యాప్నగరం

వాలంటీర్ల పనితీరు బాగోలేదు, ప్రజల్లోకి వెళ్లలేకపోతున్నాం.. వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేల ఆవేదన?!

ఢిల్లీలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ అధికార ప్రతినిధి, ఎంపీ విజయసాయిరెడ్డి ఆధ్వర్యంలో శనివారం విశాఖ కలెక్టరేట్‌లో సమీక్ష జరగ్గా, నగరం సహా జిల్లాలోని పరిస్థితులపై ప్రజాప్రతినిధులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారట.

Samayam Telugu 22 Sep 2019, 12:20 pm
విశాఖపట్నం కలెక్టరేట్‌లో జిల్లా అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలుపై వైఎస్ఆర్సీపీ నేత, ఎంపీ వి.విజయసాయిరెడ్డి ఆధ్వర్యంలో సమీక్షా సమావేశం నిర్వహించారు. జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి మోపిదేవి వెంకటరమణ, మంత్రి అవంతీ శ్రీనివాసరావు, ఎంపీలు, ఎమ్మెల్యేలు తదితరులు ఇందులో పాల్గొన్నారు. ఈ సందర్భంగా అధికార పార్టీ ఎమ్మెల్యేలు తీవ్ర అసహనం వ్యక్తం చేసినట్టు తెలిసింది. ముఖ్యంగా ఇసుక కొరతపై ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోందని చెప్పినట్టు సమాచారం. ఇసుక కొరతతో అనేక మంది ఉపాధి కోల్పోయారని, తక్షణమే పరిస్థితిని చక్కదిద్దాలని ఎమ్మెల్యేలు కోరినట్టు విశ్వసనీయ వర్గాలు పేర్కొన్నాయి.
Samayam Telugu Capture_1065


ఇసుక కొరత వల్ల విశాఖలో నిర్మాణం రంగం కుదేలై అనేకమంది ఉపాధి కోల్పోయారని, దీని వల్ల ప్రజల్లో అపోహలు వ్యక్తమవుతున్నాయని అధికార పార్టీకి చెందిన నగర ఎంపీ అన్నట్టు తెలిసింది. ప్రత్యామ్నాయంగా రోబో సాండ్ను వినియోగంలోకి తేవడానికి చర్యలు చేపట్టి, పింఛన్లు, రేషన్ పంపిణీలో లోపాలు సవరించి ప్రజల్లో నెలకొన్న అపోహాలను తొలగించాలని ఆయన సూచించారట.

రెవెన్యూశాఖ పనితీరుతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, 22ఎ జాబితాల్లో భూములను చేర్చడం వల్ల వాటిని అమ్ముకోవాలంటే నానా తిప్పలు పడాల్సి వస్తోందన్నారు. ఆన్‌లైన్‌ విధానంలో భూ వివాదాలు పెరిగిపోగా, చక్కదిద్దాల్సిన రెవెన్యూ యంత్రాంగం చేతులెత్తేస్తోందన్నారట. భూ సమస్యలను పరిష్కరించాలని, రెవెన్యూ అధికారుల తీరు బాగోలేదని, పంచగ్రామాల భూ సమస్య కొలిక్కి తేవాలని పెందుర్తి ఎమ్మెల్యే కోరినట్టు సమాచారం.

తన నియోజకవర్గ పరిధిలో పోలీసులు ఇష్టానుసారం వ్యవహరిస్తున్నారని, ఎడ్ల బండితో ఇసుక తరలిస్తున్నవారిపై కూడా కేసులు పెడుతున్నారని, ఎస్పీకి చెప్పినా స్పందన లేదని చోడవరం ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ అన్నట్టు తెలుస్తోంది. వర్షాలకు తన నియోజకవర్గంలో రోడ్లు బాగా దెబ్బతిన్నాయని, ప్రజల్లోకి వెళ్లలేకపోతున్నామని, వాలంటీర్ల పనితీరు బాగులేదని గాజువాక ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి ఫిర్యాదుచేసినట్టు సమాచారం.

వినాయక చవితి ఉత్సవాల్లో పోలీసులు అతిగా వ్యవహరించారని, యువకులు డీజేలు పెట్టుకుంటే అరెస్టులు చేశారని అనకాపల్లి ఎమ్మెల్యే గుడివాడ అమర్‌నాథ్‌ చెప్పినట్టు తెలిసింది. పోలీసులు ఇష్టానుసారం వ్యవహరించి, చిన్నపాటి అంశాలకే గొడ్డును బాదినట్లు బాదుతున్నారని ఎమ్మెల్యే ఆవేదన వ్యక్తం చేశారట. వినాయక చవితి ఉత్సవాల సందర్భంగా పోలీసులు అనుసరించిన తీరుతో ప్రజల్లో పార్టీ చులకనవుతున్నామని, రాజకీయంగా ఇబ్బందులొచ్చే పరిస్థితి నెలకొందని ఆయన వాపోయారట.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.