యాప్నగరం

జనసేన జెండాతో వారాహి వెంట నేనొస్తున్నా.. లక్ష్యసాధనలో సమిధనవుతా: నాగబాబు

జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఈ నెల 14 నుంచి వారాహి యాత్ర చేపట్టనున్నారు. ఈ నేపథ్యంలో వారాహి యాత్రను జయప్రదం చేయాలని పవన్ కళ్యాణ్ సోదరుడు, పార్టీ నాయకుడు నాగబాబు పిలుపునిచ్చారు.

Authored byసత్యానందం గుండెమాడుగుల | Samayam Telugu 9 Jun 2023, 12:20 am
జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ జూన్ 14వ తేదీ నుంచి ఎన్నికల ప్రచార వాహనం ‘వారాహి’లో యాత్ర ప్రారంభించనున్నారు. ఉభయ గోదావరి జిల్లాల్లో పవన్ కళ్యాణ్ రెండు రోజుల పాటు పర్యటించనున్నారు. ఈ క్రమంలో ‘వారాహి’ యాత్రపై పవన్ కళ్యాణ్ సోదరుడు, జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి కె.నాగబాబు సోషల్ మీడియా వేదికగా ఓ ప్రకటన విడుదల చేశారు.
Samayam Telugu నాగబాబు (ఫైల్ ఫొటో)


“ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో విప్లవాత్మక మార్పు కోసం శంఖారావం మోగించడానికి బయల్దేరుతోంది వారాహి. జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ చేపట్టనున్న వారాహి యాత్ర రాష్ట్ర రాజకీయాల్లో చరిత్ర సృష్టించబోతోంది. జన సైనికులు, వీర మహిళలు, నాయకులు, జనసేన శ్రేణులు సమిష్టిగా, సమాలోచనలతో వారాహి యాత్రను విజయవంతం చేస్తారని ఆశిస్తున్నాను. రాష్ట్రంలో నెలకొన్న దుర్భరమైన పరిస్థితులకు సంబంధించి ప్రజల్లో ఆలోచనాత్మకమైన చైతన్యం పెరుగుతోంది.

ప్రజలు కలిసి మెలసి జీవించే వాతావరణాన్ని కల్పించడానికి ఏర్పడ్డ రాజకీయం అనే పదాన్ని అడ్డు పెట్టుకొని కులాలుగా, మతాలుగా, ప్రాంతాలుగా, వర్గాలుగా విడదీస్తూ.. ఒక్కో పార్టీ, ఒక్కో నాయకుడు వారికి ఇష్టమొచ్చిన రీతిలో వాడేసుకుంటున్నారు. రాజకీయం అంటే అసలు నిర్వచనాన్ని అమలు చేయడానికి, ప్రజలంతా కలిసి మెలిసి జీవించే వాతావరణాన్ని సృష్టించడమే వారాహి యాత్ర ప్రధాన ధ్యేయం.


ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న అనిశ్చిత పరిస్థితుల నుంచి గట్టెక్కాలంటే జనసేన పార్టీ పాలన రావాల్సిందే అనే ఆశాభావంతో రైతులు, మహిళలు, యువత, విద్యార్థులు, ఉద్యోగస్తులు, వ్యాపారస్తులు ఇంకా అనేక వర్గాల ప్రజలు ఎదురు చూస్తున్నారు. పవన్ కళ్యాణ్ గారు ఒక వ్యక్తిగానే వేలాది మందికి ఆపన్నహస్తం అందిస్తున్న విధానాన్ని ప్రత్యక్షంగా చూస్తున్న ప్రజలు ఆయనకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి అనే శక్తిని అందజేస్తే ఇంకెంతో మందికి ఉపయోగకరమైన సేవలు అందిస్తారు అనే భావన ప్రజల్లో బలంగా నాటుకుంది.

ప్రజాధనం ఒక్క రూపాయి కూడా వృథా కాకుండా, అప్పులను అదుపు చేసి, అభివృద్ధి బాటలు వేయగల సమర్థత నిబద్ధత గల నాయకుడు, నిజాయితీపరుడు పవన్ కళ్యాణ్ గారు మాత్రమే అన్న అభిప్రాయం ప్రజల్లో బలంగా ఉంది. రాజకీయాల్లో, రాష్ట్ర పరిపాలన విధానాల్లో కచ్చితమైన జవాబుదారీతనం జనసేనతో మాత్రమే సాధ్యం అవుతుందనేది మేధావి వర్గాల అభిప్రాయం.

పవన్ కళ్యాణ్ గారు అన్ని ఆటుపోట్లను తట్టుకొని పదేళ్లుగా పార్టీని నడిపిస్తున్న నాయకత్వ పటిమతోనే రాష్ట్రాన్ని కూడా అభివృద్ధి పథంలో నడిపించగలరు. పవన్ కళ్యాణ్ గారికి మద్దతుగా జనసేన జెండా పట్టి వారాహి వెంట అడుగులు వేద్దాం. చారిత్రాత్మక ఘట్టంలో భాగస్వాములవుదాం.” అని నాగబాబు సోషల్ మీడియాలో ఓ ప్రకటన విడుదల చేశారు.

‘‘రేపటి తరం బాగుకోసం, వారాహిపై నా నాయకుడు బయల్దేరుతున్నాడు. నా నాయకుడి లక్ష్యసాధనలో ఒక చిన్న సమిధనై, జనసేన జెండాతో వారాహి వెంట నేను వస్తున్నాను. జూన్ 14నా అన్నవరంలో కలుద్దాం.’’ అని నాగబాబు అన్నారు.
రచయిత గురించి
సత్యానందం గుండెమాడుగుల
సత్యానందం గుండెమడుగుల సమయం తెలుగులో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించిన తాజా, రాజకీయ వార్తలు, ప్రత్యేక కథనాలు అందిస్తుంటారు. సత్యానందంకు పాత్రికేయ రంగంలో 8 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థలో సెంట్రల్ డెస్క్‌లో పని చేశారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.