మే 29.. నవ్యాంధ్ర రాజకీయాల్లో ఎప్పటికీ గుర్తుండిపోయే తేదీ ఇది. సరిగ్గా 3 ఏళ్ల క్రితం అంటే 2019లో ఇదే రోజున వెల్లడైన ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో వైఎస్సార్సీపీ ఘన విజయం సాధించింది. కనీవిని ఎరగని రీతిలో 151 స్థానాలను గెలుచుకుంది. జగన్ పార్టీ విజయం దేశం దృష్టిని ఆకర్షించింది. అధికార టీడీపీ 23 స్థానాలకే పరిమితం కాగా.. ఎన్నో అంచనాల మధ్య బరిలోకి దిగిన జనసేన పార్టీ ఒక్క స్థానానికి మాత్రమే పరిమితమైంది. ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేసిన రెండు చోట్ల ఓడిపోయారు. అధికారంలోకి మూడేళ్లు అవుతున్న సందర్భాన్ని వైఎస్సార్సీపీ ఓ ట్వీట్ ద్వారా గుర్తు చేసుకుంది. జగన్ దావోస్ పర్యటనకు వెళ్లడం.. ఆ పార్టీ ఎమ్మెల్సీ అనంతబాబు హత్య ఆరోపణలు ఎదుర్కొంటుండటంతో.. అధికార పార్టీ సంబరాలు చేసుకునే పరిస్థితి లేదు. ‘రాష్ట్ర చరిత్రలోనే కనీ వినీ ఎరుగని విధంగా ప్రజలిచ్చిన స్పష్టమైన తీర్పు.. #3YearsForYSRCPMassVictory’ అని అధికార పార్టీ ట్వీట్ చేసింది.
కానీ జనసైనికులు మాత్రం మే 23వ తేదీని మర్చిపోవడం లేదు. మూడేళ్ల క్రితం జనసేన ఓడిపోవడాన్ని... ముఖ్యంగా పవన్ కళ్యాణ్ పోటీ చేసిన రెండు చోట్ల (గాజువాక, భీమవరం) ఓడటాన్ని వారు మర్చిపోవడం లేదు. మేం ఓడిపోయాం.. కానీ పోరాటం ఆపలేదంటున్నారు. వచ్చే ఎన్నికల్లో సత్తా చాటుతాం అంటున్నారు.
‘మూడేళ్ల క్రితం జరిగిన ఎన్నికల్లో మేం ఓడిపోయాం. కానీ దుష్ట రాజకీయాలకు వ్యతిరేకంగా పోరాటానికి, ఎన్నికల ఫలితాలో సంబంధం లేకుండా ప్రజల పక్షాన నిలబడటానికి జనసేన కట్టుబడి ఉంది. థాంక్యూ పవన్ కళ్యాణ్ గారూ.. ఆయనలా బతకడం అంత ఈజీ కాదు’ అని ఓ జనసైనికుడు ట్వీట్ చేశారు.
మూడేళ్ల కిందట ఇదే రోజు ఎన్నికల్లో మనం ఓడిపోయాం.. గెలుపోటములతో సంబంధం లేదు.. మేం ఎప్పటికీ నీతోనే ఉంటాం అన్నయ్యా అంటూ పవన్ కళ్యాణ్ను ఉద్దేశించి అభిమానులు ట్వీట్ చేస్తున్నారు. ఒక్క ఓటమి జనసేనను ఆపలేదంటున్నారు. ‘ఓటమికి ఆగిపోలేదు.. మనకోసం పోరాటం ఆపలేదు’ అంటూ జనసేనానిని ఆకాశానికి ఎత్తుతున్నారు.
జనసైనికులు ట్విట్టర్లో యాక్టివ్గా స్పందించడం ఎంత సహజమో.. బయట పెద్దగా స్పందించకపోవడం అంతే సహజం అనే అపవాదు ఉంది. ‘పవన్ అన్నకు ప్రాణం ఇస్తాం.. జగనన్నకు ఓటేస్తాం’ అనే డైలాగ్ సైతం గత ఎన్నికల ఫలితాల తర్వాత వైరలయ్యింది. మరి ఈసారి జనసైనికులు ఏం చేస్తారో చూడాలి. ట్విట్టర్లోనే కాకుండా.. బయట కూడా ఇదే రీతిలో మద్దతుగా నిలిస్తే.. జనసేన పుంజుకునే అవకాశాలున్నాయి.
‘మూడేళ్ల క్రితం జరిగిన ఎన్నికల్లో మేం ఓడిపోయాం. కానీ దుష్ట రాజకీయాలకు వ్యతిరేకంగా పోరాటానికి, ఎన్నికల ఫలితాలో సంబంధం లేకుండా ప్రజల పక్షాన నిలబడటానికి జనసేన కట్టుబడి ఉంది. థాంక్యూ పవన్ కళ్యాణ్ గారూ.. ఆయనలా బతకడం అంత ఈజీ కాదు’ అని ఓ జనసైనికుడు ట్వీట్ చేశారు.