యాప్నగరం

లాక్ డౌన్ తర్వాత భారీ ఉద్యమం.. జగన్ సర్కారుకు పవన్ హెచ్చరిక

విశాఖ గ్యాస్ లీక్ బాధితుల విషయంలో వైసీపీ ప్రభుత్వం సక్రమంగా స్పందించకపోతే భవన నిర్మాణ కార్మికుల కోసం చేసిన తరహాలో ఉద్యమిస్తామని జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ హెచ్చరించారు.

Samayam Telugu 18 May 2020, 7:24 pm
విశాఖపట్నంలో ఎల్‌జీ పాలిమర్స్ నుంచి విడుదలైన విషవాయువు స్టైరీన్ ప్రజా జీవితంపై దుష్ప్రభావం చూపించినా ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు బాధిత ప్రజలకు ధైర్యం ఇచ్చేలా లేదని జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌ అన్నారు. ఎల్‌జీ పాలిమర్స్ గ్యాస్ లీక్ బాధితుల విషయంలో వైసీపీ ప్రభుత్వం సక్రమంగా స్పందించకపోతే భవన నిర్మాణ కార్మికుల కోసం చేసిన తరహాలో ఉద్యమిస్తామని హెచ్చరించారు. లాక్ డౌన్ అనంతరం ప్రజా జీవితం సాధారణ స్థితికి వచ్చిన వెంటనే ఎల్‌జీ పాలిమర్స్ ప్రభావిత ప్రజల కోసం ఉద్యమిస్తామని వెల్లడించారు. స్టైరీన్ విష వాయువు ప్రభావిత ప్రాంత ప్రజలకు జనసేన అండగా నిలుస్తుందన్నారు. విశాఖపట్నం జిల్లా జనసేన నాయకులు, పార్టీ శ్రేణులతో సోమవారం పవన్ కళ్యాణ్ టెలీ కాన్ఫరెన్స్‌ నిర్వహించారు.
Samayam Telugu పవన్ కళ్యాణ్


ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ.. ప్రజల ఆశలతో ప్రభుత్వం ఆడుకోకూడదని హితవు పలికారు. మద్య నిషేధం అని చెప్పి అధికారంలోకి వచ్చారని, ఇప్పుడేం చేస్తున్నారో ప్రజలు చూస్తున్నారని పవన్‌ అన్నారు. ఇళ్ల స్థలాల విషయంలో పేదలను మభ్యపెట్టకుండా అర్హులందరికీ ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. ప్రభుత్వ ఆస్తుల వేలం, అధిక విద్యుత్‌ బిల్లులు, మద్యం అమ్మకాలపై క్షేత్ర స్థాయి నుంచి పోరాడాలని పార్టీ శ్రేణులకు సూచించారు.

డాక్టర్ సుధాకర్ విషయంలో ప్రభుత్వం పెద్ద మనసు చేసుకొని ఆయన్ను విధుల్లోకి తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు. ప్రజా ప్రతినిధులు, వైకాపా నాయకులు నోటికొచ్చినట్లు అసభ్యంగా మాట్లాడితే పనిచేయని చట్టం.. ఓ వైద్యుడి విషయంలో మాత్రం బలంగా పనిచేస్తోందని పవన్‌ ఎద్దేవా చేశారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.