యాప్నగరం

పవన్‌ కళ్యాణ్‌కు ఇంత కంటే పెద్దదెబ్బ మరొకటి ఉండదు: మంత్రి రోజా

జనసేనాని పవన్ కళ్యాణ్‌పై మంత్రి ఆర్కే రోజా మరోసారి ఘాటు వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు డైరెక్షన్‌లోనే పవన్ కళ్యాణ్ నడుస్తున్నారని చెప్పారు. ఈ మేరకు గురువారం మంత్రి రోజా మీడియాతో మాట్లాడారు.

Authored byసత్యానందం గుండెమాడుగుల | Samayam Telugu 24 Nov 2022, 8:55 pm
Samayam Telugu పవన్ కళ్యాణ్ (ఫైల్ ఫొటో)
తెలుగు దేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు, జనసేన పార్టీ అధినేత పపన్‌ కళ్యాణ్‌పై రాష్ట్ర పర్యాటక, యువజన, సాంస్కృతిక శాఖ మంత్రి ఆర్కే రోజా మరోసారి విరుచుకుపడ్డారు. కర్నూలు జిల్లా పర్యటనలో చంద్రబాబు వీధి రౌడీలా వ్యవహరించాలని రోజా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు మంత్రి రోజా గురువారం మీడియాతో మాట్లాడుతూ.. దివంగత ముఖ్యమంత్రి ఎన్టీఆర్ అమలు చేసిన సంక్షేమ పథకాలకు తూట్లు పొడిచి రాష్ట్రాన్ని ముక్కలు చెక్కలు చేసిన వ్యక్తి చంద్రబాబు అని దుయ్యబట్టారు.

మరోసారి చంద్రబాబుకి అవకాశం ఇస్తే నష్టపోతామని ప్రజలు గుర్తించారని మంత్రి రోజా చెప్పారు. చంద్రబాబు తానొక మాజీ ముఖ్యమంత్రినని మర్చిపోయారన్నారు. కర్నూలు జిల్లాలో వీధి రౌడీలా చంద్రబాబు వ్యవహరించారని.. ఆయన భాష చూస్తే తలదించుకునేలా ఉందని పేర్కొన్నారు. పవన్‌ కళ్యాణ్‌ను వాడుకుని చంద్రబాబు వదిలేస్తారని.. జనసేనాని ఇప్పటికైనా వాస్తవాలను గ్రహించాలన్నారు.

రాష్ట్ర సమస్యలపై పవన్‌ కళ్యాణ్‌కు ఏ మాత్రం అవగాహన లేదని మంత్రి రోజా పేర్కొన్నారు. చంద్రబాబు, ఆయన అనుకూల మీడియా డైరెక్షన్‌లోనే పవన్‌ కళ్యాణ్ నడుస్తున్నారని ఆరోపించారు. పవన్‌ కళ్యాణ్‌ను చంద్రబాబు వాడుకుని విశాఖపట్నం ఎయిర్‌పోర్టులో మంత్రులపై దాడులు చేయించారన్నారు.

అలాగే, ఇప్పటంలో అక్రమ నిర్మాణాల విషయంలో హైకోర్టుకు తప్పుడు సమాచారం ఇచ్చారని... కోర్టు సమయాన్ని వృథా చేసిన 14 మందికి మనిషికి రూ. లక్ష చొప్పున న్యాయస్థానం జరిమానా విధించిందని మంత్రి వివరించారు. ఇప్పటం విషయంలో పవన్‌ కళ్యాణ్‌కు ఇంత కంటే పెద్ద దెబ్బ మరొకటి ఉండదన్నారు. ఇప్పటంలో పోటీ చేసేది చంద్రబాబు కొడుకు లోకేష్ అని... అయితే, లోకేష్ వెళ్లాల్సిన చోటుకు పవన్‌ కళ్యాణ్ ఎందుకు వెళ్లారని ప్రశ్నించారు. పవన్‌ కళ్యాణ్ ఇప్పటికైనా వాస్తవాలను గ్రహించాలన్నారు. పవన్ కళ్యాణ్ రాజకీయాల్లోకి రావాలనుకుంటే ఫుల్ టైమ్ ప్రజల్లో ఉండాలని.. షూటింగ్ గ్యాప్‌లో వచ్చి డ్రామాలు చేయాలనుకుంటే ప్రజలు నమ్మరని చెప్పారు. పవన్ కళ్యాణ్ గురించి తెలుసు కాబట్టే రెండు చోట్లా ఆయన్ను ప్రజలు ఓడించారని వ్యాఖ్యానించారు.
రచయిత గురించి
సత్యానందం గుండెమాడుగుల
సత్యానందం గుండెమడుగుల సమయం తెలుగులో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించిన తాజా, రాజకీయ వార్తలు, ప్రత్యేక కథనాలు అందిస్తుంటారు. సత్యానందంకు పాత్రికేయ రంగంలో 8 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థలో సెంట్రల్ డెస్క్‌లో పని చేశారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.