యాప్నగరం

ప్రతి దాడులకు జనసైనికులు రెడీ: వైసీపీకి పవన్ వార్నింగ్

చిత్తూరు జిల్లాలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పర్యటన హై టెన్షన్ వాతావరణంలో కొనసాగుతోంది.

Samayam Telugu 4 Dec 2020, 5:20 pm
చిత్తూరు జిల్లాలో తన పర్యటనను అడ్డుకునేందుకు యత్నించిన అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. రైతాంగాన్ని పరామర్శించేందుకు వచ్చిన తనను అడ్డుకోవడం సరికాదన్నారు. దాడికి ప్రతిదాడి కావాలంటే జనసేన కార్యకర్తలు సిద్ధంగా ఉన్నారని హెచ్చరించారు. దమ్ముంటే రైతులను పరామర్శించే తన పర్యటన అడ్డుకోండంటూ వైసీపీ‌కి పవన్ సవాల్ విసిరారు.
Samayam Telugu జోరు వానలోనూ పవన్ పర్యటన


తాను పోలీస్ కుటుంబం నుంచి వచ్చానని.. కానీ, కొంత మంది పోలీసులు వైసీపీకి అనుగుణంగా వ్యవహరిస్తున్నారని పవన్ కళ్యాణ్ ఆరోపించారు. వైసీపీ నేతలు తీరు మార్చుకోక పోతే గుర్తుపెట్టుకుంటానని హెచ్చరించారు. ఆంధ్రప్రదేశ్ ఏమీ వైసీపీ నేతల జాగీరు కాదని.. నెల్లూరు జిల్లా అంటే తనకు ప్రత్యేక ఇష్టమని పవన్ చెప్పుకొచ్చారు.

మరోవైపు చిత్తూరు జిల్లాలో రెండో రోజు పర్యటనలో భాగంగా శ్రీకాళహస్తి నియోజకవర్గం పరిధిలోని పోయ గ్రామంలో పవన్ పర్యటించారు. భారీ వర్షం కురుస్తున్నా తడుస్తూనే పవన్ తన దూకుడు కొనసాగించారు. ఓ వైపు వైసీపీ శ్రేణులకు వార్నింగ్ ఇస్తూ, మరోవైపు తుఫాను ప్రభావిత రైతులను పరామర్శించారు. అనంతరం రైతులను ఉద్దేశించి మాట్లాడుతూ.. తుపాను కారణంగా నష్టపోయిన ప్రతి రైతుకి ప్రభుత్వం రూ.35 వేల పరిహారం ఇచ్చి తీరాలని డిమాండ్‌ చేశారు. రైతుల సమస్యలపై వారికి అండగా ఉండేందుకు ఎంతదూరమైనా వెళ్తామన్నారు. అంతకు ముందు తమ అధినేతకు స్వాగతం పలికేందుకు వచ్చిన కార్యకర్తలు, అభిమానులతో గూడూరు జాతీయ రహదారి పోటు పాళెం సర్కిల్ వద్ద కోలాహలం నెలకొంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.