యాప్నగరం

చిరంజీవికి సీఎం జగన్ రాజ్యసభ సీటు ఆఫర్.. ఫుల్ క్లారిటీ ఇచ్చిన మెగాస్టార్!

ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాజ్యసభ ఆఫర్ చేసినట్లు వస్తున్న వార్తలపై మెగాస్టార్ చిరంజీవి శుక్రవారం ఫుల్ క్లారిటీ ఇచ్చారు.

Samayam Telugu 14 Jan 2022, 5:32 pm
ప్రముఖ సినీ నటుడు, కేంద్ర మాజీ మంత్రి చిరంజీవికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సీటు ఆఫర్ చేసిందని శుక్రవారం జోరుగా వార్తలు వెలువడ్డాయి. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డితో సినీ ఇండస్ట్రీ సమస్యలు చర్చించేందుకు మెగాస్టార్ చిరంజీవి గురువారం భేటీ అయిన నేపథ్యంలో రాజ్యసభ సీటుపై ఊహాగానాలు వెలువడ్డాయి. కొన్ని మీడియా సంస్థల్లో చిరంజీవికి రాజ్యసభ సీటు ఖరారైందని బ్రేకింగ్ వార్తలు సైతం ఇచ్చేశాయి.
Samayam Telugu సీఎం జగన్‌తో మెగాస్టార్ చిరంజీవి


ఈ క్రమంలో రాజ్యసభ సీటుపై వస్తున్న ఊహాగానాలకు మెగాస్టార్ చిరంజీవి ఫుల్‌స్టాప్ పెట్టేశారు. రాజకీయాల నుంచే తాను పూర్తిగా వైదొలిగినట్లు ప్రకటించేశారు. దైవ దర్శనం నిమిత్తం శుక్రవారం మరోసారి చిరంజీవి విజయవాడ వచ్చారు. ఈ సందర్భంగా రాజకీయాలపై మెగాస్టార్ చిరంజీవి కీలక వ్యాఖ్యలు చేశారు.

రాజకీయాలకు తాను పూర్తిగా దూరమైనట్లు చిరంజీవి ప్రకటించారు. తనకు రాజ్యసభ టిక్కెట్ వస్తుందని జరుగుతున్న ప్రచారంలో ఎంతమాత్రం వాస్తవం లేదన్నారు. రాజకీయాలకు దూరంగా ఉన్న తనకు ఇలాంటి ఆఫర్లు రావని.. తాను కూడా ఇలాంటి ఆఫర్లను కోరుకోబోనని తేల్చి చెప్పారు. రాజ్యసభ సీటుపై వస్తున్న వార్తలను పూర్తిగా ఖండిస్తున్నట్లు చిరంజీవి కుండబద్ధలు కొట్టేశారు.

కాగా, గురువారం సీఎం జగన్‌తో చిరంజీవి భేటీ అయిన నేపథ్యంలో కొన్ని వార్తలు తెరపైకి వచ్చాయి. మరో నాలుగు నెలల్లో ఏపీలో నాలుగు రాజ్యసభ స్థానాలు ఖాళీ కాబోతున్నాయి. దీంతో చిరంజీవికి వైసీపీ నుంచి సీఎం జగన్ రాజ్యసభ టిక్కెట్ ఆఫర్ చేశారని తెగ ప్రచారం జరుగుతోంది. అయితే దీనిపై తనకు కాస్త సమయం కావాలని చిరంజీవి అన్నట్లు కొన్ని మీడియా సంస్థల్లో వార్తలు వచ్చాయి. ఈ క్రమంలో ఈ వార్తలను చిరంజీవి తీవ్రంగా ఖండించారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.