యాప్నగరం

ఆమె స్ఫూర్తితోనే రాజకీయాల్లోకి: ఘనంగా ఎమ్మెల్యే రోజా బర్త్ డే.. సీఎం జగన్ ఆశీస్సులు

Roja Selvamani: వైసీపీ ఎమ్మెల్యే, ఏపీఐఐసీ చైర్మన్ ఆర్కే రోజా సెల్వమణి పుట్టిన రోజు వేడుకలు ఘనంగా జరిగాయి.

Samayam Telugu 17 Nov 2020, 7:47 pm
చిత్తూరు జిల్లా నగరి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే, ప్రముఖ సినీ నటి, ఆంధ్రప్రదేశ్‌ పారిశ్రామిక మౌలిక సదుపాయాల సంస్థ (ఏపీఐఐసీ) చైర్మన్ ఆర్కే రోజా జన్మదిన వేడుకలు మంగళవారం ఘనంగా జరిగాయి. కుటుంబ సభ్యులతో పాటు.. మంత్రులు, ఎమ్మెల్యేల సమక్షంలో రోజా బర్త్ డే వేడుకలు జరుపుకున్నారు. అనంతరం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ఎమ్మెల్యే రోజా దంపతులు కలిసి ఆశీస్సులు తీసుకున్నారు. అనంతరం ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలు వెల్లడించారు.
Samayam Telugu సీఎం జగన్ ఆశీస్సులు తీసుకుంటున్న ఎమ్మెల్యే రోజా

ఈ సందర్భంగా ఎమ్మెల్యే రోజా మాట్లాడుతూ.. తనకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలిపారు. రాజకీయాల్లోకి వచ్చిన కొత్తలో తనకు ఎన్నో చేదు అనుభవాలు ఎదురయ్యాయని గుర్తు చేసుకున్నారు. కష్టాలను తట్టుకుని వైఎస్సార్‌సీపీలో రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలవడం సంతోషంగా ఉందన్నారు. సినిమా పరిశ్రమలో ఎంతో కాలం కొనసాగానని, తొలినాళ్లలో హీరోయిన్‌గా రాణించడం చాలా కష్టమని ఎంతో మంది ఎగతాళి చేశారని గుర్తు చేసుకున్నారు. అయినప్పటికీ ఎంతో కష్టపడి నటన, డాన్స్‌ నేర్చుకుని, పరిశ్రమలో తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్నానని పేర్కొన్నారు.

తర్వాత తమిళనాడు దివంగత మాజీ ముఖ్యమం‍త్రి జయలలిత స్ఫూర్తితో రాజకీయాల్లోకి ప్రవేశించినట్లు రోజా వెల్లడించారు. రాజకీయాల్లోకి వచ్చిన కొత్తలో ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొన్నానని, విమర్శలను పాజిటివ్‌గా తీసుకున్నానని చెప్పారు. నియోజకవర్గ ప్రజలకు ఎమ్మెల్యేగా సేవ చేయడం ఆనందంగా ఉందని సంతోషం వ్యక్తం చేశారు.

చిత్తూరు జిల్లా చిన్నగొట్టిగల్లు మండలం భాకరాపేటలో 1972 నవంబర్‌ 17న రోజా జన్మించారు. తిరుపతి పద్మావతి మహిళా యూనివర్శిటీలో విద్యనభ్యసించారు. నాగార్జున యూనివర్సిటీ నుంచి పొలిటికల్ సైన్స్‌లో పీజీ పట్టభద్రులయ్యారు. తర్వాత తెలుగు దేశం పార్టీ ద్వారా రాజకీయ అరంగేట్రం చేశారు. 2004, 2009 శాసనసభ ఎన్నికల్లో టీడీపీ తరఫున నగరి, చంద్రగిరి నియోజకవర్గాల నుంచి పోటీ చేసి ఓడిపోయారు. 2014 శాసనసభ ఎన్నికలలో వైఎస్సార్‌సీపీ అభ్యర్థిగా నగరి నియోజకవర్గం నుంచి పోటీచేసి తన సమీప అభ్యర్థి గాలి ముద్దుకృష్ణమ నాయుడుపై 858 ఓట్ల తేడాతో గెలుపొందారు. 2019 లోనూ ముద్దుకృష్ణమ కుమారుడు భానుప్రకాష్‌పై విజయం సాధించి వరుసగా రెండోసారి చట్టసభకు ఎన్నికయ్యారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.