యాప్నగరం

విశాఖ ఏజెన్సీలో దారుణం.. రోడ్డు మీదే ప్రసవం, పసికందు మరణం

విశాఖ మన్యంలోని చాలా గ్రామాలకు అంబులెన్స్ రావడానికి రహదారి సౌకర్యం లేదు. దీంతో గర్భిణులు ప్రసవం కోసం నరకయాతన అనుభవిస్తున్నారు. కొన్ని సందర్భాల్లో మార్గమధ్యంలోనే ప్రసవిస్తున్నారు.

Samayam Telugu 15 Sep 2019, 12:34 pm
విశాఖ ఏజెన్సీలో గర్భిణీలను కష్టాలు వెంటాడుతున్నాయి. అంబులెన్స్ రావడానికి రహదారి మార్గం లేకపోవడంతో కిలోమీటర్ల మేర నడుచుకుని ఆసుపత్రులకు వెళ్లాల్సిన దుస్థితి నెలకొంది. పాడేరు మండలం వై.సంపల గ్రామానికి చెందిన జ్యోతి, కాసులమ్మ అనే ఇద్దరు నిండు గర్భిణులను బంధువులు శనివారం ఆసుపత్రికి తీసుకెళ్లాలని భావించారు. అంబులెన్స్ రావడానికి దారి సరిగా లేకపోవడంతో.. నడక ప్రారంభించారు. జ్యోతికి పురిటి నొప్పులు ఎక్కువ కావడంతో.. అడుగు తీసి అడుగు వేయలేని స్థితిలో ఆశా వర్కర్ ఆమెకు రోడ్డు పక్కనే డెలివరీ చేశారు. కానీ పురిటిలోనే బిడ్డ మరణించింది.
Samayam Telugu vishaka


పసిగుడ్డును బతికించేందుకు ఆశా వర్కర్లు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. బాలింత ప్రసవ వేదనను బంధువులు,స్థానికులు వీడియో తీశారు. రోడ్డు మీద డెలివరీ కావడం వల్ల వైద్యం అందక బిడ్డ చనిపోవడం అందర్నీ కలచివేసింది. జ్యోతితోపాటు మరో గర్భిణిని హాస్పిటల్‌కు తరలించి చికిత్స అందిస్తున్నారు.

25 రోజుల క్రితం కూడా విశాఖ ఏజెన్సీలో ఇలాంటి ఘటన చోటు చేసుకుంది. విశాఖ జిల్లా పెదబయలు మండలం జమదంగికి చెందిన లక్ష్మీ అనే గర్భిణి వైద్యం కోసం 20 కి.మీ. నడిచి వెళ్లింది. జి.మాడుగుల మండంలోని బొయితిలో ఉన్న ఆర్ఎంపీ డాక్టర్ దగ్గర చికిత్స చేయించుకొని తిరుగు ప్రయాణమైన ఆమెకు మార్గమధ్యంలో పురిటి నొప్పులు వచ్చాయి. డోలీలో ఇంటికి తీసుకెళ్లగా.. ప్రసవం తర్వాత తీవ్ర రక్తస్రావమైంది. ఈ ఘటనలో తల్లీ, బిడ్డ ఇద్దరూ చనిపోయారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.