యాప్నగరం

Pawan Kalyan వ్యాఖ్యలతో ఏకీభవిస్తున్నా.. వాళ్లకు నిరాశ కలిగించి ఉండొచ్చు: ఎంపీ రఘురామ

Raghu Rama Krishnam Raju ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలతో ఏకీభవిస్తున్నానని.. ఎలాంటి తప్పు లేదన్నారు. పవన్ కళ్యాణ్‌ను ఒక బానిసలా భావించి.. ఆయన తమ మాట వినాలని కొంతమంది తమకు తోచినట్లు మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందన్నారు. వైసీపీ ఎమ్మెల్యే సోదరుడు చేసిన వ్యాఖ్యల్ని పరిశీలిస్తే.. పవన్ చేసిన కామెంట్స్ కరెక్టేనేమో అనిపిస్తుందన్నారు. అలాగే తెలంగాణ సిట్ తనకు ఇచ్చిన నోటీసులపై మరోసారి క్లారిటీ ఇచ్చారు రఘురామ.

Authored byతిరుమల బాబు | Samayam Telugu 29 Nov 2022, 1:40 pm

ప్రధానాంశాలు:

  • పవన్ కళ్యాణ్ చేసిన కామెంట్లపై రఘురామ
  • జనసేనాని చేసిన వ్యాఖ్యల్ని స్వాగతిస్తున్నా
  • ఈ వ్యాఖ్యల్లో ఎలాంటి తప్పులేదన్న ఎంపీ
హైలైట్స్ చదవాలంటే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి
Samayam Telugu Raghu Rama Krishna Raju
జనసేన పార్టీ (Janasena Party) అధినేత పవన్ కళ్యాణ్ (Pawan Kalayan) చేసిన వ్యాఖ్యలతో తాను ఏకీభవిస్తున్నాను అన్నారు ఎంపీ రఘురామ కృష్ణరాజు. తమ పార్టీని ఉగ్రవాద సంస్థతో పవన్ కళ్యాణ్ పోల్చడం బాధనిపించిందని.. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు (Chandrababu Naidu), టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ (Nara Lokesh)ను ఉద్దేశించి తమ పార్టీకి చెందిన ఒక ఎమ్మెల్యే సోదరుడు చేసిన వ్యాఖ్యలను పరిశీలిస్తే పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు కరెక్టేనేమో అని అనిపిస్తుందన్నారు. చంద్రబాబును గతంలోనే లేపేసే వాళ్ళమని, లోకేష్‌ను కావాలంటే ఇప్పుడు లేపేస్తామన్న ఎమ్మెల్యే సోదరుడి వ్యాఖ్యలు ఉగ్రవాద సంస్థల ప్రతినిధులు చేసే వ్యాఖ్యలకు దగ్గరగా ఉన్నాయన్నారు. పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలలో ఎటువంటి తప్పు లేదనే తాను భావిస్తున్నాను అన్నారు.
ప్రభుత్వంపై పోరాటానికి తనకు ఎవరి పర్మిషన్ అక్కరలేదని పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు తన మనసును దోచాయన్నారు. రోడ్ మ్యాప్, గూగుల్ మ్యాప్ అడిగారని.. పవన్ కళ్యాణ్‌ను ఒక బానిసలా భావించి ఆయన తమ మాట వినాల్సిందేనని కొంతమంది నాయకులు తమకు తోచినట్లు మాట్లాడడం హాస్యాస్పదంగా ఉందన్నారు. కేంద్ర బీజేపీ నాయకత్వం పవన్ కళ్యాణ్‌తో ఎంతో మర్యాదగా ప్రవర్తిస్తుందని.. ప్రధాని మోదీ సైతం 40 నిమిషాల పాటు సమయాన్ని కేటాయించి ఆయనతో చర్చించారని గుర్తు చేశారు. జనసేనను ముఖ్యమంత్రి జగన్ రౌడీ సేనగా పోల్చడంపై పవన్ కళ్యాణ్ స్పందించిన తీరు బాగుందని అభినందించారు. పవన్ కళ్యాణ్ అన్ని వర్గాలకు చెందిన నాయకుడన్నారు.

మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటనలకు ప్రజల నుంచి అనూహ్య స్పందన లభిస్తోందన్నారు రఘురామ. కర్నూలు, నందిగామలలో చంద్రబాబు పర్యటన సందర్భంగా ఆయన రావడం గంటలు, గంటలు ఆలస్యం అయినా.. ఊర్లకు ఊర్ల ప్రజలు తరలివచ్చి ఆయన ప్రసంగాన్ని వినేందుకు ఆసక్తిని ప్రదర్శించారన్నారు. రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్ష నేత ప్రజాభిమానానికి నిదర్శనమైతే.. ధైర్యానికి పవన్ కళ్యాణ్ ప్రతీక అని వ్యాఖ్యానించార. ప్రజా సమస్యలపై గట్టిగా పోరాడుతున్న పవన్ కళ్యాణ్.. ప్రతిపక్షాల ఓట్లు చీలకుండా చూస్తాననడం శుభపరిణామం అన్నారు. మూడు రాజధానుల ఏర్పాటుపై హైకోర్టు ఇచ్చిన తీర్పుపై స్టే ఇచ్చేందుకు సుప్రీం కోర్టు నిరాకరించిందన్నారు రఘురామ కృష్ణరాజు.

తెలంగాణ ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్ ) తనకు జారీ చేసిన నోటీసులలో పేర్కొన్నట్టుగా కాకుండా అవసరమైతే తరువాత మళ్లీ నోటీస్ ఇచ్చి పిలుస్తామని పేర్కొన్నారని రఘురామ కృష్ణరాజు తెలిపారు. తాను సిట్ విచారణకు హాజరవుతానని చకోర పక్షుల్లా ఎదురు చూస్తున్నవారికి ఈ వార్త నిరాశ కలిగించి ఉంటుందని ఎద్దేవా చేశారు. సిట్ విచారణకు హాజరయ్యేందుకు, చట్టాన్ని గౌరవించే వ్యక్తిగా తన షెడ్యూల్ ను మార్చుకున్నానని తెలిపారు. ఇందులో మతం కోణం ఉన్నందున, సనాతన ధర్మాన్ని గౌరవించే వ్యక్తిని కాబట్టి తనకు సిట్ పోలీసులు ఏదైనా అపోహతో ఇంతకు ముందు నోటీసులు జారీ చేసి ఉండవచ్చునన్నారు.
రచయిత గురించి
తిరుమల బాబు
తిరుమల బాబు సమయం తెలుగులో సీనియర్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్రత్యేక కథనాలు అందిస్తుంటారు. ఆయనకు జర్నలిజంలో 11 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పొలిటికల్ న్యూస్, ఇతర రంగాలకు సంబంధించి వార్తలు రాశారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.