యాప్నగరం

భార్యను వేధిస్తున్న అధికారులు.. జగన్ క్యాంప్ ఆఫీస్ వద్ద భర్త ఆత్మహత్యాయత్నం

ప్రకాశం జిల్లాకు చెందిన ఓ వ్యక్తి సీఎం క్యాంప్ ఆఫీసు ఎదుట ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన శనివారం చోటుచేసుకుంది. గృహ నిర్మాణ సంస్థ అధికారులు అవినీతికి పాల్పడుతున్నారని అతడు ఆరోపించారు.

Samayam Telugu 20 Oct 2019, 10:16 am
తాడేపల్లిలోని సీఎం క్యాంప్ ఆఫీసు సమీపంలో ఓ వ్యక్తి ఆత్మహత్యాయత్నం చేయడం కలకలం రేగింది. ప్రకాశం జిల్లాకు చెందిన వ్యక్తి తన ఒంటిపై పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నం చేశాడు. అయితే, సకాలంలో పోలీసులు స్పందించి అతడిని నిలువరించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ప్రకాశం జిల్లా కొమరవోలు మండలానికి చెందిన కోనేటి సుధాకర్‌ ఒంటిపై పెట్రోల్‌ పోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. జిల్లాలోని గృహ నిర్మాణ సంస్థ అధికారులు అవినీతికి పాల్పడుతోన్నారని.. అదే సంస్థలో వర్క్‌ ఇన్‌స్పెక్టర్‌గా పనిచేస్తున్న తన భార్యకు 10 నెలలుగా జీతం నిలిపివేశారని ఆరోపించారు.
Samayam Telugu sucide


ఈ విషయాన్ని తాను సీఎం దృష్టికి తీసుకెళతానంటూ అతడు క్యాంపు ఆఫీసులోకి వెళ్లేందుకు ప్రయత్నించాడు. సీఎం అపాయింట్‌మెంట్‌ లేనివారిని అనుమతించేది లేదని పోలీసులు ఆయన్ను అడ్డుకున్నారు. దీంతో కాస్త పక్కకు వెళ్లిన సుధాకర్.. తన వెంట తెచ్చుకున్న సీసాలో పెట్రోల్‌ను ఒంటిపై పోసుకుని నిప్పంటించుకోబోయాడు. దీనిని గమనించి పోలీసులు అప్రమత్తమై అతడిని నిలువరించారు. సుధాకర్‌ను అదుపులోకి తీసుకుని పోలీసుస్టేషన్‌కు తరలించారు. అతడిపై ఆత్మహత్యాయత్నం కేసు నమోదుచేశారు.

గత జులైలోనూ సీఎం క్యాంప్ ఆఫీసు ఎదుట ఓ మహిళ ఆత్మహత్యాయత్నం చేసిన విషయం తెలిసిందే. కృష్ణా జిల్లాకు చెందిన సత్యనాగకుమారి అనే వృద్ధురాలు జులై 19న స్పందన కార్యక్రమంలో ఆర్జీ పెట్టుకున్నారు. అయితే, సమస్య పరిష్కారం కాకపోవడంతో ఏకంగా సీఎం క్యాంప్ ఆఫీసు వద్దకు వచ్చి ఆత్మహత్యాయత్నం చేశారు. నిద్రమాత్రలు మింగి అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయిన ఆమెను పోలీసులు హుటాహుటీన విజయవాడ ప్రభుత్వ హాస్పిటల్‌కు తరలించారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.