యాప్నగరం

జనంలోకి పవన్ కళ్యాణ్.. 14 నుంచి వారాహి వాహనంలో..!

జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ వారాహి వాహనంలో జనంలోకి వచ్చేందుకు రంగం సిద్ధం చేశారు. తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో పవన్ కళ్యాణ్ ఈ నెల 14వ తేదీ నుంచి పర్యటించనున్నారు.

Authored byసత్యానందం గుండెమాడుగుల | Samayam Telugu 2 Jun 2023, 11:40 pm
జనసేన పార్టీ అధినేత పవన్‌ కళ్యాణ్‌ వారాహిపై ఈ నెల 14వ తేదీ నుంచి రాష్ట్ర పర్యటనకు శ్రీకారం చుడుతున్నారు. అన్నవరం సత్యదేవుని చెంత పూజలు నిర్వహించిన తర్వాత యాత్ర మొదలవుతుందని జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ (పీఏసీ) ఛైర్మన్ నాదెండ్ల మనోహర్‌ తెలిపారు. మొదటి విడతలో తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాల్లో పవన్‌ కళ్యాణ్ యాత్ర సాగనుందని చెప్పారు. ప్రతి నియోజకవర్గంలో రెండు రోజుల పాటు యాత్ర సాగేలా రూట్‌ మ్యాప్‌ ఖరారు చేశారు. పర్యటనలో భాగంగా వివిధ వర్గాల వారితో పవన్‌ కళ్యాణ్ ప్రత్యేకంగా సమావేశం కానున్నారు.
Samayam Telugu పవన్ కళ్యాణ్ (ఫైల్ ఫొటో)


ఈ క్రమంలో పవన్‌ కళ్యాణ్ యాత్రపై చర్చించేందుకు నాదెండ్ల మనోహర్‌ పార్టీ ముఖ్య నేతలతో శుక్రవారం మంగళగిరిలోని జనసేన కార్యాలయంలో సమావేశమయ్యారు. వారితో చర్చల తర్వాత పవన్ కళ్యాణ్ మొదటి విడత పర్యటన షెడ్యూల్‌, రూట్‌ మ్యాప్‌ ఖరారు చేశారు. తూర్పు గోదావరి జిల్లాలో ప్రత్తిపాడు, పిఠాపురం, కాకినాడ అర్బన్, కాకినాడ రూరల్, అమలాపురం, ముమ్మడివరం, రాజోలు, పి.గన్నవరం నియోజకవర్గాలు, పశ్చిమ గోదావరి జిల్లాలో పాలకొల్లు, భీమవరం, నర్సాపురం నియోజకవర్గాల్లో పవన్ కళ్యాణ్ పర్యటన సాగనుంది.

ప్రతి నియోజకవర్గంలో రెండు రోజులు సాగేలా యాత్ర ఉంటుందని నాదెండ్ల మనోహర్ వివరించారు. ఇది ఎన్నికల కోసం జరిగే ర్యాలీ కాదని, ప్రజల సమస్యలు తెలుసుకుని భరోసా నింపే యాత్ర అని స్పష్టం చేశారు. యాత్రలో భాగంగా వివిధ వర్గాల వారితో సమావేశాలు ఉంటాయని పేర్కొన్నారు. తప్పనిసరిగా వారాహి యాత్ర రాష్ట్ర ప్రజల్లో చైతన్యం, ధైర్యం నింపనుందని విశ్వాసం వెలిబుచ్చారు. రాష్ట్ర అభివృద్ధి, భవిష్యత్తు కోసం జరుగుతున్న యాత్రను జయప్రదం చేయాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ లక్ష్యంగా పవన్ కళ్యాణ్ రాష్ట్ర పర్యటన ఉంటుదన్నారు.

కాగా, పవన్ కళ్యాణ్ ఎన్నికల ప్రచారం కోసం వారాహి వాహనాన్ని ప్రత్యేకంగా డిజైన్ చేయించుకున్న విషయం తెలిసిందే. వాహనం చుట్టూ ప్రత్యేక లైటింగ్‌తో పాటు వెరీ హై ఎండ్ సెక్యూరిటీ సిస్టమ్‌ను ఏర్పాటు చేశారు. సభల్లో పవన్ కళ్యాణ్ ప్రసంగం స్పష్టంగా వినిపించేలా లేటెస్ట్ సౌండ్ సిస్టం, సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. రికార్డయ్యే ఫుటేజ్ ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన సర్వర్‌కి రియల్ టైంలో వెళ్లేలా ప్రజెంట్ టెక్నాలజీతో ఉపయోగించారు. వాహనం లోపల పవన్ కళ్యాణ్‌తో పాటు మరో ఇద్దరు కూర్చొని చర్చించుకునేలా.. అలాగే హైడ్రాలిక్ లిప్ట్ ద్వారా పవన్ వాహనంపైకి చేరుకునేలా సిస్టం అమర్చారు.
రచయిత గురించి
సత్యానందం గుండెమాడుగుల
సత్యానందం గుండెమడుగుల సమయం తెలుగులో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించిన తాజా, రాజకీయ వార్తలు, ప్రత్యేక కథనాలు అందిస్తుంటారు. సత్యానందంకు పాత్రికేయ రంగంలో 8 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థలో సెంట్రల్ డెస్క్‌లో పని చేశారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.