యాప్నగరం

Pawan Kalyan: జనసైనికులారా, ఆ డేటా మొత్తం సిద్ధం చేసి పెట్టండి.. బిగ్ టాస్క్ ఇచ్చిన పవన్ కళ్యాణ్!

Janasena on AP Roads: జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ తమ పార్టీ కార్యకర్తలకు బిగ్ టాస్క్ అప్పగించారు. దెబ్బ తిన్న రోడ్లకు సంబంధించి అన్ని వివరాలనూ సేకరించాలంటూ..!

Samayam Telugu 7 Sep 2021, 7:05 am
ఆంధ్రప్రదేశ్‌లో వర్షాల వల్ల రోడ్లు పాడై పోయిన తరుణంలో.. రాజకీయ దుమారం చెలరేగుతోంది. రోడ్ల మరమ్మత్తులపై అధికారులకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాలు ఇచ్చిన నేపథ్యంలో జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ రియాక్ట్ అయ్యారు. వర్షాకాలం ముగిసిన వెంటనే అక్టోబర్ నెలాఖరు నుంచి రోడ్ల మరమ్మతులు చేపట్టాలని సీఎం జగన్ ఆదేశించిన తరుణంలో.. రోడ్ల దుస్థితిపై జనసేన చెప్తేగానీ కళ్లు తెరవరా అని పవన్ ప్రశ్నించారు. ఇకనైనా ఆలస్యం చేయకుండా పక్కా ప్రణాళికతో ముందుకెళ్లాలని సూచించారు. దెబ్బ తిన్న రోడ్లకు సంబంధించి అన్ని వివరాలనూ జనసైనికులు క్రోడీకరించాలన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో ప్రతి రోడ్డూ బాగుపడే వరకు జనసేన గళమెత్తుతుందని వెల్లడించారు. ఈ మేరకు జనసేనాని పవన్ కళ్యాణ్ సోమవారం ట్వీట్ చేశారు.
Samayam Telugu రోడ్ల దుస్థితిని వివరిస్తున్న జనసేనాని పవన్ కళ్యాణ్


‘‘రాష్ట్రంలో రహదారులు ఎంత అధ్వాన్నంగా ఉన్నాయో జనసేన నాయకులు, శ్రేణులు ఏకబిగిన సామాజిక మాధ్యమాల్లో వెల్లడిస్తేనే వైసీపీ ప్రభుత్వం కళ్లు తెరచి రోడ్ల మరమ్మతులు, నిర్మాణంపై ఆలోచన మొదలుపెట్టింది. లక్షల మంది రహదారి కష్టాలను చెప్పారు. వర్షాలు తగ్గాక అక్టోబర్ తర్వాత రోడ్డు మరమ్మతుల ప్రక్రియ మొదలుపెడతామని వైసీపీ ప్రభుత్వం వెల్లడించింది. అప్పుడు టెండర్లు పిలిచి, కాంట్రాక్టర్లను నిర్ణయించి పనులు మొదలుపెట్టాలంటే సంక్రాంతి వస్తుంది. ఇక పనులెప్పుడు పూర్తవుతాయో?


అప్పటి వరకూ ప్రజలకు ఈ గోతుల రోడ్లే గతి కావచ్చు. ఇప్పటి వరకూ రోడ్లపై ఈ ప్రభుత్వానికి ఎలాంటి దృష్టి లేదు. నిజంగా శ్రద్ధ ఉంటే వర్షాకాలం ముగిసిన వెంటనే పనులు మొదలయ్యేలా ప్రణాళికలు సిద్ధం చేసేవారు. ప్రతి జనసేన నాయకుడు, జన సైనికుడు తమ పరిధిలోని రోడ్లకు సంబంధించిన అన్ని వివరాలను క్రోడీకరించుకొని సిద్ధం చేసుకోవాలని సూచిస్తున్నాను.

ఏ రోడ్డు ఎన్ని కిలో మీటర్ల మేర దెబ్బ తిని ఉంది, మరమ్మతులతో బాగు చేయవచ్చా, పూర్తి స్థాయిలో అభివృద్ధి చేయాలా లాంటి వివరాలను సేకరించండి. ప్రభుత్వం చెప్పిన విధంగా అక్టోబర్ తర్వాత మీ పరిధిలోని రోడ్డుకు మోక్షం కలుగుతుందో లేదో చూసేందుకు, అభివృద్ధి చేయాల్సిన రోడ్డును మరమ్మతులతో సరిపెట్టే పక్షంలో ప్రశ్నించేందుకు ఈ వివరాలు అవసరం. జనసేన నాయకులు, శ్రేణులు సిద్ధం చేసే ఈ వివరాలతో ప్రతి రోడ్డూ బాగుపడే వరకూ జనసేన పార్టీ గళమెత్తుతుంది.’’ అని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.