యాప్నగరం

ఏపీలో ముగ్గురు యువతుల దుర్మరణం.. పదేళ్ల బాలుడిని రక్షించబోయి..

పదేళ్ల బాలుడిని రక్షించేందుకు ప్రయత్నించి ముగ్గురు యువతులు మృతి చెందారు. ఈ విషాద ఘటన ప్రకాశం జిల్లా నాగులుప్పలపాడు మండలంలో చోటుచేసుకుంది.

Samayam Telugu 13 May 2020, 11:21 pm
కుంటలో ఈతకు వెళ్లి మునిగిపోతున్న పదేళ్ల బాలుడుని రక్షించే ప్రయత్నంలో ముగ్గురు యువతులు మృతి చెందారు. ఈ విషాద ఘటన బుధవారం ప్రకాశం జిల్లా నాగులుప్పలపాడు మండలం తిమ్మసముద్రంలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామంలోని పడమర ఎస్సీ కాలనీకి చెందిన చేజర్ల వేదిక (25), చేజర్ల మాధవి (18), చేజర్ల సుభాషిణి (16) మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో బట్టలు ఉతికేందుకు గ్రామ సమీపంలో ఉన్న చింతకుంట వద్దకు వెళ్లారు.
Samayam Telugu ముగ్గురు యువతుల మరణం


వారు బట్టలు ఉతుక్కునే సమయంలో వారి మేనల్లుడు శశాంక్ (10) కుంటలో పడి మునిగిపోవడం గమనించారు. ఈ క్రమంలో ముగ్గురు యువతులు కుంటలోకి దిగి శశాంక్‌ను రక్షించి, బయటకు తీశారు. అయితే వీరు బయటకు వచ్చే క్రమంలో పక్కనే ఉన్న గోతిలోకి ముగ్గురు యువతులు జారిపోయారు. చట్టుపక్కల సాయం చేసేవారు లేకపోవడంతో నీటిలో మునిగిపోయి ముగ్గురు యువతులు అక్కడికక్కడే మృతి చెందారు.

ప్రాణాలతో బయటపడ్డ బాలుడి ద్వారా విషయం తెలుసుకున్న కాలనీ వాసులు యువతుల మృతదేహాలను వెలికి తీశారు. అయితే ఆ ప్రాంతంలో యువతుల మృతదేహాల వద్ద కుటుంబ సభ్యులు రోదించిన తీరు కంటతడి పెట్టించింది. మృతుల తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఇంకొల్లు పోలీసులు తెలిపారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.