యాప్నగరం

ఏపీ ప్రజలకు అలర్ట్: మరో మూడు రోజులు వర్షాలు.. ఈసారి ఆ జిల్లాలపై ప్రభావం!

ఏపీకి మరో మూడు రోజులు వర్ష సూచన.. వాయుగుండం, అల్పపీడనం ప్రభావంతో వర్షాలు కురుస్తాయంటున్న వాతావరణశాఖ. ఈసారి ఏ జిల్లాలపై ప్రభావం అంటే..

Samayam Telugu 16 Oct 2020, 6:33 am
ఏపీ ప్రజలకు అలర్ట్.. రాష్ట్రంలో మరో మూడు రోజులు వర్షాలు పడతాయంటోంది వాతావరణశాఖ. ప్రస్తుతం కొనసాగుతున్న వాయుగుండం దక్షిణ మధ్య మహారాష్ట్ర ఆనుకుని ఉన్న దక్షిణ కోంకణ్ వద్ద తీవ్ర అల్పపీడనంగా కొనసాగుతుంది.. దీనికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం మధ్యస్థ ట్రోపో స్పియర్ స్థాయిల వరకు కొనసాగుతున్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. ఇది పశ్చిమ వాయువ్య దిశగా ప్రయాణించి మహారాష్ట్రకు దగ్గరలోని తూర్పు మధ్య అరేబియా సముద్రములోనికి ప్రవేశించే అవకాశం ఉంది.
Samayam Telugu ఏపీకి వర్ష సూచన


ఇటు మహారాష్ట్ర-దక్షిణ గుజరాత్ తీరాలను ఆనుకుని తూర్పు మధ్య అరేబియా సముద్రం మీదుగా ఈశాన్య అరేబియా సముద్ర ప్రాంతంలో వాయుగుండంగా బలపడే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు అధికారులు. ఈ వాయుగుండం పశ్చిమ వాయువ్య దిశగా ప్రయాణించే అవకాశం ఉందని.. పశ్చిమ మధ్య బంగాళాఖాతం నుంచి తూర్పు అరేబియా సముద్రం వరకు ఉత్తరాంధ్ర, తెలంగాణ దక్షిణ మధ్య మహారాష్ట్ర దానికి ఆనుకుని ఉన్న దక్షిణ కోంకణ్ వద్ద కొనసాగుతున్న తీవ్ర అల్పపీడనానికి అనుబంధంగా 1.5కిమీ నుంచి 3.1కిమీ ఎత్తు మధ్య ఉపరితల ద్రోణి కొనసాగుతున్నట్లు చెబుతున్నారు. అక్టోబర్‌ 19న మధ్య అరేబియా సముద్రంలో మరోక అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ చెబుతోంది.

ఉత్తర కోస్తాంధ్ర, యానాం, దక్షిణా కోస్తాంధ్ర, రాయలసీమలో మూడు రోజుల పాటూ ఉరుములు, మెరుపులతో పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కొన్నిచోట్ల కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ అంచనా వేస్తోంది. అలాగే శనివారం ఉత్తర, దక్షిణా కోస్తాంధ్రలతో పాటు రాయలసీమ, యానాంలో ఉరుములు, మెరుపులతో పాటు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు చాలా చోట్ల కురుస్తాయంటోంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.