యాప్నగరం

కన్నాకి జైకొట్టిన ఏపీ బీజేపీ నేతలు.. జీవీఎల్‌‌తో విభేదాలు?

రాజధానిగా అమరావతికే ఏపీ బీజేపీ నేతలు జైకొట్టారు. సుదీర్ఘంగా జరిగిన కోర్ కమిటీ భేటీలో ఆ పార్టీ రాజ్యసభ్య సభ్యుడు జీవీఎల్ నరసింహారావుతో నేతలు విభేదించినట్లు సమాచారం.

Samayam Telugu 11 Jan 2020, 8:23 pm
ఏపీ రాజధానిగా అమరావతికి జైకొట్టారు ఏపీ బీజేపీ నేతలు. ఈ రోజు జరిగిన పార్టీ కోర్ కమిటీ సమావేశంలో రాజధాని అమరావతికి అనుకూలంగా ఏకగ్రీవంగా తీర్మానం చేశారు. సీడ్ క్యాపిటల్, సచివాలయం, రాజ్ భవన్, అసెంబ్లీ, సీఎంవో సహా విభాగాధిపతుల కార్యాలయాలన్నీ అమరావతిలోనే ఉండాలని తీర్మానం చేసినట్లు ఏపీ బీజేపీ చీఫ్ కన్నా లక్ష్మీనారాయణ తెలిపారు. సంక్రాంతి పండుగ తర్వాత అమరావతికి మద్దతుగా ప్రత్యక్ష పోరాటానికి దిగనున్నట్లు ఆయన ప్రకటించారు.
Samayam Telugu kanna-laxminarayana


పరిపాలన వికేంద్రీకరణ.. మూడు రాజధానుల పేరిట రాజధానిని అమరావతి నుంచి తరలించాలని వైసీపీ ప్రభుత్వం చూస్తోందని కన్నా విమర్శలు గుప్పించారు. రాజధాని అమరావతికి అప్పటి ప్రతిపక్ష నేతగా ఉన్న వైఎస్ జగన్ అంగీకరించారని.. 30 వేల ఎకరాలు అవసరమవుతాయని చెప్పారని గుర్తు చేశారు. ఇప్పుడు విశాఖను ఎగ్జిక్యూటివ్ రాజధానిగా చేయాలనుకోవడం మాట తప్పినట్లే అవుతుందన్నారు.

Also Read: విజయసాయి లెటర్.. అమిత్ షా ఆదేశాలు, చంద్రబాబుకు ఉచ్చు బిగుస్తోందా?

ప్రధాన మంత్రి మోదీ శంకుస్థాపన చేసిన రాజధానిని ఎలా తరలిస్తారన్న కన్నా.. అమరావతి రాజధాని విషయంలో టీడీపీ, వైసీపీ కుట్ర పూరితంగా వ్యవహరిస్తున్నాయని ఘాటు విమర్శలు చేశారు. అభివృద్ధి వికేంద్రీకరణకే బీజేపీ మద్దతిస్తుందని.. పరిపాలన వికేంద్రీకరణకు వ్యతిరేకమన్నారు. ప్రభుత్వం మారినప్పుడల్లా రాజధానిని మారిస్తే రాష్ట్రానికి పెట్టుబడులు ఎలా వస్తాయని బీజేపీ చీఫ్ ప్రశ్నించారు.

అయితే కోర్ కమిటీ భేటీ వేదికగా బీజేపీలో విభేదాలు బయటపడినట్లు తెలుస్తోంది. రాజధాని అంశంతో మనకు సంబంధం లేదని ఎంపీ జీవీఎల్ నరసింహారావు చేసిన వ్యాఖ్యలతో కోర్ కమిటీ సభ్యులు విభేదించినట్లు తెలుస్తోంది. రాష్ట్రంలో ప్రధాన పార్టీగా ఉంటూ ఇక్కడి వ్యవహారాలతో సంబంధం లేదనడం సరికాదని వారు సూచించినట్లు సమాచారం. ఏపీ బీజేపీ చీఫ్ కన్నా, ఎంపీ సుజనా చౌదరి సహా రాష్ట్ర నేతలు అమరావతికి మద్దతుగా మాట్లాడుతుండగా.. రాజధాని వ్యవహారంతో కేంద్రానికి సంబంధం లేదని జీవీఎల్ వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే.

Read Also: 18న క్యాబినెట్, 20న అసెంబ్లీ.. రాజధానిపై జగన్ స్ట్రాటజీ అదుర్స్

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.