యాప్నగరం

ఆళ్లగడ్డలో కలకలం.. టీడీపీ కీలక నేత హత్యకు కుట్ర!

ఆళ్లగడ్డ టీడీపీ కీలక నేత ఏవీ సుబ్బారెడ్డి హత్యకు ఓ ముఠా కుట్రపన్నింది. ఈ హత్యా ప్రణాళికను పోలీసులు ఛేదించి, నిందితులను అరెస్టు చేశారు.

Samayam Telugu 21 Mar 2020, 10:17 pm
కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ టీడీపీ ముఖ్య నేత, సీడ్స్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ ఏవీ సుబ్బారెడ్డి హత్యకు ఓ ముఠా కుట్ర పన్నింది. దీనిపై పక్కా సమాచారం రావడంతో రంగంలోకి దిగిన కడప చిన్నచౌక్‌ పోలీసులు.. సుపారి తీసుకున్న గ్యాంగ్‌ను అరెస్ట్ చేశారు. కడప సిటీ బైపాస్‌ సమీపంలో ఈ గ్యాంగ్‌ను అరెస్ట్ చేశారు. ఆ ముఠా నుంచి రూ.3.20 లక్షల నగదు, ఓ పిస్తోలును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
Samayam Telugu av subbareddy


కాగా, ఏవీ సుబ్బారెడ్డి హత్యకు ఆ ముఠా రూ. 50 లక్షలు సుపారీ తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ వివరాలను కడప డీఎస్పీ సూర్యనారాయణ మీడియాకు వెల్లడించారు. అయితే ఈ గ్యాంగ్‌కు సుపారీ ఇచ్చిందెవరు? ఎందుకు హత్యకు కుట్రపన్నారు? కడపలో ఆ ముఠా ఏం చేస్తోంది? అనే విషయాలపై పోలీసులు విచారిస్తున్నట్లు తెలుస్తోంది.

కాగా, ఆళ్లగడ్డలో భూమా నాగిరెడ్డి మరణించినప్పటి నుంచి ఆయన కుమార్తె, మాజీ మంత్రి భూమా అఖిలప్రియకు, ఏవీ సుబ్బారెడ్డికి మధ్య నియోజకవర్గంలో ఆధిపత్య పోరు జరుగుతున్నట్లు తెలుస్తోంది. వాస్తవానికి భూమా నాగిరెడ్డికి ఏవీ సుబ్బారెడ్డి అనుచరుడిగా కొనసాగారు. అయితే ఆయన మరణించినప్పటి నుంచి నియోజకవర్గంలో పట్టు కోసం భూమా అఖిల ప్రియ, సుబ్బారెడ్డి మధ్య విభేదాలు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలోనే తనకు భూమా కుటుంబం నుంచి ప్రాణహాని ఉందని గతంలో ఏవీ సుబ్బారెడ్డి చెప్పారు. ఈ నేపథ్యంలోనే ఏవీ సుబ్బారెడ్డి హత్యకు సంబంధించి ఓ ముఠా రెక్కీ నిర్వహించడం సంచలనంగా మారింది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.