యాప్నగరం

విశాఖ పరవాడ ప్రమాదంలో ఒకరు మృతి.. శిథిలాల కింద మృతదేహం

కంపెనీలో విధుల నిర్మర్తించడానికి నిన్నరాత్రి వెళ్లిన శ్రీనివాస్ అనే వ్యక్తి కనిపించడం లేదని వారి కుటుంబసభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ ప్రమాదంలో అతడు మరణించినట్లు తెలుస్తోంది. తాజాగా శిథిలాల కింద ఓ మృతదేహాన్ని అధికారులు గుర్తించారు.

Samayam Telugu 14 Jul 2020, 9:37 am
విశాఖలోని పరవాడ రాంకీ ఫార్మాసిటీలో ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. విశాఖ సాల్వెంట్స్‌ కంపెనీలో సోమవారం రాత్రి భారీ ప్రమాదం చోటుచేసుకుంది . రాత్రి 11 గంటల ప్రాంతంలో సాల్వెంట్ ప్లాంట్‌లో జరిగిన ఈ భారీ పేలుడుతో విశాఖ నగరం మరోసారి ఉలిక్కిపడింది. ఈ ఘటనలో ఒకరు మృతి చెందినట్లు తెలుస్తోంది. ఘటనలో కాండ్రేగుల శ్రీనివాస్‌ (40) ప్రాణాలు కోల్పోయాడు. అయితే ఈ విషయాన్ని ఇంకా అధికారికంగా ధ్రువీకరించాల్సి ఉంది. సాల్వెంట్స్‌ ఫార్మా కంపెనీలో శ్రీణివాస్‌ సీనియర్‌ కెమిస్ట్‌గా‌ పని చేస్తున్నారు. ప్రమాద సమయంలో కంపెనీలో నలుగురు సిబ్బంది ఉన్నారు. తీవ్రంగా గాయపడిన కార్మికుడు మల్లేశ్వరరావును గాజువాక ఆసుపత్రికి తరలించారు.
Samayam Telugu పరవాడ అగ్నిప్రమాదంలో ఒకరు మృతి
vizag parawada fire accident


ఇప్పటివరకు ఈ ప్రమాదంలో నలుగురికి గాయాలయ్యాయని.. ఇందులో ఒకరి పరిస్థితి విషమంగా ఉందని తెలుస్తోంది. అయితే తాజాగా ఘటనాస్థలంలో ఒకరి మృతదేహం లభ్యమైందని తెలుస్తోంది. మృతదేహం శిధిలాల కింద ఉన్నట్లు సమాచారం. అయితే ఈ విషయాన్ని అధికారులు ఇంకా దృవీకరించాల్సి ఉంది. మరోవైపు అసలు ప్రమాదం జరిగినప్పుడు ఎంత మంది విధుల్లో ఉన్నారు..? ఎంత మంది ప్రమాదం నుంచి తప్పించుకుని బయటపడ్డారు..? అనే విషయాలు ఇంతవరకూ తెలియరాలేదు. అర్థరాత్రి జరిగిన ఈ ప్రమాదాన్ని దాదాపు ఐదు గంటలపాటు కష్టపడి అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చారు. పరవాడలోని రాంకీ ఫార్మాసిటీలో అర్ధరాత్రి జరిగిన అగ్నిప్రమాద ఘటనపై కార్మిక సంఘాలు తీవ్రస్థాయిలో మండిపడ్డాయి. యాజమాన్యం వైఫల్యం కారణంగానే ప్రమాదం చోటు చేసుకుందని ఆగ్రహం వ్యక్తం చేశాయి.
Read More: విశాఖ రాంకీ పరిశ్రమలో భారీ ప్రమాదం.. నగరంలో మళ్లీ అలజడి
ప్లాంట్‌లో మృతదేహం లభ్యం అయ్యిందన్న వార్తలతో వారిలో ఆందోళన మొదలైంది. ప్రస్తుతం నలుగురు ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటుండగా.. అందులో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. ఇందుకు సంబంధించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది. మరోవైపు కంపెనీలో జరిగిన పేలుడుపై పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి ఆరా తీశారు. జిల్లా అధికార యంత్రాంగంతో ఫోన్ ద్వారా ప్రాథమిక సమాచారాన్ని అడిగి తెలుసుకున్న మంత్రి.. క్షతగాత్రులకు అవసరమైన వైద్య సదుపాయాలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.