యాప్నగరం

ఏపీ అసెంబ్లీలో అర్థవంతమైన చర్చల్లేకుండా ఈ దాడులేంటి: పవన్ కళ్యాణ్

అసెంబ్లీలో అర్థవంతమైన చర్చలు జరపకుండా ఈ దాడులు ఏంటని జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఫైరయ్యారు. ఈ మేరకు సోమవారం ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు.

Authored byసత్యానందం గుండెమాడుగుల | Samayam Telugu 20 Mar 2023, 5:01 pm
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, ప్రతిపక్ష తెలుగు దేశం పార్టీ ఎమ్మెల్యేల మధ్య ఘర్షణలపై జనసేన పార్టీ అధినేత పవన్‌ కళ్యాణ్‌ ఘాటుగా స్పందించారు. అర్థవంతమైన చర్చలు లేకుండా ఈ దాడులేంటని వైసీపీని ఉద్దేశించి పవన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు సోమవారం పవన్‌ కళ్యాణ్ ఓ ప్రకటన విడుదల చేశారు.
Samayam Telugu పవన్ కళ్యాణ్ (ఫైల్ ఫొటో)


‘‘ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభకు సంబంధించి మీడియా ద్వారా అందిన సమాచారం చూస్తే.. ఈ పరిణామాలు దురదృష్టకరమైనవి. ప్రజాస్వామ్య స్ఫూర్తికి విఘాతం కలిగించేవి. ప్రజల గొంతు నొక్కే జీవో నంబర్ 1పై చర్చను కోరిన ప్రతిపక్ష టీడీపీ శాసన సభ్యులపై అధికార పక్షం దాడి చేయడాన్ని ఖండిస్తున్నాను. ఎమ్మెల్యేలు డి.బి.వి.స్వామి, జి.బుచ్చయ్య చౌదరిలపై దాడిని ప్రజాస్వామ్యవాదులు ముక్తకంఠంతో ఆక్షేపించాలి.

చట్ట సభలలో అర్థవంతమైన చర్చలు చేసి ప్రజలకు మేలు చేస్తారని అందరం ఆశిస్తాం. పరిపాలన విధానాల్లో ప్రజా ప్రయోజనాలకు విరుద్ధంగా ఉన్న వాటిపై చర్చ చేయాలి. చర్చ కోసం పట్టుబడితే దాడి చేయడం భావ్యం కాదు. ఇదే పరిస్థితి కొనసాగితే ఈ విధమైన దాడులు చట్టసభల నుంచి వీధుల్లోకి వస్తాయి. ఇటువంటి పరిణామాలు ప్రజాస్వామ్యాన్ని పరిహాసం చేస్తాయి. ముందుగా చట్ట సభల గౌరవాన్ని, హుందాతనాన్ని కాపాడాల్సిన బాధ్యత సభా నాయకుడిగా ముఖ్యమంత్రిపైనా, సభ ప్రిసైడింగ్ ఆఫీషియల్స్ మీదా ఉంది.’’ అని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు.
రచయిత గురించి
సత్యానందం గుండెమాడుగుల
సత్యానందం గుండెమడుగుల సమయం తెలుగులో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించిన తాజా, రాజకీయ వార్తలు, ప్రత్యేక కథనాలు అందిస్తుంటారు. సత్యానందంకు పాత్రికేయ రంగంలో 8 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థలో సెంట్రల్ డెస్క్‌లో పని చేశారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.