యాప్నగరం

రాజకీయ వైకుంఠపాళిలో గెలిచి ఓడిన కోడెల

మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద రావు ఆత్మహత్యకు పాల్పడ్డారు. డాక్టర్‌గా జీవితాన్ని ప్రారంభించిన ఆయన రాజకీయ జీవితం తొలినాళ్లలో అద్భుతమైన వ్యక్తిగా పేరొందారు. కానీ చివర్లో మాత్రం ఆయనపై రకరకాల ఆరోపణలు వచ్చాయి.

Samayam Telugu 16 Sep 2019, 3:35 pm
రాజకీయం ఒంటబడితే.. అదే సర్వస్వం అవుతుంది. ఎంత మంచి మనిషికైనా.. రాజకీయమే జీవితం అవుతుంది. కోడెల విషయంలోనూ అదే జరిగింది. దిగువ మధ్యతరగతి కుటుంబంలో పుట్టి.. తోబుట్టువుల మరణాలను తట్టుకోలేక ఆయన డాక్టర్ అయ్యారు. తన హస్తవాసితో పల్నాడు ప్రాంత వాసుల అభిమానాన్ని చురగొన్నారు. డాక్టర్‌గా కెరీర్ ఉచ్ఛస్థితిలోనే ఉండగానే.. రాజకీయాల పట్ల ఆసక్తి లేకున్నా సరే.. ఎన్టీఆర్ పిలుపుతో తెలుగుదేశం పార్టీలో చేరారు. 1983 నుంచి 1999 వరకు నర్సరావుపేట నియోజకవర్గం నుంచి వరుసగా ఆరుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు.
Samayam Telugu kodela5


ఎన్టీఆర్, చంద్రబాబు నాయుడు మంత్రివర్గాల్లో కీలక బాధ్యతలు నిర్వర్తించిన కోడెల.. 2004, 2009 ఎన్నికల్లో ఓడారు. 2014 ఎన్నికల్లో సత్తెనపల్లి నుంచి గెలిచిన ఆయన.. అసెంబ్లీ స్పీకర్ అయ్యారు. ఇప్పటి వరకూ ఆయనపై ఎన్ని విమర్శలు వచ్చినా.. అవేవీ అంత తీవ్రమైనవి కాదు. కానీ స్పీకర్‌గా ఎన్నికయ్యాక.. కోడెల దూకుడు పెరిగిందనే ఆరోపణలున్నాయి. దీనికి ఆయన సంతానం కూడా కారణమనే వార్తలొచ్చాయి.

స్పీకర్‌గా ఉన్నతమైన స్థానంలో ఉన్న కోడెల.. అసెంబ్లీ ఫర్నీచర్‌ను తన ఇంటికి, ఆఫీసులకు మళ్లించడం అందర్నీ ఆశ్చర్యపరిచింది. ఈ ఫర్నీచర్‌కు డబ్బులు చెల్లిస్తానని ఆయన చెప్పినా సరే.. ఆయన ఇలాంటి పని చేశారేంటని అనిపించింది. టీడీపీ హయాంలో ఆయన మాటకు తిరుగులేకపోయింది. కానీ.... ఎన్నికల తేదీ నుంచి ఆయన బ్యాడ్ టైం స్టార్టయ్యింది.

ఎన్నికల రోజున ఓ పోలింగ్ బూత్ నుంచి ఒంటి మీద చొక్కా చిరిగిన స్థితిలో ఆయన్ను బయటకు లాక్కొని వచ్చిన దృశ్యాలు ఆశ్చర్యపరిచాయి. కోడెల రిగ్గింగ్‌కు పాల్పడ్డారని వైఎస్ఆర్సీపీ శ్రేణులు ఆరోపించాయి. వైఎస్ఆర్సీపీ అధికారంలోకి రావడంతో.. వివాదాస్పదుడనే ముద్ర కోడెలపై పడింది.

అసెంబ్లీ ఫర్నీచర్ తరలింపు వ్యవహారం.. కే-ట్యాక్స్ పేరిట డబ్బులు వసూలు చేస్తున్నారనే ఆరోపణలతో కోడెలపై, ఆయన కుటుంబ సభ్యులపై కేసులు నమోదయ్యాయి. ఈ వ్యవహారాల్లో పార్టీ కూడా ఆయనకు ఒకింత దూరం జరిగింది. మరోవైపు రాజకీయ ఒత్తిళ్లు ఎక్కువయ్యాయి. దీంతో ఆయనకు గుండెపోటు వచ్చిందని చెప్పి గుంటూరులోని హాస్పిటల్లో చేర్పించారు. ఇటీవలే ఆయన హైదరాబాద్ వచ్చారు. సోమవారం నాడు ఇలా.. ఆత్మహత్యకు పాల్పడ్డారు.

మంచి డాక్టర్‌గా పల్నాడు ప్రాంతంలో జీవితాన్ని ప్రారంభించిన కోడెల శివ ప్రసాద రావు.. రాజకీయాల్లోకి అడుగుపెట్టాక పల్నాడు పులిగా అభిమానులతో పిలిపించుకున్నారు. కానీ ప్రత్యర్థులపై పట్టుకోసం తప్పుడు దారిలో నడిచారు. రాజకీయాలే.. ఊపిరిగా బతికిన ఆయన.. చివరకు రాజీపడలేక.. బలవన్మరణానికి పాల్పడ్డారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.