యాప్నగరం

Rythu Ratham: రైతులకు గుడ్ న్యూస్.. సబ్సిడీపై ట్రాక్టర్లు.. కొద్ది రోజులే గడువు.. దరఖాస్తు ఇలా!

Rythu Ratham పథకంలో భాగంగా జగన్ సర్కారు అన్నదాతలకు సబ్సిడీతో ట్రాక్టర్లను అందించనుంది. ఇందుకోసం ముగ్గురు లేదా అంతకు మించి రైతులు ఓ గ్రూపుగా ఏర్పడాల్సి ఉంటుంది. అనంతరం బ్యాంకులో గ్రూపు పేరిట ఖాతా తెరిచి రైతు భరోసా కేంద్రంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఎంపికైన రైతులకు ప్రభుత్వం సబ్సిడీ అమౌంట్‌ను గ్రూపు ఖాతాలో జమ చేస్తుంది. దానికి మిగతా మొత్తాన్ని చేర్చి రైతులు తమకు నచ్చిన ట్రాక్టర్ కొనుగోలు చేయాల్సి ఉంటుంది.

Authored byరవి కుమార్ | Samayam Telugu 28 May 2022, 5:05 pm

ప్రధానాంశాలు:

  • ఏపీ రైతులకు గుడ్ న్యూస్
  • సబ్సిడీపై ట్రాక్టర్లు ఇవ్వనున్న జగన్ సర్కారు
  • రైతు రథం కోసం దరఖాస్తు చేసుకోవడం ఇలా..
హైలైట్స్ చదవాలంటే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి
Samayam Telugu tractors for distribution.
Rythu Ratham Tractors | File Photo
Rytu Ratham | అన్నదాతల కోసం ఇప్పటికే ఎన్నో పథకాలను అమలు చేస్తోన్న జగన్ సర్కారు తాజాగా మరో నూతన పథకానికి శ్రీకారం చుట్టింది.‘రైతు రథం’ పేరిట రైతులకు ట్రాక్టర్లను పంపిణీ చేసే కార్యక్రమాన్ని ఏపీ ప్రభుత్వం ప్రారంభిస్తోంది. జూన్ ఆరో తేదీన ఈ పథకం ప్రారంభం కానుంది. అదే రోజున రైతులకు 6 వేల ట్రాక్టర్లను పంపిణీ చేయనున్నారు. ఈ పథకం కింద ట్రాక్టర్ పొందడం కోసం చిన్న, సన్నకారు రైతులు ఓ గ్రూపుగా ఏర్పడాల్సి ఉంటుంది. కనీసం ముగ్గురు రైతులు ఓ గ్రూపుగా ఏర్పడి.. దానికి పేరు పెట్టాలి.
ప్రతి రైతు తమ పట్టాదారు పాస్ పుస్తకం, ఆధార్ కార్డ్, పాన్ కార్డ్ జిరాక్స్ కాపీలతో పాటు.. బ్యాంక్ నుంచి బకాయిలేవీ లేవని నిర్ధారించే నో డ్యూ సర్టిఫికెట్‌ను రైతు భరోసా కేంద్రంలో అందించాలి. ఇలా చేశాక.. గ్రూప్ పేరుమీద బ్యాంక్ ఎకౌంట్ ఓపెన్ చేయాలి. జూన్ రెండో తేదీ లోగా ఈ ప్రక్రియ పూర్తి చేసిన రైతులు సబ్సిడీ ట్రాక్టర్ల (Subsidy Tractors) కోసం దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. రైతులు తమకు నచ్చిన ట్రాక్టర్‌ను ఎంపిక చేసుకోవచ్చు. ట్రాక్టర్‌కు సంబంధించిన వివరాలను సైతం రైతు భరోసా కేంద్రానికి సమర్పించాలి.

రైతు రథం కింద ఎంపికైన రైతు గ్రూపు ఖాతాకు ట్రాక్టర్ సబ్సిడీ మొత్తాన్ని బదిలీ చేస్తారు. మిగతా మొత్తం చెల్లించి రైతులు ట్రాక్టర్ కొనుగోలు చేయాల్సి ఉంటుంది. ఇలా గ్రూపులుగా ఏర్పడిన రైతులకు ట్రాక్టర్లు మాత్రమే కాకుండా ఇతర వ్యవసాయ పనిముట్లను సైతం ప్రభుత్వం అందిస్తుంది. పురుగు మందులు పిచికారీ చేయడం కోసం డ్రోన్లను సైతం రైతులకు అందించనుంది.

వాస్తవానికి చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) హయాంలోనే ‘రైతు రథం’ పథకాన్ని ప్రారంభించారు. ఈ పథకం కింద 20 వేల ట్రాక్టర్లను అందించాలని లక్ష్యంగా భావించిన టీడీపీ సర్కారు.. 2018లో 6 వేల ట్రాక్టర్లను పంపిణీ చేసింది. కానీ తెలుగు దేశం పార్టీ కార్యకర్తలకే ట్రాక్టర్లు ఇస్తున్నారనే ఆరోపణలు వచ్చాయి. జగన్ అధికారంలోకి వచ్చాక ఈ పథకాన్ని ‘వైఎస్ఆర్ రైతు రథం’ (YSR Rythu Ratham)గా మార్చేశారు.
రచయిత గురించి
రవి కుమార్
రవి కుమార్ సమయం తెలుగులో ప్రిన్సిపల్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. స్పోర్ట్స్, ఏపీ, తెలంగాణకు సంబంధించిన వార్తలు, ప్రత్యేక కథనాలు అందిస్తుంటారు. ఆయనకు జర్నలిజంలో 12 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వార్తలు, ఎడ్యుకేషన్ సంబంధింత అంశాలను అందించారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.