యాప్నగరం

బాలకృష్ణకు నిరసనల సెగ.. హిందూపురంలో తీవ్ర ఉద్రిక్తత

సినీ నటుడు, హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణను నిరసనకారులు అడ్డుకున్నారు. మూడు రాజధానులను టీడీపీ వ్యతిరేకిస్తోంది. ఈ నేపథ్యంలో బాలయ్య పర్యటనకు నిరసన సెగ తగిలింది.

Samayam Telugu 30 Jan 2020, 3:39 pm
సినీ నటుడు, హిందూపురం టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణకు చేదు అనుభవం ఎదురైంది. తాను ఎమ్మెల్యేగా ప్రాతినిథ్యం వహిస్తున్న అనంతపురం జిల్లా హిందూపురంలో గురువారం (జనవరి 30) బాలకృష్ణ పర్యటించారు. అయితే బాలయ్య పట్టణంలోని రహమతపురం సర్కిల్‌ వద్దకు రాగానే కాన్వాయ్‌ను ప్రజా సంఘాల నేతలు, వైసీపీ కార్యకర్తలు గురువారం అడ్డుకున్నారు. అధికార వికేంద్రీకరణకు ఎందుకు అడ్డుపడుతున్నారని వారు బాలకృష్ణపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
Samayam Telugu balaiah

రాయలసీమలో హైకోర్టును అడ్డుకుంటున్న బాలయ్య.. రాయలసీమ ద్రోహి అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. బాలకృష్ణ గోబ్యాక్‌ అంటూ నినదించారు. మరోవైపు బాలకృష్ణకు మద్దతుగా టీడీపీ కార్యకర్తలు భారీగా ఘటనా స్థలానికి చేరుకున్నారు. దీంతో వైసీపీ, టీడీపీ కార్యకర్తలకు మధ్య తోపులాట జరిగింది. ఈ నేపథ్యంలో హిందూపురంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. పరిస్థితి తీవ్రతరం అవుతండటంతో ఆందోళనకారులను పోలీసులు అరెస్ట్ చేసి స్టేషన్‌కు తరలించారు.

ఈ ఘటన నేపథ్యంలో హిందూపురంలో పోలీసులు భారీగా మోహరించారు. కాగా, మూడు రాజధానులకు మద్దతుగా రాష్ట్రవ్యాప్తంగా వైసీపీ ప్రదర్శనలు చేస్తోంది. అయితే ఈ ప్రతిపాదనను వ్యతిరేకిస్తున్న టీడీపీ.. రాజధానిని అమరావతిలోనే ఉంచాలని డిమాండ్ చేస్తున్న విషయం తెలిసిందే.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.