యాప్నగరం

‘పోలవరం’ నిలిపేయండి.. సుప్రీంలో ఒడిశా అఫిడవిట్

పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనులను నిలిపేయాలని ఒడిశా సుప్రీం కోర్టును కోరింది. అత్యున్నత న్యాయస్థానంలో అఫిడవిట్ సమర్పించిన ఒడిశా.. ప్రాజెక్టు నిర్మాణం పూర్తయితే తమకు తీవ్ర నష్టం వాటిల్లుతుందని పేర్కొంది.

Samayam Telugu 9 Feb 2020, 11:55 am
పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనులు నిలిపేయాలని ఒడిశా ప్రభుత్వం సుప్రీం కోర్టును కోరింది. 71 పేజీల అఫిడవిట్‌ను న్యాయస్థానానికి సమర్పించిన ఒడిశా.. పోలవరం ప్రాజెక్టు నిర్మాణం పూర్తయితే తమకు తీవ్రంగా నష్టం వాటిల్లుతుందని పేర్కొంది. పోలవరం ముంపు విషయంలో స్పష్టత లేదని, ప్రాజెక్టు వద్ద గరిష్ట వరద ప్రవాహం ఏపీ చెప్పిన దాని కంటే చాలా ఎక్కువగా ఉంటుందని ఒడిశా వాదించింది. ప్రాజెక్టు నిర్మాణాన్ని నిలిపేస్తూ 2018 జులై 10, 2019 జూన్‌ 27 తేదీల్లో జారీచేసిన ఉత్తర్వులపై ఇచ్చిన స్టేను రద్దు చేయాలని ఒడిశా సర్కారు అత్యున్నత ధర్మాసనాన్ని కోరింది.
Samayam Telugu polavaram


ఏపీ సర్కారు ట్రైబ్యునల్‌కు సమాచారం ఇచ్చినట్టు పోలవరం వద్ద గోదావరి వరద ప్రవాహం 36 లక్షలు క్యూసెక్కులు కాకుండా 50 లక్షల క్యూసెక్కుల వరకు ఉంటుందని ఒడిశా తెలిపింది. రూర్కీ ఐఐటీ సర్వే ప్రకారం గోదావరిలో గరిష్టంగా 58 లక్షల క్యూసెక్కుల వరకు వరద వచ్చే అవకాశం ఉందని ఒడిశా సర్కారు చెప్పింది. అదే జరిగితే ఒడిశా పరిధిలోని శబరి, సీలేరు ప్రాంతాల్లో 200 అడుగులకుపైగా ముంపు తలెత్తుతుందని, అంత వరద ప్రవాహాన్ని.. పోలవరం డ్యాం తట్టుకోలేదని చెప్పింది.

పోలవరం ముంపు గ్రామాల సంఖ్యను 2005లో 412గా పేర్కొనగా.. 2017 మే నాటికి ముంపు గ్రామాల సంఖ్య 371కి తగ్గింది. ముంపు గ్రామాలపై స్పష్టత లేదని ఒడిశా ఆరోపించింది. తమకు జరిగే నష్ట నివారణకు ప్రాజెక్టు నిర్మాణాన్ని నిలిపేయాలని కోరింది. పూడిక వల్ల భవిష్యత్తుల్లో బ్యాక్ వాటర్‌తో నష్టం మరింత పెరుగుతుందని ఆరోపించింది. గరిష్ట వరదను లెక్కించడానికి బ్యాక్‌వాటర్‌ స్టడీ చేయించాలని కోరింది.

పోలవరం కారణంగా తమ రాష్ట్రంలో 6 వేల మంది గిరిజనులపై ప్రభావం ఉంటుందని.. కేంద్రం ఈ విషయంలో జోక్యం చేసుకోవాలని ఒడిశా ఎంపీ సస్మత్ పాత్రా శుక్రవారం రాజ్యసభలో కోరారు.

Read Also: ‘గోదావరి సాక్షి’గా.. జగన్ మీడియా గుర్రు..

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.