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చినవాడిని.. జీవితంలోనూ సాదాసీదాగా ఉందామనుకున్నాను అన్నారు జనసేనాని. తర్వాత అనుకోకుండా సినిమాల్లోకి వచ్చానని.. తర్వాత నిజాయితీగా సంపాదించేవాళ్లు పడుతున్న కష్టాలను చూశానన్నారు. దౌర్జన్యాలు చేసేవాళ్లు సమాజంలో ఎక్కువయ్యారని.. అవన్నీ చూసినప్పుడు ఆవేదన కలిగిందన్నారు. ఆ వెంటనే రాష్ట్ర విభజన తర్వాత పరిస్థితి మారిపోయిందని.. స్వార్థ రాజకీయాలు ఎక్కువయ్యాయన్నారు.

తనను ఆదరించి.. అభిమానించే వాళ్లు దేశవ్యాప్తంగా చాలామంది ఉన్నారని.. తనకు విలాసవంతమైన జీవితం అనుభవించే అవకాశం ఉందన్నారు పవన్. డబ్బు కూడా బాగా సంపాదించుకోవచ్చని.. ఇలాగే బతికి చనిపోవచ్చు.. కానీ తాను అలా బతకలేనన్నారు. 2014లో పార్టీ పెట్టిన సమయంలో తన వెంట కొద్దిమంది మాత్రమే ఉన్నారని గుర్తు చేశారు. ఎన్నికల తర్వాత అందరూ ఓడిపోయామని బాధపడుతున్నారని.. తనకు ఆ బాధలేదని.. పోరాటంలో ఓ అడుగు ముందుకేశామని అనుకుంటున్నానని.. అందులో ఓటమి లేదన్నారు.

ప్రజలకు అన్యాయం జరగకూడదని జనసేన పార్టీని పెట్టానన్నారు జనసేన అధినేత. ఆ ప్రయాణంలో ఒడిదుడుకులు, అపజయాలు ఉంటాయి.. అవి జనసేనను అధికారంలో నిలబెడుతుందేమోనన్నారు. తన ఊపిరి ఉన్నంత వరకు పార్టీని నడిపిస్తానని.. అధికారం రావాలని పట్టు పట్టను.. ప్రజలకు న్యాయం చేయాలని పట్టు పడతానన్నారు. కిందిస్థాయి నుంచి ఎదగాలనే రాజకీయాల్లోకి వచ్చానని.. రాజకీయాల్లో ఉండాలంటే మాట నియంత్రణ ఉండాలని జనసైనికులకు సూచించారు. సోషల్ మీడియాను బజారులో తిట్టుకున్నట్లుగా మార్చేయకండని హితవు పలికారు. పార్టీ కొన్ని నిర్ణయాలు తీసుకుంటుందని.. ఒకవేళ ఎవరికైనా కొన్ని భావనలు ఉంటే వాటిని పార్టీకి చెప్పమని సూచించారు.

జనసేన పార్టీని తమ పార్టీలో కలిపేయని గతంలో తనపై ఒత్తిడి వచ్చిందన్నారు పవన్ కళ్యాణ్. జనసేనను ఏ పార్టీలోనూ విలీనం చేసే ప్రసక్తే లేదన్నారు.. తన తలపై తుపాకీ గురి పెట్టి బెదిరించినా విలీనం చేయనన్నారు. ‘తెలుగు దేశం పార్టీ తెలుగువారి ఆత్మగౌరవాన్ని కాపాడటానికి పెట్టిన పార్టీ.. టీఆర్ఎస్ తెలంగాణ హక్కుల సాధన కోసం పెట్టారు.. ఓ పార్టీ మా నాన్న ముఖ్యమంత్రి.. నేనూ సీఎం అయ్యాను’అంటూ జగన్‌పై సెటైర్లు పేల్చారు పవన్ కళ్యాణ్. జనసేన పార్టీని మాత్రం జాతి సమగ్రతని కాపాడటానికి, మానవతా విలువల కోసం జనసేన పార్టీని పెట్టానన్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.