యాప్నగరం

సోము వీర్రాజుకు జనసేన ఊహించని షాక్.. తిరుపతి ఉపఎన్నికలో అదిరిపోయే ట్విస్ట్!

Pawan Kalyan Janasena: తిరుపతి ఉప ఎన్నికల వ్యవహారం రోజుకొక మలుపు తిరుగుతోంది. తాజాగా, జనసేన నాయకుడు కిరణ్ కీలక వ్యాఖ్యలు చేశారు.

Samayam Telugu 20 Dec 2020, 3:59 pm
ఆంధ్రప్రదేశ్‌లో తిరుపతి ఉప ఎన్నిక వ్యవహారం రాజకీయంగా అగ్గిరాజేస్తోంది. ఇప్పటి వరకు అధికార ప్రతిపక్ష పార్టీల మధ్య మాటల యుద్ధం కొనసాగుతుండగా.. తాజాగా, మిత్రపక్షాలైన జనసేన, భారతీయ జనతా పార్టీల నాయకుల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీ తమ అభ్యర్థుల విషయంలో ఇప్పటికే ఓ అవగాహనకు వచ్చాయి. అయితే మూడో పక్షంగా ఉన్న జనసేన- బీజేపీ విషయంలో మాత్రం సందిగ్ధత నెలకొంది. అయితే ఇటీవల తిరుపతి ఉప ఎన్నికపై ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు చేసిన ప్రకటన సంచలనమైంది.
Samayam Telugu పవన్ కళ్యాణ్, సోము వీర్రాజు


కొద్ది రోజుల క్రితం తిరుపతి నిర్వహించిన ఓ సభలో పాల్గొన్న రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు సంచలన ప్రకటన చేశారు. తిరుపతిలో జనసేన మద్దతుతో నిలబడబోయే బీజేపీ అభ్యర్థిని గెలిపించాలంటూ సోము వీర్రాజు పిలుపు నిచ్చారు. బీజేపీ అభ్యర్థి గెలుపు కోసం కార్యకర్తలందరూ కృషి చేయాలని సోము వీర్రాజు అన్నారు.

ఈ ప్రకటనతో జనసేనలో ఒక్కసారిగా అలజడి రేగింది. జనసైనికులు బీజేపీ అధ్యక్షుడిపై ఫైరయ్యారు. ఈ తరుణంలో పవన్ కళ్యాణ్ డేరింగ్ డెసీషన్ తీసుకున్నారు. తిరుపతి ఉప ఎన్నికకు సంబంధించి బీజేపీ క్షేత్ర స్థాయిలో దూకుడుగా వెళ్తున్న సమయంలో.. ఆ పార్టీకి షాకిస్తూ తిరుపతి ఉప ఎన్నికకు సంబంధించి సమన్వయ కమిటీని నియమించారు. తిరుపతి లోక్‌సభ ఉప ఎన్నిక నేపథ్యంలో పార్లమెంటు స్థానం పరిధిలో పార్టీ పరంగా శ్రేణులను సమాయత్తపరిచి.. జనసేన కార్యక్రమాల నిర్వహణ కోసం కమిటీ వేస్తున్నట్లు పవన్ కళ్యాణ్ ప్రకటించారు.

ఈ వ్యవహారం చల్లారక ముందే, తాజాగా తిరుపతి ఉప ఎన్నిక విషయంలో సోము వీర్రాజు చేసిన వ్యాఖ్యలకు స్థానిక జనసేన నాయకుడు కిరణ్ కౌంటర్ ఇచ్చారు. తిరుపతి అభ్యర్థి ఎవరో బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజుకే తెలియదని వ్యాఖ్యానించారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి కామెంట్స్ గందరగోళానికి గురి చేస్తున్నాయని అన్నారు. తిరుపతిలో బీజేపీ కంటే జనసేన పార్టీ బలంగా ఉందని ఎన్నికలకు తమ పార్టీ సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు. తిరుపతి అభ్యర్థిని బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, జనసేనాని పవన్ కళ్యాణ్ కలిసి డిసైడ్ చేస్తారని వ్యాఖ్యానించారు. తిరుపతిలో బీజేపీ కంటే జనసేన బలంగా ఉందని, దీన్ని రాష్ట్రం, కేంద్ర కూడా గుర్తిస్తుందని చెప్పారు.

కాగా, బీజేపీ- జనసేన కూటమి నుంచి ఎవరు పోటీ చేయాలన్న అంశంపై ఇంకా స్పష్టత రాకముందే సోము వీర్రాజు ప్రకటన చేయడం ప్రస్తుతం హాట్‌ టాపిక్‌గా మారింది. మరోవైపు తిరుపతిలో పోటీ చేస్తామని ఇప్పటికే జనసేన నేతలు పలుమార్లు ప్రకటించారు. దీంతో బీజేపీ, జనసేన కూటమిలో తిరుపతి నుంచి ఎవరు బరిలో ఉంటారనేది ఆసక్తికరంగా మారింది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.