యాప్నగరం

రఘురామకు ఊహించని ట్విస్ట్.. వెనక్కు తగ్గిన నర్సాపురం ఎంపీ, మధ్యలోనే ఆగిన రైలు ప్రయాణం!

Raghu Rama Krishnam Raju Bhimavaram పర్యటన ఉన్నట్టుండి ఆగిపోయింది. హైదరాబాద్ నుంచి రైలులో బయల్దేరిన ఆయన తన పర్యటనను వాయిదా వేసుకుని.. మధ్యలోనే దిగి వెళ్లిపోయారు.

Authored byతిరుమల బాబు | Samayam Telugu 4 Jul 2022, 2:36 pm

ప్రధానాంశాలు:

  • నర్సాపూర్ ఎక్స్‌ప్రెస్‌లో బయల్దేరిన రఘురామ
  • లింగంపల్లిలో అనుచరులతో రైలు ఎక్కారు
  • బేగంపేట రాగానే రైలు దిగి వెళ్లిపోయిన ఎంపీ
హైలైట్స్ చదవాలంటే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి
Samayam Telugu రఘురామ
పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలో సోమవారం జరిగే అల్లూరి సీతారామరాజు విగ్రహావిష్కరణ కార్యక్రమానికి బయల్దేరిన నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు (Raghu Rama Krishnam Raju) వెనక్కు తగ్గారు. రైలులో బయల్దేరిన ఆయన.. ఆదివారం రాత్రి అర్ధంతరంగా వెనుదిరిగారు. ఏపీ పోలీసులు అనుసరిస్తుండటంతోనే ఆయన ఉన్నట్టుండి తన పర్యటనను రద్దు చేసుకున్నారు. రఘురామ ఆదివారం రాత్రి లింగంపల్లి రైల్వేస్టేషన్‌ నుంచి నర్సాపూర్‌ ఎక్స్‌ప్రెస్‌లో అనుచరులతో కలిసి భీమవరం బయలుదేరారు.
రఘురామను ఏపీ పోలీసులు అనుసరిస్తున్నారని తెలియడంతో.. ఆయన హైదరాబాద్‌లోని బేగంపేట స్టేషన్‌లో రైలు దిగిపోయారు. తన అనుచరులు కొందరిపై ఇప్పటికే పలు కేసులు ఉన్నాయని.. వారిని మరింత ఇబ్బంది పెట్టడం ఇష్టంలేక పర్యటన రద్దు చేసుకున్నారని.. ఆయన తిరిగి వెళ్లిపోయారని తెలుస్తోంది. భీమవరం ఎలాగైనా వెళ్లాలని భావించినా.. సొంత జిల్లా నుంచి ఆయనకు ఫోన్‌ వచ్చినట్లు సమాచారం. శనివారం ఆయనకు మద్దతుగా ర్యాలీ నిర్వహించిన కొంతమంది యువకులను పోలీసులు అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారట.
ఆ యువకులు తల్లిదండ్రులు ఎంపీకి సమాచారం ఇచ్చారట. ఈ ఘటన తనను మనస్తాపానికి గురి చేసిందని, యువకులపై కేసు పెట్టడం దారుణమని రఘురామ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రొటోకాల్‌ విషయంలో రాష్ట్ర యంత్రాంగం అడ్డంకులు సృష్టించిందని మండిపడ్డారు. తన అభిమానులపై అక్రమ కేసులు పెడుతున్నట్టు సమాచారం రావడంతో.. రైలు దిగి వెనుతిరగాల్సి వచ్చిందని క్లారిటీ ఇచ్చారు. ఇదిలా ఉంటే.. ఎంపీ రఘురామకృష్ణరాజు విషయంపై డీఐజీ పాలరాజు క్లారిటీ ఇచ్చారు. ఎంపీ విషయంలో హైకోర్టు ఉత్తర్వుల మేరకు నడుచుకుంటామని.. పీఎంవో నుంచి భీమవరానికి వచ్చిన జాబితాలో రఘురామ పేరు లేదన్నారు. ఆయన భీమవరం వస్తున్నట్టుగా కూడా తమకు సమాచారం లేదని చెప్పుకొచ్చారు.

భీమవరంలో అల్లూరి సీతారామరాజు విగ్రహ ఆవిష్కరణకు వెళ్లాలని రఘురామ భావించారు. తన వాహనానికి అనుమతివ్వాలని కోరారు.. కానీ పోలీసులు అనుమతి ఇవ్వలేదు. కానీ పోలీసులు నిరాకరించడంతో కలెక్టర్‌‎కు రఘురామరాజు ఫిర్యాదు చేశారు. అక్కడి నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో తన అనుచరులతో కలిసి లింగంపల్లి రైల్వే స్టేషన్‌లో నర్సాపురం ఎక్స్ ప్రెస్ ఎక్కారు. కానీ ఊహించని పరిణామాలతో ఆయన వెనక్కు తగ్గారు.
రచయిత గురించి
తిరుమల బాబు
తిరుమల బాబు సమయం తెలుగులో సీనియర్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్రత్యేక కథనాలు అందిస్తుంటారు. ఆయనకు జర్నలిజంలో 11 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పొలిటికల్ న్యూస్, ఇతర రంగాలకు సంబంధించి వార్తలు రాశారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.