యాప్నగరం

నల్లజర్ల: లారీని ఢీకొన్న కారు.. ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు మృతి

చిన్నారికి పుట్టువెంట్రుకలు తీయించేందుకు తిరుమలకు వెళ్తున్న ఓ కుటుంబాన్నిమృత్యుదేవత కబళించింది. వారు ప్రయాణిస్తోన్న వాహనం ఎదురుగా వస్తున్న లారీ ఢీకొట్టడంతో ఆరుగురు చనిపోయారు.

Samayam Telugu 20 Sep 2019, 3:00 pm
పశ్చిమగోదావరి జిల్లా నల్లజర్ల వద్ద శుక్రవారం ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు మృతి చెందగా మరో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. విశాఖ జిల్లా పెందుర్తికి చెందిన నీలకంఠరావు కుటుంబం గురువారం రాత్రి తిరుమలకు బయలుదేరింది. రాత్రికి అన్నవరంలో బసచేసిన వీరు తిరిగి శుక్రవారం ఉదయం 8 గంటలకు ప్రయాణం ప్రారంభించారు. వీరు ప్రయాణిస్తోన్న వాహనం నల్లజర్ల వద్ద ఎదురుగా వస్తున్న లారీని బలంగా ఢీ కొట్టింది. ఈ ఘటనలో భార్యాభర్తలు నీలకంఠరావు (55), లక్ష్మీ (50) అక్కడికక్కడే చనిపోయారు. వీరి మనవరాలు తనూజ(3), మనవడు జ్ఞానేశ్వర్‌ (8నెలలు) ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందారు.
Samayam Telugu accident


తీవ్రంగా గాయపడిన వారి అల్లుళ్లు రామకృష్ణ(45), అప్పలరాజు(35) ఏలూరు ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచారు. ఈ ప్రమాదంలో గాయపడిన మణికంఠ, రమాదేవి, నీలిమ, రేష్మ, యశ్విన్‌లు ఏలూరు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. జ్ఞానేశ్వర్‌ పుట్టు వెంట్రుకలు తీయించడానికి తిరుపతికి వెళ్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకున్నట్లు వారు తెలిపారు.

ప్రమాదం జరిగిన వెంటనే గాయపడిన వారిని స్థానికులు హుటాహుటిన ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించే ప్రయత్నం చేశారు. పోలీసులకు సమాచారం అందడంతో వారు ఘటనా స్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను వైద్యం కోసం హాస్పిటల్‌కు తరలించారు. అతివేగమే ప్రమాదానికి కారణమని భావిస్తున్నారు. వేగంగా కారు నడిపి ఎదురుగా వస్తున్న వాహనాన్ని గమనించకపోవడం వల్లే ప్రమాదం చోటుచేసుకుందని పోలీసులు అన్నారు. కేసు నమోదుచేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. మృతదేహాలను పోస్ట్‌మార్టం కోసం ఏలూరుకు తరలించారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.