యాప్నగరం

మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన కోనసీమ సమితి.. క్షణక్షణం ఉత్కంఠ: అష్టదిగ్బంధంలో అమలాపురం

అమలాపురంలో ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. జిల్లాను పోలీసు బలగాలు చుట్టుముట్టాయి. అయినా, కూడా ఆందోళనకారులు బుధవారం ఆందోళనలకు పిలుపునివ్వడం చర్చనీయాంశమైంది.

Authored byసత్యానందం గుండెమాడుగుల | Samayam Telugu 25 May 2022, 10:00 am
కోనసీమ జిల్లా మార్పు అంశంపై ఆందోళకారుల నిరసనలతో అమలాపురం అట్టుడికిపోతోంది. మంగళవారం మంత్రి పినిపె విశ్వరూప్, వైసీపీ ఎమ్మెల్యే సతీష్ కుమార్ ఇళ్లను ఆందోళనకారులు ధ్వంసం చేసి, నిప్పు పెట్టడం రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశమైంది. ఆ హింసాత్మక దృశ్యాలు కళ్ల ముందే కదులుతున్న తరుణంలో కోనసీమ సాధన సమితి వివాదాస్పద నిర్ణయం తీసుకుంది.
Samayam Telugu అమలాపురంలో పరిస్థితిని సమీక్షిస్తున్న సిద్ధార్థ్ కౌశల్


అమలాపురంలో ఓవైపు ఇప్పటికే తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్న తరుణంలో.. బుధవారం ఉదయం 10 గంటలకు అమలాపురం కలెక్టరేట్ సమీపంలోని నల్ల వంతెన వద్దకు భారీగా ప్రజలు చేరుకుని, నిరసన చేపట్టాలని కోనసీమ సాధన సమితి పిలుపునిచ్చింది. దీంతో అమలాపురంలో బుధవారం ఏం జరుగుతుందనే విషయంపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. అమలాపురంలో పోలీసులు ఇదివరకే 144 సెక్షన్ అమలు చేస్తున్నా.. మంగళవారం పెద్ద ఎత్తున ఆందోళనకారులు మూకుమ్మడిగా చేరి, ఏకంగా ప్రజాప్రతినిధుల ఇళ్లకే నిప్పు పెట్టడం కలకలం రేపుతోంది.

అష్టదిగ్బంధంలో అమలాపురం
ఈ తరుణంలో బుధవారం మరోసారి కోనసీమ సాధన సమితి నిరసన ప్రదర్శనలు చేపట్టాలని పిలుపునివ్వడం అందరిలోనూ టెన్షన్ రేకెత్తిస్తోంది. ఈ క్రమంలో అమలాపురంలో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్న తరుణంలో హోంశాఖ అప్రమత్తమైంది. శాంతిభద్రతలను అదుపులోకి తీసుకొచ్చేందుకు జిల్లాకు అదనపు బలగాలను పంపిస్తున్నట్లు రాష్ట్ర డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి వెల్లడించారు. ఏలూరు రేంజ్ డీఐజీ పాలరాజు అమలాపురం చేరుకొని పరిస్థితిని సమీక్షిస్తున్నారు. అలాగే, సీనియర్ ఐపీఎస్ అధికారి సిద్ధార్థ్ కౌశల్‌ను రంగంలోకి దించిన పోలీసు శాఖ.. పట్టణంలో భారీగా బలగాలను మోహరిస్తున్నారు.

మరోవైపు కోనసీమ జిల్లా వ్యాప్తంగా 144 సెక్షన్ కొనసాగుతోంది. మంగళవారం అల్లర్లకు పాల్పడిన వారిలో కొందరిని గుర్తించి అదుపులోకి తీసుకున్నట్లు పోలీసుల చెబుతున్నారు. జిల్లాలో ఇంటర్నెట్ సేవలు కూడా నిలిపేశారు. రోడ్లపైకి వచ్చిన ఎవరైనా ఆందోళనకు దిగితే అరెస్టు చేసి కేసులు పెడతామని పోలీసులు హెచ్చరిస్తున్నారు. అమలాపురంలో ప్రస్తుతం పరిస్థితి అదుపులో ఉందని పోలీసులు తెలిపారు.
రచయిత గురించి
సత్యానందం గుండెమాడుగుల
సత్యానందం గుండెమడుగుల సమయం తెలుగులో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించిన తాజా, రాజకీయ వార్తలు, ప్రత్యేక కథనాలు అందిస్తుంటారు. సత్యానందంకు పాత్రికేయ రంగంలో 8 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థలో సెంట్రల్ డెస్క్‌లో పని చేశారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.