యాప్నగరం

కావలి: రెండుసార్లు వెంబడించిన మృత్యువు.. అయినా ఆమే గెలిచింది!

మేకలు సాకుతూ జీవనం సాగించే ఓ మహిళను మూడు రోజుల్లోనే మృత్యుదేవత రెండుసార్లు వెంబడించింది. అయినా ఆమెను గెలవలేకపోయింది. ఈ ఘటన నెల్లూరు జిల్లా కావలి మండలంలో చోటుచేసుకుంది.

Samayam Telugu 19 Oct 2019, 11:03 am
పొలంలో ఉండగా పిడుగుపాటుకు గురైన ఓ మహిళ త్రుటిలో తప్పించుకుని గాయాలతో హాస్పిటల్‌లో చేరింది. అక్కడ కూడా ఆమెను శ్లాబు రూపంలో మృత్యుదేవత వెంబడించింది. అయితే, ఇక్కడ కూడా మృత్యువును ఆమే గెలిచింది. ఈ ఘటన నెల్లూరు జిల్లా కావలిలో చోటుచేసుకుంది. కలిగిరి మండలం కుమ్మరకొండూరు చెందిన పోలమ్మ అనే మహిళ మేకలు మేపుకొంటూ జీవనం సాగిస్తోంది. ఈ నేపథ్యంలో రెండు రోజుల కిందట ఊరు బయట పొలాల్లోకి మేకలను మేపడానికి తోలుకెళ్లారు. ఇదే సమయంలో ఒక్కసారిగా ఉరుములు మెరుపులతో వర్షం కురిసి పిడుగులు పడ్డాయి. పిడుగు పాటుకు గాయపడిన ఆమె త్రుటిలో ప్రాణాలతో బయటపడింది. పొలాల్లోనే సొమ్మసిల్లి పడిపోవడంతో సమీపంలో ఉన్నవారు ఆమెను గుర్తించి వైద్యం కోసం హాస్పిటల్‌కు తరలించారు.
Samayam Telugu pjimage (10)


కావలి ఏరియా హాస్పిటల్‌లో పోలమ్మ చికిత్స పొందుతుండగా, శుక్రవారం సాయంత్రం 4 గంటలకు ఆమె ఉంటున్న వార్డులోని శ్లాబు పెచ్చులూడి ఒక్కసారిగా మీద పడ్డాయి. సరిగ్గా అదే సమయంలో ఆమె మంచంపై లేవడంతో ప్రమాదం నుంచి తప్పించుకుని స్వల్ప గాయాలతో బయటపడింది. ఈ ఘటన జరగడానికి కొన్ని సేపటి ముందు వరకు ఆమె మంచంపై పడుకొని ఉంది. ఆ సమయంలో శ్లాబు పెచ్చులు నేరుగా తలపైనే పడి ప్రాణాలు పోయిండేవని పోలమ్మ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయం గురించి తెలుసుకున్న ఆసుపత్రి సిబ్బంది పెచ్చులను తొలగించారు. ఆమెను మరోచోటికి తరలించారు. ఊహించని రెండు ప్రమాదాల నుంచి పోలమ్మ సురక్షితంగా బయటపడటంతో ఆమె కుటుంబ సభ్యులు ఊపిరి పీల్చుకున్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.