యాప్నగరం

ఏపీ ఎస్‌ఈసీగా బాధ్యతలు చేపట్టిన నిమ్మగడ్డ.. జగన్ సర్కార్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు

శుక్రవారమే హైదరాబాద్ క్యాంప్ ఆఫీసులో బాధ్యతలు స్వీకరించానని.. జిల్లా కలెక్టర్లకు తెలిపానన్న నిమ్మగడ్డ. గద్వేషాలకు అతీతంగా ఎస్‌‌ఈసీ పనిచేస్తుందని.. గతంలో మాదిరిగానే ప్రభుత్వం నుంచి తోడ్పాటు లభిస్తుందని భావిస్తున్నాను అన్నారు.

Samayam Telugu 3 Aug 2020, 11:47 am
ఏపీ ఎస్‌ఈసీ (రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్‌)గా నిమ్మగడ్డ రమేష్ కుమార్ బాధ్యతలు చేపట్టారు. సోమవారం ఉదయం 11.15 గంటలకు బాధ్యతలు తీసుకున్నారు. రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌గా నిమ్మగడ్డను తిరిగి నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిన సంగతి తెలిసిందే. దీంతో ఆయన హైదారబాద్ నుంచి వచ్చి బాధ్యతలు తీసుకున్నారు. ఎన్నికల కమిషన్ స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన రాజ్యాంగ సంస్థ అన్నారు నిమ్మగడ్డ రమేష్. రాగద్వేషాలకు అతీతంగా ఎస్‌‌ఈసీ పనిచేస్తుందని.. గతంలో మాదిరిగానే ప్రభుత్వం నుంచి తోడ్పాటు లభిస్తుందని భావిస్తున్నాను అన్నారు. శుక్రవారమే హైదరాబాద్ క్యాంప్ ఆఫీసులో బాధ్యతలు స్వీకరించానని.. జిల్లా కలెక్టర్లకు తెలిపానన్నారు.
Samayam Telugu నిమ్మగడ్డ రమేష్


హైకోర్టు ఉత్తర్వుల మేరకు ఆయనను తిరిగి నియమిస్తున్నట్లు గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్‌ పేరుతో ఉత్తర్వులు వచ్చాయి. సుప్రీంకోర్టులో రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన స్పెషల్‌ లీవ్‌ పిటిషన్‌లో వచ్చే తుది తీర్పునకు లోబడి పదవీ పునరుద్ధరణ నోటిఫికేషన్‌ ఉంటుందని పేర్కొన్నారు. గతంలో నిమ్మగడ్డ రమేష్‌కుమార్ ఎస్ఈసీగా ఉన్న సమయంలో కరోనావ్యాప్తి చెందుతున్న తరుణంలో స్థానిక ఎన్నికలను వాయిదా వేసిన విషయం తెలిసిందే. ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకున్న జగన్ సర్కార్.. ప్రత్యేక ఆర్డినెన్స్‌ తీసుకొచ్చి ఆయన్ను పదవి నుంచి తొలగించింది. దీనిపై నిమ్మగడ్డ హైకోర్టును ఆశ్రయించగా, అక్కడ ఆయనకు అనుకూలంగా తీర్పు వచ్చింది. దీంతో హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ ఏపీ ప్రభుత్వం సుప్రీంను ఆశ్రయించింది. కానీ స్టే ఇచ్చేందుకు సుప్రీంకోర్టు కూడా నిరాకరించింది. తాజాగా, ఈ కేసు విచారణను సుప్రీంకోర్టు వాయిదా వేసింది.

తర్వాత నిమ్మగడ్డ హైకోర్టులో కోర్టు ధిక్కరణ పిటిషన్ వేయగా.. కోర్టు గవర్నర్‌ను కలిసి చర్చించాలని సూచించింది. దీంతో బిశ్వభూషణ్ హరిచందన్‌ను నిమ్మగడ్డ రమేష్‌కుమార్ సమావేశమయ్యారు. తనను ఎస్‌ఈసీగా పునర్నియామకం చేయాలంటూ గవర్నర్‌కు వినతి పత్రం అందజేశారు. హైకోర్టు తీర్పుతో పాటూ మిగిలిన అంశాలపై గవర్నర్‌తో చర్చించారు. తిరిగి తనను ఎస్‌ఈసీగా నియమించాలని కోరారు.. హైకోర్టు తీర్పును అమలు పరచాలని.. తిరిగి తనను ఎస్‌ఈసీగా నియమించేలా ప్రభుత్వానికి ఆదేశాలు ఇవ్వాలని అడిగారు. నిమ్మగడ్డ రమేష్ కుమార్‌ను ఎస్‌ఈసీగా కొనసాగించాలని ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ఏపీ ప్రభుత్వాన్ని ఆదేశించారు. హైకోర్టు తీర్పు ప్రకారం ఎస్‌ఈసీగా నిమ్మగడ్డను నియమించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి ఈమేరకు లేఖ రాశారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.