యాప్నగరం

నిండుకుండలా నాగార్జున సాగర్.. గేట్లు ఎత్తి నీటి విడుదల

Nalgonda: నాగార్జున సాగర్ డ్యామ్‌కు ఎగువ నుంచి వరద ప్రవాహం కొనసాగుతోంది. దీంతో సాగర్ 8 గేట్లను తెరిచి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు.

Samayam Telugu 26 Aug 2020, 9:59 pm
నాగార్జున సాగర్ జలాశయానికి ఎగువ నుంచి వరద ప్రవాహం కొనసాగుతోంది. దీంతో డ్యామ్‌కు చెందిన క్రస్ట్ గేట్లను తెరిచి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. శ్రీశైలం నుంచి వరద ప్రవాహం పెరగడంతో నాగార్జున సాగర్ ఎనిమిది గేట్లు తెరిచి నీటిని దిగువకు విడుదల చేస్తున్నట్లు ఎన్ఎస్పీ అధికారులు బుధవారం (ఆగస్టు 26) రాత్రి తెలిపారు. 8 గేట్ల ద్వారా 65 వేల క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నట్లు తెలిపారు.
Samayam Telugu నాగార్జున సాగర్ డ్యామ్
Nagarjuna Sagar dam gates opened


నాగార్జున సాగర్ డ్యామ్ ఇప్పటికే నిండుకుండలా మారిన విషయం తెలిసిందే. ప్రస్తుతం జలాశయానికి ఇన్ ఫ్లో 2,89,976 క్యూసెక్కులు కొనసాగుతోంది. అవుట్ ఫ్లో 43,643 క్యూసెక్కులుగా ఉంది.

సాగర్ పూర్తి స్థాయి నీటి నిల్వ 312.0450 టీఎంసీలు కాగా.. ప్రస్తుత నీటి నిల్వ 308.1010 టీఎంసీలుగా ఉంది. పూర్తి స్థాయి నీటిమట్టం 590 అడుగులు కాగా.. ప్రస్తుత నీటిమట్టం: 589 అడుగులుగా ఉంది. ఎగువ నుంచి వరద ఉధృతి కొనసాగడంతో ఇటీవల సాగర్‌కు చెందిన 18 గేట్లను ఎత్తి నీటిని దిగువకు విడుదల చేసిన సంగతి తెలిసిందే.

భారీ వర్షాలతో కృష్ణా నది పరీవాహ ప్రాంతంలోని ప్రాజెక్టులన్నీ జలకళను సంతరించుకున్నాయి. డ్యామ్‌లన్నీ నిండుకుండలా మారాయి. కర్ణాటకలోని ఆల్మట్టి డ్యామ్ నుంచి వరద ఉధృతి కొనసాగుతుండటంతో తుంగభద్ర జలాశయం, శ్రీశైలం జలాశయం నిండుకుండలా మారాయి.

శ్రీశైలం జలాశయం పూర్తి స్థాయి నీటి మట్టం 885 అడుగులు కాగా.. ప్రస్తుతం జలాశయం నీటి మట్టం 884 అడుగులకు చేరుకుంది. ఎగువ నుంచి వరద ప్రవాహం కొనసాగుతుండటంతో గేట్లు ఎత్తి నీటికి దిగువకు విడుదల చేస్తున్నాయి. దీంతో నాగార్జునసాగర్ డ్యామ్‌కు వరద నీరు భారీగా చేరుకుంటోంది. మరోవైపు.. కరోనా నేపథ్యంలో సాగర్ వద్దకు ఎవరూ రావొద్దని అధికారులు ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు.

Also Read: రూ.2000 నోట్లు రద్దు చేస్తున్నారా.. ఆర్బీఐ ఏం చెప్పింది?

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.