యాప్నగరం

సీఎం జగన్‌కు బెణికిన కాలు.. సాయంత్రానికి పెరిగిన నొప్పి!

సీఎం జగన్మోహన్ రెడ్డి కాలు బెణికడంతో.. కాలు నొప్పి పెరిగింది. దీంతో సీఎం జగన్ వైఎస్సార్ జిల్లా పర్యటన రద్దయింది. గతంలో కూడా సీఎం జగన్‌కు ఇలాగే కాలు బెణికింది.

Authored byసత్యానందం గుండెమాడుగుల | Samayam Telugu 4 Apr 2023, 8:29 pm
ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డికి కాలు బెణికింది. సీఎం జగన్ కాలినొప్పి కారణంగా బుధవారం వైఎస్సార్‌ జిల్లా పర్యటన రద్దు అయ్యింది. మంగళవారం ఉదయం సీఎం జగన్ ఎక్సర్‌సైజ్‌ చేస్తున్న సమయంలో కాలు బెణికింది. మధ్యాహ్నం వరకు బాగానే ఉన్నా.. సాయంత్రానికి సీఎం జగన్‌కు కాలు నొప్పి పెరిగింది.
Samayam Telugu సీఎం జగన్‌కు బెణికిన కాలు


గతంలో కూడా సీఎం జగన్మోహన్ రెడ్డికి ఇలానే కాలికి గాయం అయ్యింది. దీంతో చాలా రోజుల పాటు సీఎం బాగా ఇబ్బంది పడ్డారు. ఇప్పుడు మళ్లీ కాలినొప్పి రావడంతో ప్రయాణాలు రద్దు చేసుకోవాలని డాక్టర్లు సూచించారు. దీంతో బుధవారం ఒంటిమిట్ట పర్యటనను అధికారులు రద్దు చేశారు.


కాగా, 2021 సెప్టెంబర్ 24న ఎప్పటి మాదిరిగానే ఉదయం సీఎం జగన్ వ్యాయామం చేస్తున్న సమయంలో కాలు బెణికింది. సాయంత్రానికి నొప్పి తగ్గకపోవడంతో డాక్టర్లు విశ్రాంతి తీసుకోవాలని సూచించారు. దీంతో ముఖ్యమంత్రి అప్పటికప్పుడు ఢిల్లీ పర్యటనను రద్దు చేసుకున్నారు.

కాగా, ఒంటిమిట్ట శ్రీ కోదండరామాలయంలో శ్రీ‌రామ‌న‌వ‌మి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఏప్రిల్ 5వ తేదీన శ్రీ సీతారాముల క‌ల్యాణం జరుగనుంది. కల్యాణోత్సవం సందర్భంగా బుధవారం సాయంత్రం 4.30 గంటల నుంచి 5.30 గంటల వరకు ఎస్వీ సంగీత, నృత్య కళాశాల అధ్యాపకులు, అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారులు కలిసి శ్రీరామ నామామృతం భజన కార్యక్రమం నిర్వహిస్తారు. సాయంత్రం 6.15 గంటల నుంచి రాత్రి 7.45 గంటల వరకు ఎస్వీ సంగీత, నృత్య కళాశాల ప్రిన్సిపల్ శ్రీమతి ఉమా ముద్దుబాల పర్యవేక్షణలో శ్రీరామకృతులు నృత్య కార్యక్రమం నిర్వహిస్తారు.

రాత్రి 8 గంటలకు శ్రీ సీతారాముల కల్యాణం ప్రారంభమవుతుంది. ముందుగా భగవత్‌ విజ్ఞాపనం, సభ అనుజ్ఞ, లోకకల్యాణం కోసం సంకల్పం చేయిస్తారు. అగ్నిప్రతిష్టాపన తర్వాత మంగళాష్టకం, చూర్ణిక పఠిస్తారు. ఆ తర్వాత మాంగళ్యసూత్ర పూజ, మంగళసూత్రధారణ, అక్షతారోపణం చేస్తారు. స్వామి నివేదన, వేదస్వస్తి, మహదాశీర్వచనంతో కల్యాణఘట్టం పూర్తవుతుంది. కల్యాణం అనంతరం రాత్రి 11 గంటలకు గజవాహన సేవ నిర్వహిస్తారు. ఈ కల్యాణోత్సవంలో సీఎం జగన్ పాల్గొనాల్సి ఉండగా.. కాలు బెణకడంతో పర్యటన రద్దయింది.
రచయిత గురించి
సత్యానందం గుండెమాడుగుల
సత్యానందం గుండెమడుగుల సమయం తెలుగులో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించిన తాజా, రాజకీయ వార్తలు, ప్రత్యేక కథనాలు అందిస్తుంటారు. సత్యానందంకు పాత్రికేయ రంగంలో 8 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థలో సెంట్రల్ డెస్క్‌లో పని చేశారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.