యాప్నగరం

YS Jagan గారూ ధన్యవాదాలు.. ప్రధాని మోదీ ఆసక్తికర ట్వీట్

YS Jagan Mohan Reddy: ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌కు ప్రధాని నరేంద్ర మోదీ ధన్యవాదాలు చెప్పారు. ఈ సమయంలో మీ సహకారం ఎంతో విలువైనదని పేర్కొన్నారు.

Samayam Telugu 5 Apr 2020, 11:51 am
కరోనా వైరస్ (కోవిడ్ 19)పై ప్రజలందరూ ఐక్యంగా చేస్తున్న పోరాటానికి సూచికగా ఆదివారం రాత్రి 9 గంటలకు 9 నిమిషాల పాటు విద్యుత్ లైట్లు ఆర్పివేసి.. క్యాండిల్స్, దీపాలు వెలిగించాలన్న ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునకు అపూర్వ స్పందన వస్తోంది. ప్రధాని పిలుపునకు వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు సహా సినీ, రాజకీయ, వ్యాపార రంగాల ప్రముఖులు స్వాగతించారు. ఈ నేపథ్యంలో ప్రధాని మోదీ పలువురిని పేరుపేరునా అభినందిస్తున్నారు. ఇందులో భాగంగా ప్రధానికి మద్దతు పలికిన ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డికి నరేంద్ర మోదీ ధన్యవాదాలు చెప్పారు. ఈ మేరకు ఆదివారం ఉదయం ఆయన ట్వీట్ చేశారు.
Samayam Telugu pjimage - 2020-04-05T113803.695


‘ధన్యవాదాలు జగన్‌ గారూ. ఈ క్లిష్ట సమయంలో మీ సహకారం ఎంతో విలువైనది. కరోనాపై పోరాటంలో దేశ ప్రజల్లో సమైక్యత పెంపొందించడానికి అది ఎంతగానో దోహదపడుతుంది’ అని ప్రధాని మోదీ ట్వీట్‌ చేశారు.

అలాగే ఇటీవల ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సైతం ప్రధాని మోదీకి మద్దతుగా ట్వీట్ చేశారు. ‘ఆదివారం రాత్రి 9 గంటలకు 9 నిమిషాల పాటు దీపాలను వెలిగించండి. కమ్ముకొస్తున్న చీకటిని రాష్ట్ర ప్రజలు ఆశాజ్యోతిని వెలిగించడం ద్వారా ఒక అనంతమైన ప్రకాశంతో పారదోలుదాం. ప్రధాని నరేంద్ర మోదీ పిలుపు మేరకు కోవిడ్‌–19 మహమ్మారిపై మనమంతా ఐక్యంగా ఒక బలీయమైన చెక్కుచెదరని శక్తిగా నిలబడదాం’ అని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి శనివారం రాత్రి ట్వీట్‌ చేశారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.