యాప్నగరం

ఏపీ ఎన్నికల కమిషనర్ ఆయన కాదు.. జగన్ సర్కార్ మరో ట్విస్ట్

ఇదిలా ఉంటే కొత్త ఎన్నికల కమిషనర్ నియామకం విషయంలో తెలివిగా వ్యవహరించింది. హైకోర్టు రిటైర్డ్‌ న్యాయమూర్తిని రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ (ఎస్‌ఈసీ)గా నియమించేలా చట్టానికి సవరణ చేస్తూ ఆర్డినెన్స్‌ తీసుకొచ్చింది.

Samayam Telugu 11 Apr 2020, 6:45 am
ఏపీ ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్‌కు జగన్ సర్కారు ఉద్వాసన పలికిన సంగతి తెలిసిందే. ఆర్డినెన్స్ ద్వారా ఆయన్ను పదవి నుంచి తెలివిగా తప్పించింది. కానీ ఎక్కడా నిమ్మగడ్డను పదవి నుంచి తప్పిస్తున్నామన్న ప్రస్తావన తీసుకు రాకుండానే ఈ వ్యవహారాన్ని పూర్తి చేసింది. అలాగే ఎన్నికల కమిషనర్ పదవీ కాలాన్ని ఐదేళ్ల నుంచి మూడేళ్లకు కుదించింది. పదవీ కాలం తగ్గడంతోనే నిమ్మగడ్డ ఆ పదవి నుంచి తప్పించినట్లు పరోక్షంగా క్లారిటీ ఇచ్చింది.
Samayam Telugu jagan


ఇదిలా ఉంటే కొత్త ఎన్నికల కమిషనర్ నియామకం విషయంలో తెలివిగా వ్యవహరించింది. హైకోర్టు రిటైర్డ్‌ న్యాయమూర్తిని రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ (ఎస్‌ఈసీ)గా నియమించేలా చట్టానికి సవరణ చేస్తూ ఆర్డినెన్స్‌ తీసుకొచ్చింది. ఎన్నికల కమిషనర్‌గా రామసుందర్ రెడ్డిని నియమించారనే వార్తలకు ఈ నిర్ణయంతో చెక్ పడినట్లైంది. ఈ మేరకు పంచాయతీరాజ్‌ చట్టం–1994 సెక్షన్‌–200కు చేసిన సవరణల ఆర్డినెన్స్‌కు గవర్నర్‌ ఆమోద ముద్ర వేశారు. కొత్త చట్టం ప్రకారం ఇప్పటి వరకు రిటైర్డ్‌ ఐఏఎస్‌ అధికారులు రాష్ట్ర ఎన్నికల కమిషనర్లుగా నియమితులవుతూ వచ్చారు. ఇకపై హైకోర్టు రిటైర్డ్‌ జడ్జి ఎస్‌ఈసీ కానున్నారు.

రాష్ట్ర ఎన్నికల కమీషనర్‌ పదవీకాలం, జీతభత్యాల నియమ నిబంధనలపై రాష్ట్ర ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది. హైకోర్టు న్యాయమూర్తిగా పనిచేసిన వ్యక్తి రాష్ట్ర ఎన్నికల కమీషనర్‌గా నియమింపబడేందుకు అర్హుడు.. ఎన్నికల కమీషనర్‌ పదవీకాలం మూడేళ్లు ఉండాలని, గరిష్టంగా రెండు పర్యాయాలు (ఆరేళ్లు) పదవిలో కొనసాగే అవకాశం ఉంటుంది. ఎన్నికల కమిషనర్‌కు హైకోర్టు న్యాయమూర్తి స్థాయి హోదా లభిస్తుంది.. హైకోర్టు జడ్జెస్‌ యాక్ట్‌ 1954 ప్రకారం అలవెన్స్‌లు, జీత భత్యాలు అందుతాయి.

రిటైర్డ్‌ ఐఏఎస్‌లు ప్రభుత్వ పెద్దల వద్ద పని చేసి ఉండటం వల్ల చాలా సందర్భాల్లో వారి ‘నిష్పాక్షికత’ ప్రశ్నార్థకంగా మారుతోందంటోంది ప్రభుత్వం. అందుకే స్థానిక సంస్థల ఎన్నికలను పారదర్శకంగా, నిష్పాక్షికంగా నిర్వహించాలనే లక్ష్యంతో ఎన్నికల సంస్కరణల్లో కొనసాగింపుగా ఎస్‌ఈసీగా హైకోర్టు రిటైర్డ్‌ జడ్జిని నియమించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నామని చెబుతున్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.