యాప్నగరం

పవన్ పాదయాత్ర చేయడం కుదరదు; భద్రతకు 90 మందిలోపే సిబ్బంది: నాగబాబు

Janasena Long March సందర్భంగా నాగబాబు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పవన్ నడవడం వీలు కానంతగా భారీ సంఖ్యలో జనం వచ్చారన్నారు. ప్రభుత్వం చేసిన భద్రతా ఏర్పాట్లపై ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు.

Samayam Telugu 3 Nov 2019, 5:21 pm
ఇసుక కొరత తీవ్రతను ప్రభుత్వం దృష్టికి తీసుచ్చేందుకు జనసేన పార్టీ విశాఖపట్నంలో లాంగ్ మార్చ్ నిర్వహించింది. ఈ కార్యక్రమంలో పవన్ కళ్యాణ్ సోదరుడు నాగబాబు పాల్గొన్నారు. లాంగ్ మార్చ్‌కు భారీ సంఖ్యలో జనం తరలి వచ్చారు. ఈ సందర్భంగా నాగబాబు మాట్లాడుతూ.. పెద్ద ఎత్తున జనం తరలి రావడంతో.. పవన్ కళ్యాణ్ నడవటం కుదరడం లేదని.. దీంతో ఆయన వాహనం మీదెక్కి ముందుకెళ్తున్నారన్నారు. ప్రజలు దారి ఇవ్వరు... ఇదే పవన్ కళ్యాణ్ సమస్య అన్న నాగబాబు.. జనసేనాని పాదయాత్ర చేయడం కుదరదని మరోసారి రుజువైందన్నారు.
Samayam Telugu pk nagababu


ఇసుకే కదాని నిర్లక్ష్యం చేస్తే.. అది వైసీపీ దుంప తెంచే దాకా వచ్చిందని నాగబాబు వ్యాఖ్యానించారు. మరో నాలుగేళ్లు ప్రభుత్వం ఉందనుకున్నారో మరొకటో తెలీదు కానీ.. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం పెద్ద తప్పు చేసిందన్నారు. భవన నిర్మాణ కార్మికుల జీవితాలతో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఆటాడుకుంటోందన్న ఆయన.. జగన్ సర్కారుకు వ్యంగ్యంగా థ్యాంక్స్ చెప్పారు.

మీకు చేత కాకపోతే.. మా పార్టీ నేత తోట చంద్రశేఖర్‌కు ఇసుక సరఫరా బాధ్యతను అప్పగించాలని ప్రభుత్వానికి నాగబాబు సూచించారు. ఐఏఎస్ అధికారిగా పని చేసిన ఆయన.. పుణే నగరాన్ని ఎంతో డెవలప్ చేశారన్నారు.

కర్ణాటకలో పవన్ కళ్యాణ్ సెక్యూరిటీ కోసం 900 మంది పోలీసులను కేటాయిస్తే.. వైజాగ్‌లో 90 మంది పోలీసులను కూడా ఇవ్వలేదని నాగబాబు ఆరోపించారు. భవన నిర్మాణ కార్మికులకు పది వేల రూపాయలకు తక్కువ కాకుండా పరిహారం చెల్లించాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు. ఇప్పటికే 9 మందికిపైగా భవన నిర్మాణ కార్మికులు ఆత్మహత్యకు పాల్పడ్డారని చెప్పిన నాగబాబు.. ఒక్కరి తప్పిదం వల్ల ఇంత మంది ప్రాణాలు తీసుకునే పరిస్థితి వచ్చిందన్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.