యాప్నగరం

గెలిస్తే మొదట ఆ సమస్యే పరిష్కరించేవాడిని: పవన్

Pawan Kalyan | కాపుల రిజర్వేషన్ల విషయంలో వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం దాటవేసే ధోరణిని ప్రదర్శిస్తోందని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆరోపించారు. ఆ సమస్యను రాజకీయ కోణంలో చూస్తున్నారని విమర్శించారు.

Samayam Telugu 5 Aug 2019, 10:48 pm
తి క్లిష్టమైన తెలంగాణ, కశ్మీర్‌ సమస్యలకే పరిష్కారం దొరికినప్పుడు కాపుల రిజర్వేషన్‌ సమస్యకు కూడా పరిష్కారం దొరుకుతుందని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. అయితే.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌.. రాజకీయ ప్రయోజనాల దృష్టితో కాకుండా, సమస్యను పరిష్కరించాలనే కోణంలో ఆలోచించాలని హితవు పలికారు. కాపుల రిజర్వేషన్‌ విషయాన్ని జగన్‌ రాజకీయ కోణంలో చూస్తున్నారని ఆరోపించారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో సోమవారం (ఆగస్టు 5) జనసేన ఆత్మీయ సమావేశంలో ఆయన పాల్గొని ప్రసంగించారు.
Samayam Telugu Bhimavaram
పవన్ కళ్యాణ్


పార్టీలు, రాజకీయ నాయకుల ప్రయోజనాల కంటే ప్రజా ప్రయోజనాలపైనే బ్యూరోక్రాట్లు దృష్టి పెట్టాలని పవన్ సూచించారు. ప్రజా వ్యతిరేక విధానాలను నిలువరించాలని చెప్పారు. వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి హయాంలో చాలా మంది అధికారులు కోర్టుల చుట్టూ తిరగడం, జైళ్లకు వెళ్లడం చూశామని గుర్తు చేశారు. ‘తప్పు చేస్తే రాజకీయ నాయకులు బాగానే ఉంటారు. అధికారులే బలైపోతారు’ అని పవన్ అన్నారు.

Read Also: చిల్లర రాజకీయాలతో రాష్ట్రానికి నష్టం..

‘కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఆర్థికంగా వెనకబడిన తరగతుల రిజర్వేషన్‌ అంశంలో గత ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంది. గత ప్రభుత్వం చేసింది కాబట్టి మేం తీసేస్తాం అన్నట్లుంది వైసీపీ ప్రభుత్వం వైఖరి. అమరావతి కావచ్చు, పోలవరం ప్రాజెక్ట్‌ కావచ్చు. గ్రీన్‌ పవర్‌.. ఇప్పుడు కాపు రిజర్వేషన్లు.. గత ప్రభుత్వం చేసిన వాటిని తీసేస్తున్నారు’ అని పవన్ అన్నారు.

ఉన్న రిజర్వేషన్లను పెంచుతూ కేంద్రం వెసులుబాటు ఇచ్చి రాష్ట్రాలకు తగ్గట్టుగా చేసుకోమని చెప్పిందని పవన్ అన్నారు. అందుకు తగ్గట్టే ఆర్థికంగా వెనకబడ్డ తరగతులకు రిజర్వేషన్లు తీసుకొచ్చారని తెలిపారు. సీఎం వైఎస్ జగన్‌ ప్రజలకు అండగా నిలబడాలని.. కాపులను ఓసీలు కాదు, బీసీలు కాదు అన్నట్లు మాట్లాడటం సరికాదని అన్నారు. ఈ విషయంలో నిశిత దృష్టితో చూడాలని సూచించారు.

‘రెండు వేలతో ఓటు కొనుగోలు చేసి రూ.3 వేలు పింఛన్‌ ఇస్తామని చెప్పి మొదటి నెలలోనే రూ.750 వెనక్కి తీసేసుకున్నారు.’ అని వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంపై పవన్ మండిపడ్డారు.

తాను భీమవరం నుంచి గెలిస్తే ముందుగా డంపింగ్‌ యార్డు సమస్యనే పరిష్కరించేవాడినని పవన్ తెలిపారు. దురదృష్టవశాత్తు ఓడిపోయానని చెప్పారు. గెలిచిన వ్యక్తులు ఈ సమస్యను పరిష్కరించాలని కోరారు. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి అన్నపూర్ణ లాంటి ఉభయ గోదావరి జిల్లాల్లో ఆక్వా కాలుష్యంతో తాగడానికి మంచినీళ్లు లేకపోవడం దురదృష్టకరమని పవన్ అన్నారు.

వరదలు వచ్చి పంటలు నష్టపోవడం, లోతట్టు ప్రాంతాలు వరదల్లో చిక్కుకుపోవడం లాంటి సమస్యలు తనను తీవ్రంగా బాధించాయని పవన్ తెలిపారు. భీమవరం పట్టణాన్ని మున్సిపాలిటి నుంచి కార్పొరేషన్‌ స్థాయికి అప్‌‌గ్రేడ్‌ చేయాలని డిమాండ్ చేశారు.

హోదాకు వాళ్లే తూట్లు పొడుస్తున్నారు..
ఏపీకి ప్రత్యేక హోదా అడిగినవాళ్లే నేడు తూట్లు పొడుస్తున్నారని పవన్ ధ్వజమెత్తారు. నాయకుల్లో, ప్రజల్లో ఆవేదన ఉంటేనే హోదా సాధ్యమవుతుందని చెప్పారు. ‘ప్రత్యేక హోదా రాష్ట్రం హక్కు. అలాంటి హక్కును సాధించాలంటే నా ఒక్కడి ఆరాటం, పోరాటం సరిపోదు. ప్రజల్లో భావోద్వేగం రగిలితే.. దాన్ని ముందుకు తీసుకెళ్లడానికి సిద్ధంగా ఉన్నా. హోదా సాధన కోసం ఏ స్థాయి పోరాటానికైనా సిద్ధం’ అని పవన్ అన్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.