యాప్నగరం

BJP, Janasenaలను కలిపింది ఈయనే.. 2024లో పవన్ సీఎం కావడం పక్కానట!

Pawan Kalyanను తిరిగి బీజేపీకి దగ్గర చేసింది కర్ణాటకకు చెందిన బీజేపీ నేత బీఎల్ సంతోష్ అని ఆయన శిష్య సమానుడైన ప్రతాప్ సింహా తెలిపారు. 2024లో పవన్ తప్పకుండా సీఎం అవుతారని ఆయన ఆశించారు.

Samayam Telugu 16 Jan 2020, 10:00 pm
ఏపీలో జనసేనతో కలిసి నడవాలని బీజేపీ నిర్ణయించింది. ఇరు పార్టీలు కలిసి ఇక మీదట సమస్యలపై ఉమ్మడిగా పోరాటం చేయనున్నాయి. ఎన్నికల ముందు బీజేపీపై ఓ రేంజ్‌లో విరుచుకుపడిన పవన్ కళ్యాణ్.. తిరిగి కాషాయం వైపు మొగ్గు చూపడానికి అనేక కారణాలు ఉన్నాయి. పార్టీని కాపాడుకోవడం అనేది ప్రధాన కారణం కాగా.. బీజేపీ కూడా అంతే బలంగా పవన్‌తో పొత్తును కోరుకోవడం రెండో కారణం. బీజేపీ, జనసేన మధ్య పొత్తు కుదిరేలా చక్రం తిప్పింది మాత్రం బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బీఎస్ సంతోష్. ఈ విషయాన్ని మైసూరు ఎంపీ ప్రతాప్ సింహా వెల్లడించారు. 2024 ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ తప్పకుండా ఆంధ్రా సీఎం అవుతారని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు.
Samayam Telugu pawan jp nadda


కర్ణాటకలోని ఉడిపికి చెందిన బీఎస్ సంతోష్‌ సుదీర్ఘ కాలం పాటు ఆరెస్సెస్‌లో పని చేశారు. మీడియా ముందుకు రావడానికి ఆయన ఇష్టపడరు. యడ్యూరప్ప సొంత పార్టీని పెట్టుకున్న సమయంలో ఆయన కర్ణాటకలో బీజేపీని ముందుండి నడిపారు. ఆయన కచ్చితంగా కర్ణాటక సీఎం అవుతారని బీజేపీ నేతలు భావిస్తారు. ఆయనకు భార్యా పిల్లలు లేరు. ఎంతో నిబద్ధతతో పార్టీ కోసం పని చేస్తారు. పుస్తకాలను అమితంగా చదివే సంతోష్‌కు పర్యావరణం, చైనాతో సంబంధాలు, రక్షణ, సైద్ధాంతిక భిన్నత్వం లాంటి అంశాల పట్ల ఆసక్తి ఎక్కువ.

బీజేపీ బలహీనతలేంటో తెలుసుకున్న సంతోష్.. గత దశాబ్ద కాలంలో కర్ణాటకలో పార్టీ ఎదగడానికి శ్రమించారు. ప్రతి జిల్లాలోనూ ఆయనకు నెట్‌వర్క్ ఉంది. ఈశాన్య రాష్ట్రాలు, గోవా, తమిళనాడు, కేరళ రాష్ట్రాల్లో ఆయన పని చేశారు. అమెరికా నుంచి తిరిగొచ్చిన జనార్ధన స్వామి చిత్రదుర్గ నుంచి ఎంపీగా పోటీ చేసి గెలవడానికి, విజయ కర్ణాటక దినపత్రికలో ట్రైనీ జర్నలిస్ట్‌గా జీవితాన్ని ప్రారంభించిన ప్రతాప్ సింహా మైసూరు నుంచి ఎంపీ కావడానికి, బెంగళూరు సౌత్ నుంచి తేజస్వి సూర్య అనూహ్యంగా పోటీ చేసి విజయం సాధించడానికి కారణం ఈయనే.

పవన్ ఢిల్లీకి వెళ్లడానికి కొద్ది రోజుల ముందు ఆయన శిష్యులైన ప్రతాప్ సింహా, తేజస్వి సూర్య వచ్చి జనసేనానిని కలిసి వెళ్లారు. పవన్ ఢిల్లీలో నడ్డాను కలిసిన సమయంలో సంతోష్ కూడా ఉన్నారు.

బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా పని చేసే వ్యక్తి పార్టీకి, ఆరెస్సెస్‌కు మధ్య అనుసంధాన కర్తలా వ్యవహరిస్తారు. ఇంజినీరింగ్ చదివిన సంతోష్ 1993లో ఆరెస్సెస్‌లో చేరారు. కన్నడ, తుళు భాషలతోపాటు ఇంగ్లిష్, హిందీ, తమిళం భాషల్లో మాట్లాడగలరు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.