యాప్నగరం

గ్రామ వలంటీర్లను జగన్ సర్కార్ తీసేస్తోందా? హోరెత్తుతున్న ప్రచారం!

ఏపీలో 35 సంవత్సరాలు నిండిన గ్రామ, వార్డు వలంటీర్లను తొలగిస్తారంటూ పెద్ద ఎత్తున రూమర్లు వ్యాపించాయి.

Samayam Telugu 9 Dec 2020, 8:45 am
‘‘ఏపీలో గ్రామ, వార్డు వలంటీర్లపై పిడుగుపాటు. 35 ఏళ్లు నిండిన వలంటీర్లు ఇంటికే. ఉత్తర్వులు జారీ చేసిన సంస్థ కమిషనర్. జిల్లాలో వందల సంఖ్యలో వలంటీర్లకు ఇక ఉద్వాసనే! మూణాళ్ల ముచ్చటగా ముగియనున్న వలంటీర్ల సేవలు’’ ఇదీ మంగళవారం ఉదయం నుంచి సోషల్ మీడియాలో హోరెత్తిన ప్రచారం. ఓ పత్రికలో దీనిపై వార్త వచ్చింది. దీంతో 35 సంవత్సరాలు నిండిన గ్రామ, వార్డు వలంటీర్లను తొలగిస్తున్నారని సోషల్ మీడియాలో ఒకటే హోరు. దీంతో గ్రామ, వార్డు వలంటీర్లలో ఆందోళన చెలరేగింది.
Samayam Telugu సీఎం జగన్

ఈ విషయం చివరికి ప్రభుత్వం దృష్టికి వచ్చింది. దీంతో తాడేపల్లిలోని సచివాలయ శాఖ కమిషనర్, డైరెక్టర్ ఓ ప్రకటన విడుదల చేశారు. 35 ఏళ్లు నిండిన వలంటీర్లను తొలగిస్తున్నారన్న వార్తలో ఏమాత్రం నిజం లేదని తేల్చి చెప్పారు. ఇది కేవలం దృష్ప్రచారమే అని తేల్చి చెప్పారు. అసలేం జరిగిందో ఆ ప్రకటనలో వివరించారు. ‘‘అందరికీ తెలియజేయునది ఏమనగా.. 35 సంవత్సరములు నిండిన వాలంటీర్లను తొలగించుచున్నామని ఒక పత్రికలో అనవసమైన అనుమానములకు తావిచ్చేలా వార్త ప్రచురించారు. వాలంటీర్లను అనవసరమైన భయాందోళనలకు గురిచేసేలా వార్తను ప్రచురించారు.

వాస్తవంగా అది కేవలం నిబంధనలకు విరుద్ధంగా ఎంపికైన కేవలం 6 మందిని మాత్రమే తొలగించాల్సిందిగా తెలియచేయడమైనది. మిగిలిన వారెవరూ తొలగించబడరు. కాబట్టి నిబంధనలకు అనుగుణంగా నియమించబడిన ఏ వాలంటీరు ఎటువంటి ఆందోళనలకు గురి కావద్దు.’’ అని సచివాలయ శాఖ డైరెక్టర్ తేల్చి చెప్పారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.