యాప్నగరం

ప్రియురాలిని కాల్వలోకి నెట్టి చంపేసిన ప్రేమోన్మాది.. అనంతపురంలో దారుణం

ప్రేమపెళ్లికి పెద్దలు నిరాకరించడంతో ప్రియుడు ఆత్మహత్య చేసుకుందామనుకున్నాడు. తనతో కలసి ఆత్మహత్య చేసుకునేందుకు ప్రియురాలు ఒప్పుకోలేదని దారుణానికి తెగబడ్డాడు.

Samayam Telugu 26 Nov 2020, 2:32 pm
విజయవాడ దివ్య తేజస్విని, విశాఖ యువతి హత్య ఘటనలు మరువక ముందే ఏపీలో మరో ప్రేమోన్మాది ఘాతుకానికి తెగబడ్డాడు. తనతో కలసి ఆత్మహత్య చేసుకునేందుకు నిరాకరించిందన్న కోపంతో ప్రియురాలిని దారుణంగా చంపేశాడు. ఈ అత్యంత అమానుష ఘటన అనంతపురం జిల్లాలో జరిగింది. కళ్యాణదుర్గం మండలం చాపిరికిచెందిన దూదేకుల షాహిదాబేగం(20), అదే గ్రామానికి చెందిన బెస్త రఘు(20) కొద్దికాలంగా ప్రేమించుకుంటున్నారు. పెళ్లి చేసుకుందామనుకున్నారు.
Samayam Telugu రఘు, షాహిదా
anantapur murder


ఇద్దరి ప్రేమ విషయం తెలిసిన ఇరువురి కుటుంబ సభ్యులు పెళ్లికి నిరాకరించారు. ఇద్దరికీ వేర్వేరుగా వివాహాలు నిశ్చయించారు. షాహిదాకి అనంతపురం సమీపంలోని కామర్లపల్లికి చెందిన యువకుడితో నిశ్చితార్థం జరిపించారు. ఈ నెల 21న వివాహం జరగాల్సి ఉంది. ప్రియుడు రఘుకి విడపనకల్లు మండలం హావళిగికి చెందిన యువతితో పెళ్లి నిశ్చయించారు. ఇద్దరికీ పెళ్లిళ్లు నిశ్చయం కావడంతో రఘు ఆత్మహత్య చేసుకుందామని నిర్ణయానికి వచ్చాడు. పురుగులమందు తాగి ఆత్మహత్యాయత్నం చేశాడు.

అయితే యువతి బలవన్మరణానికి ఒప్పుకోలేదని తెలుస్తోంది. పురుగుల మందు తాగేసిన రఘు ఆస్పత్రిలో చికిత్స పొంది ఇంటికి వచ్చాడు. తనతో కలసి పురుగుల మందు తాగకుండా మరొకరితో వివాహానికి సిద్ధమైందని షాహిదాపై కోపం పెంచుకున్నాడు. ఈ నెల 17న రాత్రి సమయంలో మాట్లాడాలని ఆమెను పిలిపించాడు. ఆమెను బైక్ ఎక్కించుకుని కణేకల్లు మండలం మాల్యం గ్రామం వద్దకు తీసుకెళ్లి తనను పెళ్లి చేసుకోవాలంటూ బలవంత పెట్టినట్లు తెలుస్తోంది. అందుకు ఆమె నిరాకరించిందని హెచ్‌ఎల్‌సీ కాల్వలో తోసేశాడు. నీటి ఉధృతికి ఆమె కొట్టుకుపోయింది.

Also Read: ఒంటరి బావమరిదిపై బావ కన్ను.. మందుపార్టీకి తీసుకెళ్లి..

ఇంటికి తిరిగివచ్చిన రఘుని యువతి తల్లిదండ్రులు ప్రశ్నించినా సరైన సమాధానం చెప్పకుండా దాటవేశాడు. కూతురు ఇంటికి రాకపోవడంతో కంగారుపడిన తల్లిదండ్రులు చుట్టుపక్కల వెతికారు. ప్రయోజనం లేకపోవడంతో 19న పోలీసులను ఆశ్రయించారు. రఘుపై అనుమానం ఉందని చెప్పడంతో అతన్ని అదుపులోకి తీసుకుని ప్రశ్నించడంతో దారుణం వెలుగులోకి వచ్చింది. కణేకల్లు మండలం తుంబిగనూరు వద్ద కాల్వలో తేలియాడుతున్న యువతి మృతదేహాన్ని గుర్తించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Read Also: పెళ్లి మండపంలో దంపతుల పాడుపని.. కామారెడ్డిలో షాకింగ్ ఘటన

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.