యాప్నగరం

Rapaka: వైసీపీ ప్లీనరీలో రాపాక వరప్రసాద్.. జగన్ పార్టీ కండువా కప్పుకున్న జనసేన ఎమ్మెల్యే!

Rapaka Vara Prasad | జనసేన ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ పి.గన్నవరం వైఎస్సార్సీపీ ప్లీనరీలో పాల్గొన్నారు. చివరి నిమిషంలో వేదికపైకి వచ్చిన ఆయన మెడలో ఎమ్మెల్యే కొండేటి చిట్టిబాబు కుమారుడు వైసీపీ జెండా కప్పారు. అనంతరం మాట్లాడిన రాపాక.. జగన్‌ను మరోసారి అధికారంలోకి తీసుకురావాలని కోరారు.

Authored byరవి కుమార్ | Samayam Telugu 27 Jun 2022, 10:47 pm

ప్రధానాంశాలు:

  • పి.గన్నవరం నియోజకవర్గంలో వైఎస్సార్సీపీ ప్లీనరీ
  • కార్యక్రమంలో పాల్గొన్న జనసేన ఎమ్మెల్యే
  • రాపాక మెడలో వైసీపీ కండువా
హైలైట్స్ చదవాలంటే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి
Samayam Telugu Rapaka Vara Prasad
Rapaka Vara Prasad
ఇటీవల నిర్వహించిన మహానాడు భారీ సక్సెస్ కావడంతో టీడీపీ జిల్లాల్లో మినీ మహానాడులను నిర్వహిస్తోన్న సంగతి తెలిసిందే. దీంతో ప్రతిపక్షానికి కౌంటర్‌గా.. వైఎస్సార్సీపీ సైతం నియోజకవర్గాల్లో ప్లీనరీలను ఏర్పాటు చేస్తోంది. సోమవారం పి.గన్నవరం నియోజకవర్గంలో ప్లీనరీ నిర్వహించారు. పి.గన్నవరం మండలంలోని చాకలిపాలెంలో ఉన్న శ్రీకృష్ణా ఫంక్షన్ హాల్‌లో స్థానిక ఎమ్మెల్యే కొండేటి చిట్టిబాబు ఆధ్వర్యంలో ఈ ప్లీనరీ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎంపీలు పిల్లి సుభాష్ చంద్రబోస్, చింతా అనురాధ సహా.. పార్టీకి చెందిన పలువురు నేతలు హాజయ్యారు.
జనసేన ఏకైక ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ సైతం ఈ ప్లీనరీలో పాల్గొన్నారు. అంతే కాదు.. ఆయన వైఎస్సార్సీపీ కండువా కప్పుకొని మరీ వేదికపై కూర్చోవడం గమనార్హం. చివరి నిమిషంలో ఈ ప్లీనరీకి వచ్చిన రాజోలు ఎమ్మెల్యే అధికార పార్టీ కండువా కప్పుకోవడం చర్చనీయాంశమైంది.

ఈ సందర్భంగా రాపాక మాట్లాడుతూ.. అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్న జగన్‌ను మళ్లీ గెలిపించాలని పిలుపునిచ్చారు. తన నియోజకవర్గ పరిధిలో రోడ్ల కోసం జగన్ రూ.13 కోట్లకుపైగా నిధులు మంజూరు చేశారని.. రానున్న ఆరు నెలల్లో రోడ్లు పూర్తి స్థాయిలో కంప్లీట్ చేస్తామన్నారు.

గత ప్రభుత్వ హయాంలో జన్మభూమి కమిటీల ద్వారా దోచుకున్నారని.. ఇప్పుడు వాలంటీర్ వ్యవస్థతో నేరుగా అర్హులకు పథకాలు అందుతున్నాయని రాపాక ప్రశంసలు గుప్పించారు. పి.గన్నవరం ఎమ్మెల్యే కొండేటి చిట్టిబాబు కుమారుడు కొండేటి వికాస్.. రాపాక మెడలో వైసీపీ కండువా కప్పారు.

2019 అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన తరఫున గెలుపొందిన ఏకైక ఎమ్మెల్యే రాపాక అనే సంగతి తెలిసిందే. రాజోలు నుంచి ప్రాతినిధ్యం వహిస్తోన్న ఆయన.. గెలిచిన తొలినాళ్లలో అధికార పార్టీలో చేరేది లేదని తేల్చి చెప్పారు. జనసేనలో ఉంటే తానే నంబర్ 1 అని.. అదే వైఎస్సార్సీపీలోకి వెళ్తే.. తన నంబర్ 152 అని చెప్పారు. దీంతో జనసైనికులు ఫుల్ ఖుషీ అయ్యారు. కానీ కొంత కాలానికి ఆయన తీరు మారింది. అధికార పార్టీతో సన్నిహితంగా మెలగడం మొదలుపెట్టారు. వీలు కుదిరినప్పుడల్లా జగన్ పట్ల విధేయత చాటుకున్నారు. అంతే కాదు.. 2020 డిసెంబర్లో తన కుమారుడు వెంకట్రామ్‌ను జగన్ సమక్షంలో వైఎస్సార్సీపీలో చేర్పించారు.

వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఏ పార్టీ టికెట్ ఇచ్చినా పోటీ చేయడానికి అభ్యంతరం లేదని పరోక్షంగా వైఎస్సార్సీపీ తరఫున పోటీ సిద్ధమని ప్రకటించారు. తనకు పార్టీతో పని లేదని.. ప్రజాసేవతోనే పని అని రాపాక ఇటీవల వ్యాఖ్యానించారు.

జూన్ 29న రాజోలు నియోజకవర్గ స్థాయి ప్లీనరీ సమావేశం జరగనుండగా.. సోషల్ మీడియాలో రాపాక ఫొటోతో కూడిన ఫొటోతో ఆహ్వాన పత్రిక సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. రాజోలు ప్లీనరీ రాపాక ఆధ్వర్యంలో జరుగుతుందేమో..?
రచయిత గురించి
రవి కుమార్
రవి కుమార్ సమయం తెలుగులో ప్రిన్సిపల్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. స్పోర్ట్స్, ఏపీ, తెలంగాణకు సంబంధించిన వార్తలు, ప్రత్యేక కథనాలు అందిస్తుంటారు. ఆయనకు జర్నలిజంలో 12 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వార్తలు, ఎడ్యుకేషన్ సంబంధింత అంశాలను అందించారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.