యాప్నగరం

టార్గెట్ జగన్, ఏకంగా ప్రధానికి.. ఎంపీ రఘురామ మరో సంచలనం

సొంత జిల్లా కడప జిల్లా నుంచి కొందరు ప్రొఫెషనల్‌ కిల్లర్లను పురమాయించినట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తనకు తెలిసిందన్నారు. తాజా పరిణామాలతో తనకు భద్రత అవసరం ఉందన్నారు ఎంపీ.

Samayam Telugu 8 Apr 2021, 6:24 am
నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు మరో సంచలనానికి తెరలేపారు. ఈసారి ఏకంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని టార్గెట్ చేశారు. సీఎం నుంచి తన ప్రాణాలకు ముప్పుందని ఏకంగా ప్రధాని మోదీకి ఫిర్యాదు చేశారు. వెంటనే తనకు భద్రత పెంచాలని హైదరాబాద్‌, ఆంధ్రప్రదేశ్‌తో పాటు ఢిల్లీలోనూ ప్రత్యేక రక్షణ కల్పించాలని బుధవారం లేఖ రాశారు. అక్రమాస్తుల కేసులో జగన్‌ బెయిల్‌ను రద్దు చేయాలని తాను ఈ నెల 6న సీబీఐ కోర్టులో కేసు దాఖలు చేశానని గుర్తు చేశారు. అందుకే తనను హతమారుస్తామని బెదిరిస్తూ ఫోన్‌కాల్స్‌ వస్తున్నాయన్నారు.
Samayam Telugu జగన్-ఎంపీ రఘురామ (File Photo)


తనకు వస్తున్న బెదిరింపు కాల్స్‌పై ఆందోళన చెందనప్పటికీ.. సీఎం జగన్‌ నేర చరిత్రను బట్టి ఆందోళన కలుగుతోందన్నారు. కొన్ని వారాలుగా తనపై తప్పుడు కేసులు నమోదు చేశారని.. జైలుకు పంపాలని చూశారని ఆరోపించారు. జగన్‌‌మోహన్ రెడ్డి తనను హతమార్చేందుకు ప్రయత్నిస్తున్నారని.. దీని కోసం సొంత జిల్లా కడప జిల్లా నుంచి కొందరు ప్రొఫెషనల్‌ కిల్లర్లను పురమాయించినట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తనకు తెలిసిందన్నారు. తాజా పరిణామాలతో తనకు భద్రత అవసరం ఉందన్నారు ఎంపీ. తనకు హైదరాబాద్‌, ఏపీలో మాత్రమే ‘వై‘ కేటగిరీ భద్రత ఉందని.. ఇకపై ఢిల్లీలో కూడా రక్షణ కల్పించాలని ప్రధానిని లేఖలో కోరారు.

మరోవైపు ఆస్తుల కేసులో జగన్‌ బెయిల్‌ను రద్దు చేయాలన్న తన వ్యాజ్యాన్ని కోర్టు కొట్టివేయలేదన్నారు రఘురామ. జగన్‌కు గతంలో మంజూరైన బెయిల్‌ ధ్రువీకరణ ప్రతి(సర్టిఫైడ్‌ కాపీ)ని సమర్పించాల్సి ఉందన్నారు. సాంకేతిక కారణంతో కేసును తిప్పి పంపారని.. ఆ సర్టిఫైడ్‌ కాపీ తీసుకుని సాంకేతిక లోపాలను సరిదిద్ది.. శుక్రవారం మళ్లీ పిటిషన్‌ వేయనున్నట్లు చెప్పారు. కచ్చితంగా తన వ్యాజ్యాన్ని కోర్టు అనుమతిస్తుందని.. వచ్చే వారం వాదనలు కూడ ఉండొచ్చన్నారు. విచారణకు రాకుండా అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారన్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.