యాప్నగరం

Janata Curfew: ప్రధాని మాట పాటిద్దాం.. జనసేనాని పిలుపు

ప్రధాని పిలుపు ఇచ్చిన జనతా కర్ఫ్యూను జనసేన అధినేత పవన్ కళ్యాణ్ హృదయపూర్వకంగా స్వాగతించారు. ప్రధాని మాటలను పాటిద్దాం.. కరోనాను తరిమికొడదాం అని ఆయన పిలుపునిచ్చారు.

Samayam Telugu 20 Mar 2020, 3:36 pm
కరోనా వైరస్‌ను అరికట్టడం కోసం ప్రధాని మోదీ ‘జనతా కర్ఫ్యూ’ అనే వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన సంగతి తెలిసిందే. ఆదివారం ఉదయం 7 గంటల నుంచి రాత్రి 9 గంటలకు ప్రజలంతా ఇళ్లకే పరిమితం కావాలని ప్రధాని మోదీ పిలుపునిచ్చారు. ప్రజల కోసం ప్రజల ద్వారా ప్రజలు జనతా కర్ఫ్యూను పాటించాలని ఆయన కోరారు. కరోనాపై పోరాటంలో ప్రధాని మోదీ సూచనలను తాను హృదయపూర్వకంగా స్వాగతిస్తున్నానని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తెలిపారు. ప్రధాని మాట పాటిద్దాం - కరోనా విముక్త భారతాన్ని సాధిద్దాం అని ఆయన పిలుపునిచ్చారు.
Samayam Telugu pk with modi


జాతిని ఉద్దేశించి మోదీ చేసిన సూచనలను జన సైనికులే కాక తెలుగు వారందరూ పాటించాలని పవన్ విజ్ఞప్తి చేశారు. ప్రధాని చెప్పినట్టుగా ఈ నెల 22న ఆదివారం నాడు జనతా కర్ఫ్యూగా పాటిద్దామని పిలుపునిచ్చారు. ఆ రోజు ఉదయం ఏడు గంటల నుంచి రాత్రి తొమ్మిది గంటల వరకు ఇళ్లకే పరిమితమవుదామన్నారు.

‘ప్రమాదమని తెలిసినప్పటికీ కరోనా మహమ్మారి నిర్మూలనకు క్షేత్రస్థాయిలో పని చేస్తున్న డాక్టర్లు, నర్సులు, పారా మెడికల్‌, వైద్య ఆరోగ్య సిబ్బంది, మీడియా వారు, పోలీసులు, పారిశుద్ధ్య కార్మికులు... ఇలా ప్రతి ఒక్కరికీ మనస్సులోనే కృతజ్ఞతలు తెలుపుతూ మన ప్రధాన మంత్రి చెప్పినట్లు ఆదివారం సాయంత్రం అయిదు గంటలకు మన ఇంటి బాల్కనీలలో నిలబడి కరతాళ ధ్వనులు ద్వారా వారికి మన సంఘీభావం తెలుపుదాం’ అని పవన్ పిలుపునిచ్చారు.

‘ఈ సందర్భంగా అమెరికాలో చూసిన నా అనుభవాన్ని మీతో పంచుకోవాలనుకుంటున్నాను. 2001 సెప్టెంబర్‌ 11న ట్విన్‌ టవర్స్‌ ను టెర్రరిస్టులు కూల్చి వేసినప్పుడు మరణించిన వారికి అంజలి ఘటించడానికి అమెరికన్లు అందరూ ఒకేసారి రోడ్లపైకి వచ్చి మృతులకు సంతాపం తెలిపారు. ఆ సమయంలో నేను అక్కడే ఉన్నాను. ఇది అమెరికన్ల కార్యక్రమం అయినప్పటికీ సాటి మనిషిగా నేనూ పాలుపంచుకున్నాను.

సామాజిక సంఘీభావ కార్యక్రమంలో మనమందరం మమేకమవడం మన విధిగా భావిస్తాను. మోదీ పిలుపునకు దేశమంతా స్పదించాలని కోరుకుంటున్నాను. నేను సైతం ఆ రోజు ఈ కార్యక్రమంలో పాల్గొంటూ... ఫేస్‌ బుక్‌ లైవ్‌ ద్వారా మీ ముందుకు వస్తాను. కరోనాపై పోరాటంలో మన ధృడ చిత్తాన్ని చాటుకుందాం’ అని జనసేనాని పిలుపునిచ్చారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.