యాప్నగరం

పవన్ కళ్యాణ్ మాట్లాడుతుండగా కరెంట్ కట్.. చివరికి, సెల్‌ఫోన్ లైట్ల వెలుగులో..!

జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ మీడియా మాట్లాడుతున్న సమయంలో కరెంటు పోయింది. దీంతో పవన్ చిరునవ్వులు చిందిస్తూ మొబైల్‌లో లైట్లు ఆన్ చేసి మాట్లాడారు.

Authored byసత్యానందం గుండెమాడుగుల | Samayam Telugu 21 May 2022, 7:06 am
జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతున్న సమయంలో కరెంట్ పోయింది. దీంతో పవన్ కళ్యాణ్‌ సహా అక్కడున్న వారంతా గందరగోళానికి గురయ్యారు. తర్వాత తేరుకుని పవన్ కళ్యాణ్ ప్రభుత్వ పనితీరును విమర్శిస్తూ.. చిరునవ్వులు చిందిస్తూ సెల్ ఫోన్ వెలుగులోనే మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా వచ్చే ఎన్నికల్లో పొత్తులపై పవన్ మరింత క్లారిటీ ఇచ్చారు.
Samayam Telugu పవన్ కళ్యాణ్


ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ఓడించేందుకు వచ్చే ఎన్నికల్లో ఓట్లు చీలనివ్వకుండా అన్ని రకాల ప్రయత్నాలు చేస్తానని కుండబద్ధలు కొట్టారు. రాజధాని విషయంలో బీజేపీ అధినాయకత్వాన్ని ఒప్పించినట్లే.. ఓట్ల చీలిక విషయంలోనూ బీజేపీ హైకమాండ్‌ను ఒప్పించే ప్రయత్నం చేస్తానని వెల్లడించారు. రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యానే ఓట్లు చీలనివ్వకుండా నిర్ణయం తీసుకున్నట్లు పవన్ వివరించారు. ఎవరితో పొత్తులకు వెళ్లాలో తమకు వైసీపీ చెప్పాల్సిన అవసరం లేదని హితవు పలికారు.


ఓట్లు చీలనివ్వబోమన్న చిన్న పదానికే వైసీపీ నేతలు ఎందుకు భయపడుతున్నారో చెప్పాలని పవన్ కళ్యాణ్ డిమాండ్ చేశారు. ఏపీలో ముందస్తు ఎన్నికలపై ఇప్పుడే ఏం చెప్పలేనని వ్యాఖ్యానించారు. ఇక, రాష్ట్రంలో ఎక్కడ పోటీ చేసినా తనను ఓడిస్తామన్న వైసీపీ నేతల ఛాలెంజ్‌ను స్వీకరిస్తున్నట్లు పవన్ వెల్లడించారు. ఓడలు బండ్లు అవుతాయని.. బండ్లు ఓడలవుతాయన్న సంగతి తనను విమర్శించిన మాజీ మంత్రులకు ఇప్పటికైనా తెలిసుండాలని ఎద్దేవా చేశారు.

తనను తిడితే పదవీ కలకాలం నిలవదన్న విషయాన్ని వైసీపీ నేతలు గ్రహించే ఉంటారని పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు. ఇక, ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ (సీపీఎస్‌) విధానానికి చర్చల ద్వారానే పరిష్కారం లభిస్తుందని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. రూ. లక్షల కోట్లు విదేశాలకు తరలించే తెలివితేటలున్నపుడు.. సీపీఎస్‌ సమస్యను పరిష్కరించే తెలివి ఉండవా అని జగన్ ప్రభుత్వాన్ని పవన్ కళ్యాణ్ నిలదీశారు.
రచయిత గురించి
సత్యానందం గుండెమాడుగుల
సత్యానందం గుండెమడుగుల సమయం తెలుగులో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించిన తాజా, రాజకీయ వార్తలు, ప్రత్యేక కథనాలు అందిస్తుంటారు. సత్యానందంకు పాత్రికేయ రంగంలో 8 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థలో సెంట్రల్ డెస్క్‌లో పని చేశారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.