యాప్నగరం

అలా జరిగే ప్రమాదం ఉంది.. కడప జిల్లావాసులకు రఘురామ హెచ్చరిక

కడపకు ఆ పేరు ఎలా వచ్చింది.. కడప పేరు తీసే అర్హత ఉందా అని ప్రశ్నించిన ఎంపీ. దేవుని గడప.. దేవుని కడప అయ్యిందన్నారు. అక్కడ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయం ఉందని.. పెద్ద చరిత్ర ఉందన్నారు.

Samayam Telugu 29 Oct 2020, 3:32 pm
కడప జిల్లా ప్రజలను నర్సాపురం వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజు హెచ్చరించారు. చరిత్రపుటల్లో నుంచి కడప పేరు మాయమయ్యే ప్రమాదం ఉందని.. ఒక పత్రిక వైఎస్సార్ కడప జిల్లాను వైఎస్సార్ జిల్లాగా మార్చేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. రోశయ్య ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో వైఎస్సార్ కడప జిల్లాగా పేరు పెట్టారని.. అలాగే పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాగా ఉంది అన్నారు. కానీ ఇప్పుడు కడపను తీసేసి.. వైఎస్సార్‌ జిల్లాగా ఆ పత్రిక మార్చేసిందని.. కడపకు ఆ పేరు ఎలా వచ్చింది.. కడప పేరు తీసే అర్హత ఉందా అని ప్రశ్నించారు.
Samayam Telugu సీఎం జగన్


దేవుని గడప.. దేవుని కడప అయ్యిందన్నారు రఘురామ. అక్కడ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయం ఉందని.. పెద్ద చరిత్ర ఉందన్నారు. పాత రోజుల్లో ఎక్కడికి వెళ్లాలన్నా పాదయాత్రగా వెళ్లేవారని.. అలాగే తిరుపతి వెళ్లేవారు కడపను వెంకటేశ్వరస్వామికి తొలి గడపగా భావిస్తూ.. ఆ దేవుడి గడప నిర్మాణం జరిగింది అన్నారు. ఆ స్థలానికి పెద్ద చరిత్ర ఉందని.. వెంకటేశ్వరస్వామికి గడపగా భావించే గడప కడప అయ్యింది అన్నారు. ఆ పేరును చరిత్రలో లేకుండా తీసేసే ప్రయత్నం చేయొద్దన్నారు.

కడపకు 30 కిలో మీటర్ల దూరంలో తాళ్లపాకలో అన్నమయ్య జన్మించారని.. అన్నమాచార్య కూడా కడప జిల్లా వ్యక్తి అన్నారు ఎంపీ. అది ముఖ్యమంత్రి జగన్ సొంత జిల్లా అని గుర్తు చేసిన ఆయన.. జిల్లా గౌరవాన్ని కాపాడాలి అన్నారు. పులివెందులలో జన్మించిన వ్యక్తి వల్ల కడప జిల్లా అనే పేరు చరిత్ర పుటల్లో మాయమయ్యే అవకాశం ఉందన్నారు. గొప్ప చరిత్ర ఉన్న కడప జిల్లా పేరును కనుమరుగు కాకుండా చూడాలని కోరారు.

తెలుగు భాషను హత్య చేసే ప్రయత్నాలకు సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగులుతుందన్నారు రఘురామ. త్వరలోనే కోర్టు తీర్పు ఇవ్వబోతుందన్నారు. రాష్ట్రంలో అనధికార బెల్ట్ షాపులు ఎక్కువయ్యాయని.. సంపూర్ణ మద్య నిషేధం దేశంలో ఎక్కడా సాధ్యంకాదని తేల్చి చెప్పారు. ప్రభుత్వాన్ని విమర్శిస్తే కేసులు పెట్టడాన్ని సుప్రీంకోర్టు తప్పు పట్టిందని.. కేంద్ర నిధుల గురించి మాట్లాడినందుకు తనపై అనర్హత వేటు వేయించడానికి ఎంపీలను ఢిల్లీకి పంపారని మండిపడ్డారు. అగ్రకులాల్లో పేదలను దృష్టిలో ఉంచుకుని కేంద్రం ఇచ్చిన 10 శాతం రిజర్వేషన్ ఏపీ ప్రభుత్వం అమలు చేయాలన్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.