యాప్నగరం

పవన్ కళ్యాణ్ ఢిల్లీ వెళ్లింది అందుకే.. త్వరలోనే పొత్తు కటీఫ్: అంబటి రాంబాబు

జనసేనాని పవన్ కళ్యాణ్‌, ఆ పార్టీ నేత నాదెండ్ల మనోహర్‌పై మంత్రి అంబటి రాంబాబు మసారి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అసలు పవన్ పార్టీ పెట్టింది ఎవరి కోసమని సూటిగా ప్రశ్నించారు.

Authored bySatyanarayan Patnaik | Samayam Telugu 7 Apr 2023, 1:21 am
ఆంధ్రప్రదేశ్‌లో గత నాలుగు సంవత్సరాలుగా ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి చిత్తుశుద్ధితో పరిపాలన అందిస్తున్నారని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు అన్నారు. రాష్ట్రంలోని కోట్లాది మంది లబ్ధిదారులకు సీఎం జగన్ రూ. 2 లక్షల కోట్లకు పైగా డబ్బులు డీబీటీ ద్వారా ప్రజలకు అందించారని వివరించారు. ఈ మేరకు గురువారం తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో అంబటి రాంబాబు మీడియా మాట్లాడుతూ.. వచ్చే ఎన్నికల్లో 175 సీట్లలో పోటీ చేసే దమ్ము చంద్రబాబుకు ఉందా అని సవాల్‌ విసిరారు.
Samayam Telugu మీడియాతో మాట్లాడుతున్న అంబటి రాంబాబు


సింగిల్‌గా పోటీ చేసే ధైర్యం తనకు లేదని చంద్రబాబు ఒప్పుకున్నారని మంత్రి అంబటి రాంబాబు అన్నారు. ఇక, చంద్రబాబు నిర్దేశం మేరకే పవన్‌ కళ్యాణ్ ఢిల్లీ పర్యటనకు వెళ్లారని ఆరోపించారు. చంద్రబాబును సీఎం చేసేందుకు పవన్‌ కళ్యాణ్ పార్టీ పెట్టారా అని ప్రశ్నించారు. జనసేన పార్టీ గ్రాఫ్‌ రోజురోజుకు పడిపోతుందన్నారు. ఇక, పోలవరం ప్రాక్టుపై జనసేన పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల అజ్ఞానంతో మాట్లాడుతున్నారని ఫైరయ్యారు. అసలు పోలవరం గురించి నాదెండ్ల మనోహర్, పవన్ కల్యాణ్‌కు ఏం తెలుసని ప్రశ్నించారు. ప్రజలను తప్పుదోవ పట్టించేలా వీరు మాట్లాడుతున్నారని తెలిపారు.

ఇక, పోలవరం ప్రాజెక్టును మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అస్తవ్యస్తం చేశారని మంత్రి అంబటి ఆరోపించారు. పోలవరం ప్రాజెక్టు ఎత్తును తగ్గించే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. ఈ విషయాన్ని సీఎం జగన్మోహన్ రెడ్డి ఇప్పటికే అసెంబ్లీలో స్పష్టం చేశారని వివరించారు. దెబ్బతిన్న పోలవరం డయాఫ్రమ్‌వాల్‌ను రిపేర్‌ చేస్తున్నామని.. దీని వల్లే పనులు ఆలస్యం అవుతున్నాయని పేర్కొన్నారు. వీలైనంత త్వరగా పోలవరాన్ని పూర్తి చేస్తామని మంత్రి పేర్కొన్నారు.

ఇక, గతంలో చంద్రబాబు చేసిన మోసాలు, కుట్రలను వెలుగులోకి తీసుకొస్తున్నామని మంత్రి అంబటి రాంబాబు తెలిపారు. ఏం చేసినా అధికారంలోకి రాలేరని చంద్రబాబుకు కూడా కూడా తెలుసని.. అందుకే రంకెలేస్తూ మాట్లాడుతున్నారని దుయ్యబట్టారు. 175 సీట్లలో పోటీ చేసే దమ్ము, ధైర్యం లేని వ్యక్తి చంద్రబాబు అని అన్నారు. చంద్రబాబు వెళ్లమంటేనే ‘వారాహి’ బ్యాచ్ ఢిల్లీకి వెళ్లిందని పవన్ కళ్యాణ్‌పై సెటైర్లు వేశారు. బీజేపీతో విడాకులు తీసుకోమని చంద్రబాబు చెప్పి పంపించారని.. కానీ, వారాహి బ్యాచ్‌కి పని కాలేదని చెప్పారు.


కాపుల ఓట్లు చీల్చితే కొంత మెరుగు పడవచ్చని చంద్రబాబు ఆశ అని మంత్రి అంబటి అన్నారు. జనసేన నాయకుడు నాదెండ్ల మనోహర్‌కి బ్రోకరిజం చేయటం తప్ప మరేం తెలియదని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. పవన్ కళ్యాణ్, చంద్రబాబుకు మధ్య ప్యాకేజీలు కుదర్చడం తప్ప నాదెండ్లకు మరేం తెలీదు. పవన్ కళ్యాణ్ త్వరలోనే బీజేపీకి విడాకులు ఇచ్చి.. చంద్రబాబు పార్టీని పెళ్లి చేసుకుంటారని ఎద్దేవా చేశారు. ఇద్దరూ కలిసి వచ్చినా, విడివిడిగా వచ్చినా వారిని చిత్తుచిత్తుగా ఓడిస్తామని ధీమా వ్యక్తం చేశారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.