యాప్నగరం

ఏపీలో ముందస్తు ఎన్నికలు, సీఎం జగన్ ప్లాన్ ఇదే.. ఏ నెలలోనో క్లియర్‌గా చెప్పిన రఘురామ

Mp Raghu Rama Krishnam Raju ఏపీలో ముందస్తు ఎన్నికలు వస్తాయని జోస్యం చెప్పారు. గత ఎన్నికల్లో మా పార్టీ అప్రహతిత విజయానికి కారణమైన రెండు కేసులు డ్రామా అని తేలితే.. రానున్న ఎన్నికల్లో మా పార్టీ పరిస్థితి ఏమిటి అంటూ సెటైర్లు పేల్చారు. ప్రతిపక్షాలకు ఛాన్స్ ఇవ్వకుండా సీఎం జగన్ ఎన్నికలకు వెళ్లాలని భావిస్తున్నారన్నారు. విశాఖ ఎయిర్‌పోర్ట్ కోడికత్తి కేసులో శ్రీనివాసరావుకు బెయిల్ రాకపోవడం దారుణమన్నారు ఎంపీ రఘురామ.

Authored byతిరుమల బాబు | Samayam Telugu 15 Apr 2023, 4:37 am

ప్రధానాంశాలు:

  • ఏపీలో ముందస్తు ఎన్నికలపై రఘురామ
  • జగన్ మనసు మారకపోతే ఆ నెలలో ఎన్నికలు
  • ప్రతిపక్షాలకు ఛాన్స్ ఇవ్వకూడదని భావిస్తున్నారు
హైలైట్స్ చదవాలంటే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి
Samayam Telugu Raghu Rama Krishna Raju
తెలంగాణతో పాటే ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయని చెప్పుకొచ్చారు నరసాపురం ఎంపీ రఘురామకృష్ణ రాజు. ఆగస్టు, సెప్టెంబర్ మాసంలో అసెంబ్లీని రద్దు చేసి.. ముందస్తు ఎన్నికలకు వెళ్లాలనే ఆలోచనతో ముఖ్యమంత్రి జగన్ ఉన్నారన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఆయన మనసు మారకపోతే, డిసెంబర్ లో రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు జరగడం ఖాయమన్నారు. రాష్ట్రంలో ప్రతిపక్షాలు ఐక్యం కాకముందే ఎన్నికలకు వెళ్లాలన్నది ముఖ్యమంత్రి జగన్ ప్లాన్ గా కనిపిస్తోందన్నారు. అయితే ఓట్లున్న ప్రతిపక్షాలు కలవడం ఖాయమని, పవర్ లో ఉన్న పార్టీ కూడా వారితో కలిసే అవకాశాలు ఉన్నాయని రఘురామకృష్ణ రాజు అన్నారు.
మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు (Ys Vivekananda Reddy Murder Case) కూడా దాదాపు కొలిక్కి వచ్చిందని.. ఈ నెలాఖరులోగా చార్జిషీట్ దాఖలు చేసి ఈ కేసులో నిందితులుగా అనుమానిస్తున్న వారిని అరెస్టు చేస్తామని హైకోర్టుకు సీబీఐ తేల్చి చెప్పిందన్నారు. ఈ కేసులో సీబీఐ తన వైఖరిని విస్పష్టంగా చెప్పిందని.. సోమవారం డాక్టర్ సునీత తరపు న్యాయవాది, సీబీఐ తరఫు న్యాయవాది కూడా తమ వాదనలను వినిపించే అవకాశాలు ఉన్నాయన్నారు. వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో ఈనెల 25 వరకు కీలక అరెస్టులు ఉండవచ్చునని ప్రాథమికంగా అంచనా వేస్తున్నాను అన్నారు.

వైఎస్ వివేకానందరెడ్డి హత్యకేసులో గజ్జల ఉదయ్ కుమార్ రెడ్డి అరెస్ట్ చాలా ముఖ్యమన్నారు. ఈ హత్య కేసులో విస్తృత కుట్ర కోణాన్ని ఒక దశకు తీసుకొచ్చామని సీబీఐ అధికారులు పేర్కొనడం.. ఈ నెలాఖరులోగా చార్జిషీట్ దాఖలు చేస్తామని సుప్రీం కోర్టుకు చెప్పినట్లుగా హైదరాబాద్ హైకోర్టుకు వెల్లడించడం జరిగిందన్నారు. అరెస్టులకు అడ్డు రావద్దని హైకోర్టుకు సీబీఐ అధికారులు విన్నవించిందన్నారు. ఈ నెలాఖరులో ఈ కేసులో కీలక అరెస్టులు ఉండవచ్చునని చెప్పుకొచ్చారు.

విశాఖ కోడికత్తి కేసులో క్యాంటీన్ నిర్వాకుడైన హర్షవర్ధన్, నిందితుడు శ్రీనివాస్ టీడీపీ సానుభూతిపరులు కాదని ఎన్ ఐ ఏ విచారణలో స్పష్టం చేసిందన్నారు. ఈ కేసులో శ్రీనివాసరావు గత నాలుగేళ్లుగా జైలులోనే ఉన్నాడని.. గతంలో ఆయనకు బెయిల్ లభించగా.. ఆ తర్వాత కొద్దిరోజులకే బెయిలు రద్దు కావడంతో జైల్లో ఉన్నాడన్నారు. దళిత యువకుడిని హత్య చేసి పార్సల్ చేసిన కేసులో ఎమ్మెల్సీకి నాలుగు నెలల్లోనే బెయిల్ వచ్చిందని.. శ్రీనివాసరావు మాత్రం నాలుగేళ్లుగా జైల్లో మగ్గాల్సిన పరిస్థితి ఉందన్నారు. బాధితుడు కోర్టుకు రాలేనని చెబితే, ఈ కేసులో నిందితుడిగా అభియోగాలు ఎదుర్కొంటున్న వ్యక్తికి బెయిల్ ఇవ్వాలన్నారు.

రచయిత గురించి
తిరుమల బాబు
తిరుమల బాబు సమయం తెలుగులో సీనియర్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్రత్యేక కథనాలు అందిస్తుంటారు. ఆయనకు జర్నలిజంలో 11 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పొలిటికల్ న్యూస్, ఇతర రంగాలకు సంబంధించి వార్తలు రాశారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.