విశాఖలో విజయసాయిరెడ్డి వసూళ్ల దందా.. సీఎంకు రఘురామ సంచలన లేఖ
విజయసాయిరెడ్డి సెటిల్మెంట్ల వ్యవహారాలపై విశాఖ ప్రజలు కథలు కథలుగా చెప్పుకుంటున్నారని అన్నారు. రాజధాని మార్పు, తదనంతర పరిణామాల నేపథ్యంలో ఇన్సైడర్ ట్రే డింగ్ జరుగుతున్నట్లు ప్రజలు అనుమానిస్తున్నారన్నారు.
Samayam Telugu 23 Jul 2021, 7:10 am
ప్రధానాంశాలు:
- భూ అక్రమార్కుల నుంచి విజయసాయిరెడ్డికి వాటాలు
- ‘సిట్’ నివేదికను అడ్డంపెట్టుకొని వసూళ్లకు తెరతీశారు
- విచారణ జరిపించి చర్యలు తీసుకోండి: సీఎంకు రఘురామ లేఖ
విశాఖలో భూ అక్రమార్కుల నుంచి విజయసాయిరెడ్డి వాటాలు డిమాండ్ చేస్తున్నారని నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు ఆరోపించారు. విశాఖలో జరుగుతున్న భూ దందాలపై సీఎం జగన్మోహన్రెడ్డికి ఆయన ఓ లేఖ రాశారు. ‘టీడీపీ ప్రభుత్వ హయాంలో విశాఖలో వెలుగులోకి వచ్చిన కోట్లాది రూపాయల భూఅక్రమాలపై సిట్ నివేదిక ఇచ్చింది. ఆ నివేదికను అడ్డుపెట్టుకొని వైసీపీ ఉత్తరాంధ్ర ఇన్చార్జి విజయసాయిరెడ్డి వసూళ్లకు తెరతీశారు. ఆరోపణలు ఎదుర్కొంటున్న నిందితుల నుంచి పెద్ద ఎత్తున వాటాలు డిమాండ్ చేస్తున్నారు’ అని రఘురామ ఆరోపించారు. విజయసాయిరెడ్డి సెటిల్మెంట్ల వ్యవహారాలపై విశాఖ ప్రజలు కథలు కథలుగా చెప్పుకుంటున్నారని రఘురామ అన్నారు. రాజధాని మార్పు, తదనంతర పరిణామాల నేపథ్యంలో ఇన్సైడర్ ట్రేడింగ్ జరుగుతున్నట్లు ప్రజలకు అనుమానాలు కలుగుతున్నాయన్నారు.దీనిపై పారదర్శకంగా ప్రజలకు వివరాలను తెలియచేయాల్సిన అవసరం ఉందని సీఎం జగన్ని కోరారు. విశాఖలో 2017 నుంచి వెలుగులోకి వచ్చిన భూ కుంభకోణాలపై సిట్ విచారణలో పేర్కొన్న అంశాలతో పాటు, తాజా ఆరోపణలపై కూడా విచారణ జరిపించి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.