యాప్నగరం

జగన్‌రెడ్డి గారూ.. ప్రీతికి న్యాయం చేయలేని సీఎం పదవి ఎందుకు: పవన్

సుగాలి ప్రీతి లాంటి బాధితులకు న్యాయం చేయలేని ముఖ్యమంత్రి పదవి ఎందుకని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రశ్నించారు. ‘దిశ’ గురించి మాట్లాడిన సీఎం జగన్.. ప్రీతి గురించి ఎందుకు మాట్లాడరని నిలదీశారు.

Samayam Telugu 12 Feb 2020, 6:01 pm
ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ‘దిశ’ సంఘటన గురించి మాట్లాడినప్పుడు.. ప్రీతి గురించి ఎందుకు మాట్లాడటం లేదని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రశ్నించారు. కర్నూలును జ్యుడీషియల్ కేపిటల్‌గా ప్రకటించారని, అయితే ఇక్కడే న్యాయం చేయకపోతే ఇంకెక్కడ జరుగుతుందని నిలదీశారు. సుగాలి ప్రీతికి న్యాయం చేయలేకపోతే జ్యుడీషియల్ కేపిటల్ పెట్టినా నిష్ప్రయోజనమని చెప్పారు. సుగాలి ప్రీతికి న్యాయం చేయాలంటూ బుధవారం కర్నూలులో జనసేనాని పవన్ కళ్యాణ్ ర్యాలీ చేపట్టి బహిరంగ సభ నిర్వహించారు. ఈ సందర్భంగా పవన్ మాట్లాడుతూ.. సుగాలి ప్రీతి హత్యాచార కేసును రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా సీబీఐకి అప్పగించకపోతే జాతీయ మానవ హక్కుల కమిషన్‌ను ఆశ్రయిస్తానని వెల్లడించారు. అవసరమైతే నిరాహార దీక్షకు దిగుతానని ప్రకటించారు.
Samayam Telugu pawan kalyan


Also Read: ‘చీప్ పీపుల్’ అని మంత్రి అనిల్ అన్నారు.. గుండెలు పిండేసిన ప్రీతి తల్లి ప్రసంగం

రాజమహేంద్రవరంలో ‘దిశ’ పోలీస్ స్టేషన్‌ను ఏర్పాటు చేశారని, ఇలాంటి స్టేషన్లు కర్నూలులో కూడా పెట్టాలన్నారు. సుగాలి ప్రతి ఒక గిరిజన బాలిక అని.. కులాలు, మతాలు ఏవైనా న్యాయం ఒక్కటే ఉండాలన్నారు. అగ్రవర్ణాలకు ఒక న్యాయం దళిత, గిరిజనులకు మరొక న్యాయం ఉండకూడదని చెప్పారు. ఇలాంటి అసమానతలు చూసే జనసేన పార్టీ పెట్టినట్లు తెలిపారు.

సుగాలి ప్రీతికి న్యాయం చేయలేనప్పుడు సీఎం పదవి ఎందుకని ప్రశ్నించారు. సుగాలి ప్రీతికి న్యాయం చేయాలని అధికారులకు ఉన్నా రాజకీయ నేతలు అడ్డుపడుతున్నారని ఆరోపించారు. ప్రభుత్వ రెసిడెన్షియల్ పాఠశాలల్లో బాలికపై అత్యాచారాలు చేస్తున్నట్లు తన దృష్టికి వచ్చిందని సంచలన వ్యాఖ్యలు చేశారు.

Also Read: పవన్ కళ్యాణ్‌ గో బ్యాక్.. కర్నూలులో ఉద్రిక్తత

విద్యా సంస్థల్లోనే ఇలాంటి సంఘటనలు జరిగితే పిల్లల్ని ఇంకెవరు రక్షిస్తారని ప్రశ్నించారు. సుగాలి ప్రీతికి జరిగిన అన్యాయాన్ని ఈరోజు ప్రశ్నించకపోతే రేపు మన ఇంట్లోకి చొరబడి కూడా ఇలాంటి అఘాయిత్యాలు చేస్తారని హెచ్చరించారు. సుగాలి ప్రీతికి న్యాయం జరిగే వరకు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూనే ఉంటానని స్పష్టం చేశారు.

Also Read: జస్టిస్ ఫర్ సుగాలి ప్రీతి.. హోరెత్తుతున్న ట్విట్టర్‌

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.